Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతిపిత మహాత్మాగాంధీ మేక పాలను తాగేవారని పుస్తకాల్లో చదువుకున్నాం. ఆయనేకాదు దేశానికి ఈస్టిండియా కంపెనీ వచ్చే దాకా భారతీయులందరూ అయితే ఆవుపాలో, బర్రెపాలో లేదంటే మేకపాలో తాగేవారు. అంతే తప్ప వారికి అప్పటిదాకా కాఫీలు, టీలు తెలియదని చరిత్ర చెబుతున్నది. వ్యాపార నిమిత్తం ఈస్టిండియా కంపెనీ మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత... తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకోసం అనేక మాయోపాయాలు పన్నింది. అందులో భాగంగా మన జనాలకు టీని (ఛారు), టీ పొడి (ఛారు పత్తా)ని అలవాటు చేసిందంట. అయితే మొదట దానికి ధర నిర్ణయిస్తే... ఎవరూ దాన్ని పట్టించుకోరని భావించి, కొన్నేండ్లపాటు ముఖ్యమైన నగరాల్లో ఛారును ఉచితంగా పంపిణీ చేశారు. దాని రుచి మరిగిన తర్వాత... జనాలు టీ కోసం ఎగబడటం మొదలెట్టారు. తన పన్నాగం ఫలించినందకు మస్తు సంబరపడిన ఈస్టిండియా కంపెనీ.. ఇగప్పుడు ఛారుకు అప్పటి ద్రవ్యంలో కాణి, అర్థణా... ఇలా రేటు నిర్ణయించింది. దానికి అలవాటుపడిన మనోళ్లు... 'ఆ కాణేగా, అర్థణాయేగా...' అనుకుంటూ కప్పు మీద కప్పు లాగించటం ఆరంభించారు. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే... పైసా, పావలా, రూపాయి, ఐదు రూపాయలు, పది, ఇరవై... ఇలా చెప్పుకుంటూ పోతే ఫుట్పాత్ పక్కన టీ డబ్బా దగ్గర్నుంచి ఖరీదైన ఐదు నక్షత్రాల హోటళ్ల వరకు ఇప్పుడు తేనీరు ధర వందలు, వేలల్లో ఉంటున్నది. ఈ ముచ్చటను వర్తమానానికి అన్వయించుకుని చూస్తే... ఓ రెండేండ్ల క్రితం వరకూ బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, ఒడాఫోన్, హచ్... ఇలా ఒకటేమిటి, పదుల సంఖ్యలో సంస్థలు, మొబైల్ వినియోగదారులకు సేవలందించేవి. ఆ క్రమంలో అప్పటి ఈస్టిండియా కంపెనీకి అసలు సిసలు వారసుడిగా అవతారమెత్తిన జియో సంస్థ... ఆనాడు మేకపాలకు బదులు జనాలకు ఛారును అలవాటు చేసినట్టు... ఉచితాల మీద ఉచితాలు, ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించింది. దాంతో మిగతా సంస్థల వినియోగదారులందరూ వాటిని వదిలేసి, జియో షోరూమ్ల ముందు క్యూ కట్టారు. దెబ్బకు బీఎస్ఎన్ఎల్ నుంచి ఐడియా దాకా అన్ని కంపెనీలూ దివాళా తీశాయి. ఇగిప్పుడు మొదలైంది అసలు కథ... మొన్నటిదాకా ఉచితాలు, ఆఫర్లను ప్రకటించిన జియో... ఇప్పుడు అమాంతం టారిఫ్లు పెంచేసి, జనం జేబులను గుల్ల చేస్తున్నది. ఇప్పుడు వేరే సిమ్ కార్డుకు మారదామన్నా మారలేని పరిస్థితి. ఇక్కడ గమ్మత్తేమిటంటే... ఇంగ్లీషు క్యాలెండరులో లీఫు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు తప్పితే, మిగతా అన్ని సంవత్సరాల్లో అన్ని నెలలకు 30 రోజులు (ఫిబ్రవరి మినహా) కచ్చితంగా ఉంటాయి. కానీ జియో సిమ్ కార్డుకు ఏ నెల్లో అయినా రీఛార్జి చేస్తే మాత్రం... 28 రోజులకే ఖేల్ ఖతం దుకాన్ బంద్, చచ్చినట్టు మళ్లీ రీఛార్జి చేయాల్సిందే. అంటే రెండు రోజుల సేవలను మనం కోల్పోవాల్సిందే. ఈ చొప్పున దేశంలో ఎన్ని కోట్ల మంది వినియోగదారులు, ఎన్ని కోట్ల రూపాయల రీఛార్జి డబ్బులు.... ఆ ప్రకారంగా జియో సంస్థకు ఎంత లాభం.. లెక్కలేసుకుంటే, దిమ్మ తిరిగి బొమ్మ కనబడటం ఖాయం.
-బి.వి.యన్.పద్మరాజు