Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోట్ల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఆగస్టు 14న ఏసీబీకి పట్టుబడిన కీసర మాజీ తహసిల్దార్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ ఆత్మహత్యకు పాల్పడి జీవితాన్ని ముగించడం విషాదకరమైన పరిణామం. ఓ భూవివాద పరిష్కారానికి రెండు కోట్ల రూపాయలను డిమాండ్ చేసి 1.10 కోట్లు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంఘటన ఏసీబీ చరిత్రలోనే అతి పెద్దది. భారీ మొత్తంలో నోట్లకట్టలతో ఏసీబీకి పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సష్టించింది. విచారణ పూర్తి కాకుండానే మరో కేసు నమోదు కావడం, బెయిల్ రాకపోవడం, వరుస విచారణలు అన్నీ చుట్టుముట్టడంతో తీవ్ర మానసిక వేదనతో, ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకున్న ఈ తాజా ఉదంతం అక్రమార్కులకు ఓ గుణపాఠంగా నిలుస్తుంది. అవినీతికి పాల్పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలలో ఇది మొదటిది కాదు, బహుశా చివరిదీ కాకపోవచ్చు. గతంలో అనేకమంది అవినీతి కేసులలో ఇరుక్కొని బలవన్మరణాలకు పాల్పడ్డారు. అవినీతికి పాల్పడుతున్న వ్యక్తుల కారణంగా వారి జీవితాలతో పాటు కుటుంబసభ్యుల జీవితాలు కూడా బలవుతున్న సంఘటనలు మన కండ్ల ముందే కదలాడుతున్నాయి. ఇటీవల బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్పేట ఆర్ఐ పదిహేను లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం, అదే కేసులో తహసిల్దార్ గహంలో దొరికిన రూ.30 లక్షలకు సంబంధించిన లెక్కలు చెప్పకపోవడంతో ఏసీబీ దానిని అవినీతి సొమ్ముగా నిర్ధారించి తాహసిల్దార్ను అదుపులోకి తీసుకుంది. దీంతో అవమానంగా భావించిన ఆమె భర్త ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటంతో అప్పటివరకు సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఆకుటుంబం చిన్నాభిన్నమైంది. గత సంవత్సరం అబ్దుల్లాపూర్ మేట్ తాహసిల్దార్ను రైతు సజీవదహనం చేసి తాను ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆయా కుటుంబాలలో విషాదభరితమైన పరిణామాలు సంభవించాయి. అవినీతికి పాల్పడుతున్న లంచగొండులు అవి వెలుగులోకి రావడంతో అవమానాలకు గురై తనువు చాలించిన ఉదంతాలు ఓవైపు, అవినీతిపరులు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేక, ఇచ్చినప్పటికీ పనులు కాకపోవడంతో బాధితులు ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు మరోవైపు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇటీవల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు తన తండ్రి పేరుతో ఉన్న 1.20 ఎకరాల భూమిని తన పేరుమీద పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగి వేసారి రెవెన్యూ అధికారుల దాష్టీకానికి బలైపోవడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. భూమి పట్టా కోసం రెవెన్యూ అధికారులకు 3500 రూపాయల లంచం ఇచ్చానని, అయినా పట్టా చేయకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన చావుకు తహసీల్దార్, వీఆర్ఓ కారణమంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడటం రెవెన్యూశాఖలో పాతుకుపోయిన అవినీతికి నిదర్శనంగా కనపడుతోంది. సమాజంలో గౌరవంగా జీవించడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి జీతభత్యాల రూపంలో ఉద్యోగులకు నికరమైన ఆదాయం నెలతిరిగే సరికి వస్తున్నప్పటికీ అపరిమితమైన కోర్కెలను తీర్చుకోవడానికి కొందరు అవినీతికి పాల్పడి ఇతర ఉద్యోగులు, సమాజం ముందు అవమానాలను ఎదుర్కొంటున్నారు. ప్రజలకు చేసే సేవలకుగాను ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ప్రభుత్వం వేతనాలు ఇస్తున్నప్పటికీ మళ్లీ అదే ప్రజలకు చేసే పనులకుగాను అవినీతిపరులు డబ్బులకోసం వేధిస్తున్నారు. మితి మీరుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ఏసీబీ కేసులు