Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు మనిషి బతకడం కోసం సంపాదించేవాడు... కాని నేడు సంపాదించడం కోసం బతుకుతున్నాడు. అందు కోసం ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, స్నేహితులను, బంధువులను సైతం వదులుకుంటున్నాడు. ప్రపంచంలో సగానికి పైగా ప్రజలు ఆహారం కోసం నిత్యం యుద్ధం చేస్తుంటే.. కొంతమంది మాత్రం సంపాదించిన మొత్తాన్ని ఎలా రెట్టింపు చేయాలి.. తమ వారి కోసం ఎలా దాచి పెట్టాలనే ఆందోళనతో సతమతమవుతున్నారు. 'స్టీవ్ జాబ్స్' ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. 5లక్షల కోట్ల ఆస్తి పరుడు. 56ఏండ్ల వయసులో క్లోమ గ్రంధి క్యాన్సర్ వ్యాధితో మరణించే ముందూ చాలా బాధ పడ్డాడు. 'పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం. పని తప్ప సంతోషం గురించి తెలియదు. రోగంతో లేవలేని స్థితిలో ఉన్న నా జీవితాన్ని నెమరు వేసుకుంటే మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రతిష్టలు ఎందుకు కొరగావని తెలిసింది. కారు నడపటానికి డ్రైవర్ను పెట్టుకోవచ్చు. బాగా డబ్బు సంపాదించవచ్చు. కాని రోగాన్ని భరించడానికి ఎవ్వరిని అద్దెకు తెచ్చుకోలేమనే విషయం మరణ శయ్యపై పడుకున్నప్పుడు అర్థమయింది' అని అంటాడు. చాలా మంది తామెందుకు సంపాదిస్తున్నామో... ఎవరి కోసం సంపాదిస్తున్నామో తెలియనంత సంపాదిస్తున్నారని స్టీవ్ జాబ్స్ మాటలతో అర్థమవుతుంది. వంద రూపాయల గడియారమైనా.. లక్ష రూపాయల గడియారమైనా ఒకే సమయాన్ని సూచిస్తుంది. 30 గజాల ఇంల్లైనా, 3 వేల గజాల ఇల్లైనా నీ ఒంటరి తనం నీదే. సంతోషాన్ని బాహ్యవస్తువులతో కొనుక్కుంటే రాదు. మీ పిల్లకు ధనవంతులుగా కంటే... సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటం నేర్పండి. దాని వల్ల పెరిగి పెద్దయ్యాక వస్తువుల ధరల కంటే వాటి విలువ తెలుస్తుంది. నీ మంచితనం జీవితపు చివరి వరకూ నిన్ను మనిషిగా గెలిపిస్తుంది. వంద కారణాలు చూపినా నిన్ను ప్రేమించేవారు వదిలిపోరు. నీతో ఉండటానికి ఇంకొక కారణం చూపుతారు. అందుకే మంచి తనాన్ని, స్నేహితులను, మన అనేవారిని ఎప్పుడూ డబ్బులతో కొనలేం.
- ఊరగొండ మల్లేశం