Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశవాణిపై కేంద్ర ప్రభుత్వం చూపి స్తోన్న నిర్లక్ష్యవైఖరి, క్రమ క్రమంగా విక్రయించా లనే ఆలోచనలు చేయడం, వాటి మనుగడనే ప్రశ్నార్థ కంగా మార్చివేయడం బాధాకరం. ప్రకటనలు తెచ్చుకోండి.. మీ ఆదాయం సమకూర్చుకోండి అని ఆదేశాలు జారీ చేయడం. వివిధ పట్టణాల్లో ఉన్న స్టేషన్లను క్రమంగా మూసివేసే కార్యక్రమానికి తెరలేపడం. ప్రసార భారతిని రెండుగా చీల్చే కుట్రలు చేస్తున్నారనే వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నది. మారుమూల ప్రజలకు సమాచారం వినోదం అందించడంలో ఆల్ఇండియా రేడియో (ఆకాశవాణి) అందిస్తున్న సేవలు అజరామరమైనవి. దేశంలో 420స్టేషన్లు కలిగి అన్ని భాషలలో ఆకాశవాణి కార్యక్రమాలు అందజేస్తున్నది. దాదాపు 60ఏండ్ల నుంచి ఈ రేడియో కార్యక్రమాలకు కోట్లాది అభిమాన శ్రోతలు ఉన్నారు.
ఆకాశవాణి ప్రధాన ఉద్ధేశ్యం ప్రజలకు సమాచారం అందించడం. అనేక సంక్షోభ సమయాల్లో, విపత్తుల సమావేశాల్లో మారుమూల ప్రాంతాలకు, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రేడియో చేస్తున్న సేవలు మరువలేం. ఆకాశవాణిని ఏ ఒక్క ప్రయివేటు ఎఫ్ఎమ్ స్టేషన్తో పోల్చకూడదు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు అందించే కార్యక్రమాలు ప్రసారం చేసే ఆకాశవాణిని నిర్లక్ష్యం చేయడం దారుణం.
1971లో ప్రారంభమైన 'వివిధభారతి' కార్యక్రమాలు 102.8 మెగాహెర్జ్ హిందీతో పాటు స్థానిక భాషలు కలిసి ప్రతిరోజూ 17 గంటల 17 నిమిషాల పాటు ప్రసారమవుతున్నాయి. వివిధభారతి ప్రసారం చేసే 'జనరంజని' 'ఈపాట మీకోసమే' 'మధురగీతాలు' 'పాటలపల్లకి' 'నవరాగం' కార్యక్రమాలు శ్రోతల మన్ననలూ పొందుతూనే ఉన్నాయి. ఎన్నో ప్రయివేటు ఎఫ్ఎం చానళ్ళు తామర తంపరగా పుట్టుకు వచ్చినా వివిధ భారతి కార్యక్రమాలకు ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గడంలేదు. ఆకాశవాణి కార్యక్రమాలకు శ్రోతలు ఉత్తరాల ద్వారా, ఇ-మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా పాటలు కోరుకుంటున్నారు. ప్రతిరోజూ ఆదరణ పెరుగుతుందనడానికి ఒక వారం రోజులు ఆ కార్యక్రమాలు వింటే ఎవరైనా అర్దమవుతుంది. వివిధ భారతి తెలుగు కార్యక్రమాలకు దాదాపు 40లక్షలమంది రెగ్యులర్ శ్రోతలు ఉన్నట్టు ఒక అంచనా. చాలా గ్రామాల్లో దినసరి కూలీలు, చేనేత కార్మికులు, బీడికార్మికులు, క్షురకుల, దర్జీలకు ప్రతిరోజు రేడియో కార్యక్రమాలు ఒక అలంబన. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండజిల్లాలో ఏ చేనేత కార్మికుని ఇంట్లోకి వెళ్ళి చూసినా రేడియో ఒకవైపు మోగుతూనే ఉంటుంది.