నమోదు అవుతున్నప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది లంచగొండుల ప్రవర్తన మొత్తం ఉద్యోగ వర్గాలకే మచ్చ తెస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వేళ్లూనుకు పోతోందనటానికి ప్రతినిత్యం ఏదో ఒక శాఖకు చెందిన ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతుండటం నిదర్శనంగా నిలుస్తోంది. కొందరు అవినీతి అక్రమార్కుల చర్యల వలన మొత్తం ఉద్యోగులంతా సమాజంలో గౌరవాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగ నిర్వహణ, ప్రజాసేవ ప్రక్కనపెట్టి అక్రమార్జనే అసలు పనిగా పెట్టుకుని ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. అవినీతి అనకొండల దోపిడీకి సామాన్యుడు ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట బలవుతూనే ఉన్నాడు. ఏటా వందల మంది ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కుతున్న పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావడంలేదు. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కోటి 12 లక్షల రూపాయల లంచానికి ఒప్పందం కుదుర్చుకుని 40 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం, మల్కాజిగిరి ఏసీపీపై అవినీతి నిరోధకశాఖ జరిపిన సోదాలలో వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడడం ఇందుకు తాజా ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వివిధ శాఖల్లోని కొందరు ఉన్నతాధికారులు సైతం కిందిస్థాయి అధికారుల ద్వారా అడ్డగోలుగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చైతన్యవంతమైన, అక్షరాస్యులైన ప్రజలు అక్కడక్కడ ఏసీబీని ఆశ్రయిస్తుండటంతో కేసులు నమోదవుతున్నాయి. అవినీతి నిరోధకశాఖ కేసులలో అరెస్ట్ అయిన వారి పిల్లలు తాము చదివే విద్యాసంస్థలలో,సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ఈ సంఘటనలు దుష్ప్రభావం చూపెడుతాయని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ అక్రమార్కుల ఆలోచనా విధానంలో మార్పు రాకపోవడం విచారకరం.
వాస్తవానికి అవినీతి అక్రమాలు ప్రతిశాఖలో తెర మాటున నిత్యకత్యమై పోతున్నా తెరమీదకు వచ్చేవి కొన్ని మాత్రమే. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇస్తేగాని ఫైలు ముందుకు కదలదు. లేదంటే ప్రజలను కాళ్లు అరిగేలా తమ చుట్టూ తిప్పుకుంటారు. సహనం, ఓపిక నశించిన ప్రజలు సొమ్ములు సమర్పిస్తున్నారు. లేనట్లయితే ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. కొంత మంది ఉద్యోగుల్లో స్వార్థం పెరిగిపోయి విలాసాలకు తాము అలవాటుపడి, తమ కుటుంబాలను ఆ రొంపిలోకి దింపి లంచాలకు తెగబడుతున్నారు. పట్టుమని పదేండ్ల సర్వీసు చేయకముందే ఖరీదైన కార్లను, బంగళాలను, విలువైన స్థలాలను కొనుగోలు చేస్తూ అక్రమాస్తులు దండిగ పోగేస్తున్నారు. అవినీతి కేసుల్లో చిక్కుకున్న ఉద్యోగులు తమకున్న డబ్బు, పలుకుబడి ద్వారా అతి తక్కువ కాలంలోనే కేసులను మాఫీ చేయించుకుంటూ తిరిగి ఉద్యోగంలో చేరి పదోన్నతులు పొందుతున్న ఉదాహరణలు కూడా కోకొల్లలు. వాస్తవానికి ప్రతిశాఖలో నిజాయితీగా, నిస్వార్ధంగా పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటున్నప్పటికీ లంచా వతారుల వలన వారు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కఠినంగా తీసుకోవాలి. అవినీతికి పాల్పడే అధికారులను, ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తీసివేసే అవినీతి నిరోధక చట్టాలను తీసుకు రావలసిన అవసరం. అవినీతి కేసుల్లో సత్వర న్యాయ విచారణలు జరిపి న్యాయస్థానాలు నిందితులకు కఠినశిక్షలు విధించాలి.ప్రతి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలి. అడ్డగోలు సంపాదన కోసం అవమానాలకు, అవహేళనలకు గురై తనువు చాలిస్తున్న వారి జీవితాల నుంచైన లంచ గొండులు గుణపాఠం నేర్చుకోవాలి.
- బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి
సెల్: 9440966416