Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేదకాలం నాటి గురుకులాల శృతమయ జ్ఞానం నుంచి నేటి ఆధునిక బడుల సాంకేతికమయ జ్ఞానం వరకు గురువును మించిన తెరువు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గురువుకు గూగుల్ ప్రత్యామ్నాయమే కాదన్నది నిజం .సమాజంలో గురువుది ఎప్పటికీ గురుతర బాధ్యతే. లోకం తెలియని పసి బిడ్డల్ని వివిధ వృత్తుల్లో గౌరవప్రదంగా నిలబెట్టగలిగేది ఉపాధ్యాయుడు మాత్రమే. అందుకే ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తికి ఇప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
విశ్వమంత గౌరవం :
ఉపాధ్యాయుల ప్రాధాన్యాన్ని గుర్తించని ఏ జాతి మనుగడ సాగించదు .అందుకే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం కోసం మన దేశంలో ఏటా సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుండగా,ప్రపంచమంతటా అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. యునెస్కో నిర్ణయించిన ప్రకారం 1994 నుండి వందకు పైగా దేశాలు ఈ వేడుకలో పాలు పంచుకోవడం విశేషం .ప్రతీ సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొంటున్నాయి .కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది కూడా 'సంక్షోభాలను అధిగమించడం -భవిష్యత్ పునరాలోచన' అనే అంశాన్ని నిర్ణయించారు .
ఉపాధ్యాయునికి ప్రపంచమంతా ఒకే రకమైన గుర్తింపు ఉన్నా, కొన్ని దేశాల్లో అగణితమైన ఆదరాభిమానాలు చూపిస్తుండడం గమనార్హం .
అమెరికాలో వికలాంగులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులకు మాత్రమే వి.ఐ.పి హోదాను ఇవ్వడం జరుగుతోంది. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో న్యాయస్థానంలో ఉపాధ్యాయునికి మాత్రమే కుర్చీ అందజేస్తారు. మరెవ్వరికీ ఆ గౌరవం దక్కదు. కొరియాలో ఉపాధ్యాయుడు తన గుర్తింపు కార్డు చూపించి మన దేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు పొందుతున్న అనేక సదుపాయాలను కూడా పొందే అవకాశం ఉంది.
బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులు:
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి దిశగా నిరంతరం శ్రమించే వారు ఉపాధ్యాయులు. ప్రతి విద్యార్థి లో ఉండే ప్రత్యేకతలను వెలికితీసే బృహత్తర బాధ్యత గురువులదే. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో ఉపాధ్యాయునిదే కీలక భూమిక. పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థులతో విలువల సాధన దిశగా ఉపాధ్యాయుడు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. విభిన్న పరిసరాల నుంచి, విభిన్న నేపథ్యాల నుంచి, వేర్వేరు ప్రజ్ఞా కౌశలాలు కలిగిన విద్యార్థులకు ఒకే వేదికపై బోధించవలసి వచ్చినప్పుడు ఉపాధ్యాయుడు పడే శ్రమ అంతా ఇంతా కాదు.
సవాళ్లు ఎన్నో:
ఇంతకాలం ఉపాధ్యాయుల కొరత, శిక్షణ తదితర విషయాలపై మాత్రమే దృష్టి ఉండేది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయునికి తరగతి గదిలో బోధన సవాలుగా మారుతోంది. కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు బడికి రాలేని గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జూన్ లో జరగాల్సిన తరగతులు జూమ్ లో జరుగుతున్నాయి .తమ పరిధి మారిపోవడంతో ఆన్ లైన్ లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల మానసిక స్థితి కూడా మారుతోంది. తరగతి గదిలో స్వేచ్ఛాయుతంగా పాఠం చెప్పే ఉపాధ్యాయులు ఇప్పుడు కెమెరా ముందు నిలబడి పాఠాల్ని చెప్పడం సాంకేతికంగా ఎదుగుదలకు సహకరిస్తున్నా శారీరక మానసిక దుష్ఫలితాలు రానున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మనదేశంలో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులకు సరైన గౌరవం దక్కడం లేదన్న భావన బలంగా ఉంది .కామన్ స్కూల్ విధానం లేకపోవడం వల్ల ఒక్కో ప్రాంతంలో ఉపాధ్యాయులకు ఒక్కోరకమైన బోధనా పరిస్థితులు, జీతభత్యాలు నిర్ణయించడం అసమానతలకు దారి తీస్తోంది. ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోలా విద్యావిధానాలు రూపొందిస్తుండడం వారి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉపాధ్యాయులు కేవలం అధికారుల ఆజ్ఞలు అమలు చేసే మర మనుషుల్లా మారిపోతున్నారు. ఉత్తీర్ణత మాత్రమే ప్రథమ ప్రాధాన్యంగా ఉన్న ప్రభుత్వాలు విద్యార్థుల జ్ఞాన ప్రసార వాహకాలుగా ఉపాధ్యాయుల్ని చూస్తూ మార్కులను తీసుకొచ్చే యంత్రాలుగా మారుస్తున్నారు. విద్యార్థుల్లో ఉండే వైయక్తిక బేధాలను బట్టి, ఉత్తీర్ణతలో వచ్చే హెచ్చుతగ్గులకు ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ వారి మెడపైన సస్పెన్షన్, ఇంక్రిమెంట్ల కోత వంటి కత్తులను వేలాడదీస్తున్నారు. ఇది మాత్రమే గాక సర్వీస్ రూల్స్, ప్రమోషన్ రూల్స్ వంటి వాటిలో ఉన్న తీవ్ర నిర్లక్ష్యం, అసమానతలు ఉపాధ్యాయ వర్గంలో అసంతృప్తి ఆవేదనకు కారణాలు గా మారుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో లో పనిచేసే ఉపాధ్యాయులు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బుద్ధిజీవులు, మేధావులు అయిన ఉపాధ్యాయులకు ఇక్కడ తగిన రక్షణ గానీ, అభివృద్ధి గానీ ఉండవు. నైపుణ్యం, పనితీరు ప్రాతిపదికలుగా గాక విద్యార్థుల సంఖ్య, పాఠశాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉపాధ్యాయులకు జీతభత్యాలు నిర్ణయించడం వల్ల ప్రైవేటు, కార్పొరేటు వ్యవస్థలో ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల జీతభత్యాలు కోత పడగా, ప్రైవేటు ఉపాధ్యాయులు అయితే ఏకంగా ఉద్వాసనకు గురయ్యారు. ఫలితంగా చిరు వ్యాపారులుగా రోడ్డున పడ్డ వారు కొందరైతే, కూలీలుగా మారిపోయిన వారు ఎందరో.
పాలకులదే బాధ్యత:
దేశ విహిత క్షేమాన్ని కాంక్షించే పాలకులు ముందుగా పాఠశాలలు, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించాలి. సమాజ నిర్మాణంలో, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులకు తగిన గౌరవాన్ని కల్పించడంలో పాలకులు చొరవ చూపాలి .ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే ఉన్నత సాంకేతిక వ్యవస్థను రూపొందించాలి. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. దీర్ఘకాలిక సర్వీస్ సమస్యలతో పాటు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వంటి సమస్యలు ఉపాధ్యాయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒజ్జ బతుకు మరుగుజ్జు బతుకు కాకుండా ప్రభుత్వం నుంచి నైతిక, హార్థిక మద్దతు ఎంతైనా అవసరం, స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించే వాతావరణం పాఠశాలల్లో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
ఇకపోతే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అనుభవించే దుర్భర పరిస్థితి వర్ణనాతీతం. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా ఆకలి కేకలు ,ఆత్మహత్యలు సమాజాన్ని కలచివేశాయి .కనీస వేతనాలు నిర్దేశిత పనివేళలు లేక సతమతమవుతున్నప్పటికీ చిత్తశుద్ధితో ఉద్యోగం నిర్వహించే ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతను కల్పించే దిశగా చట్టాలను బలోపేతం చేయాలి. కనీస వేతనాలను ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలి. విద్యా వ్యవస్థ బలోపేతం చేయడంలో నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని ఉపాధ్యాయులకు కల్పించాలి. కేవలం ఏసీ గదుల్లో రూపొందించిన విద్యావిధానాలను ఉపాధ్యాయులపై రుద్దడం మానేసి క్షేత్రస్థాయిలో అవగాహన ఉన్న ఉపాధ్యాయులకు పాఠశాలల బలోపేతం చేసే నిర్మాణాత్మక పాత్రను కల్పించాలి. అప్పుడే విద్యా వ్యవస్థ వికాసం, ఉపాధ్యాయుని అభివృద్ధి సాధ్యపడుతుంది. తనపై ఉంచిన 'గురు'తర బాధ్యత ఉపాధ్యాయులు మరింత సమర్థంగా నిర్వహించడానికి తోడ్పడుతుంది. ఆ దిశగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాలు అడుగేస్తాయని ఆశిద్దాం .
- ఒంటేరు శ్రీనివాసులరెడ్డి
గౌరవాధ్యక్షులు,
ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక
ఆంధ్ర ప్రదేశ్
9885609999