ఆకాశవాణిలో ప్రసారం అయ్యే కార్యక్రమాలు ఏక కాలంలో పండిత పామరులను ఆకర్షిస్తాయి. ఎంతోమంది ఉన్నత అధికారులు, ఉద్యోగులు వివిధ హౌదాలలో ఉన్న వారికి ముఖ్యంగా గృహిణులు, విశ్రాంత ఉద్యోగులకు ఆకాశవాణి ఒక ప్రియనేస్తం. రోజువారి పనిచేసుకుంటూ శ్రమను మర్చిపోయే వినోదాన్ని పొందే ఆకాశవాణి శ్రోతలది ఒక కుటుంబం. వారిది ఒక ప్రపంచం. రేడియోతో వారి అనుబంధం వీడదీయలేనిది. ఒక్కసారి 'హల్లోఎఫ్ఎంతో' కార్యక్రమం వింటే ఆకాశవాణితో శ్రోతలకు ఏండ్ల తరబడి కొనసాగుతున్న అనుబంధం అర్దమవుతుంది. శ్రోతలు ఒకరిని ఒకరు కలుసుకోకున్నా ఒకరి గురించి ఇంకొకరికి చిర పరిచయం.
ఇప్పటికి పోస్ట్ఆఫీస్కు వెళ్ళి ఉత్తరాలు కొనుక్కోని నచ్చిన సినిమా పాటలు వ్రాయడం, తిరిగి వాటిని రేడియోలో వినడం అనేది ఒక అనుభూతి. వేలాది మంది శ్రోతలు ఇప్పటికీ అసంఖ్యాక ఉత్తరాలు వ్రాస్తున్నారంటే రేడియో ఎందరి జీవితాలతో మమైకమైపోయిందో అర్థం చేసుకోవచ్చు. వారి గుండె చప్పుడు తెలియాలంటే ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు వినాలి.
ప్రతిరోజు శ్రోతలకు బోర్ కొట్టకుండా వివిధ వినూత్న శీర్షికలతో విజ్ఞానాన్ని అందిస్తూ వినోధభరితమైన కార్యక్రమాలు రూపొందించడంలో సమర్పించడంలో వివిధభారతి లోని వివిధ విభాగాలు పడుతున్న శ్రమ శ్రోతలకు వినబడటమే కాదు కనబడుతుంది కూడా.
చక్కటి భాషా, స్పష్టమైన ఉచ్ఛారణతో సందోర్చచిత పాటలు, వివిధ ప్రత్యేక దినోత్సవాలు, సందర్భాలు వివరిస్తూ విశ్లేషిస్తూ ప్రసారం చేసే కార్యక్రమాలు చాల పరిశోధనాత్మకంగా ఉంటాయి. ప్రతిరోజు 'హరివిల్లు' 'బృందావనం' శీర్షిక క్రింద ప్రసారం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. తెలుగుభాషను కాపాడుతున్న ప్రసార ప్రచార మాధ్యమాలలో ఆకాశవాణి మొదటిస్థానంలో ఉంటుందని గట్టిగా చెప్పవచ్చు. ఎక్కడా శృతిమించకుండా నిబద్ధతో, క్రమశిక్షణతో పనిచేసే సిబ్బంది ఆకాశవాణి సొంతం.
1997లో ప్రసారభారతి కార్పోరేషన్ ఏర్పాటు అయిన నాటి నుంచి ఆకాశవాణి దురదర్శన్లకు గడ్డుకాలం మొదలైంది. కొత్త రిక్రూట్మెంట్స్లేక, ప్రమోషన్లులేక డిప్యూటేషన్లతో నెట్టుకురావడం... క్రమక్రమంగా ప్రయివేటు ఎఫ్.ఎంలకు అణుమతులు ఇవ్వడం, మొదలైన చర్యలతో ప్రభుత్వాలే ఆకాశవాణిని అణగదొక్కాయి.
'ఆకాశవాణి' అందరిది. వివిధభారతి విభిన్న వర్గాలది. దీనిని కాపాడుకోవడం అందరి భాద్యత. నరేంద్రమోడీగారూ.. మీ మనస్సులో మాటను మాకు అందజేసే సాధనం రేడియో. ఒక్కసారి ''సామాన్యుల మనస్సులో మాట'' వినండి.
- సురేష్ కాలేరు
సెల్:9866174474