Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దసరా... తెలుగు లోగిళ్లలో కళకళలకు ఈ పండగ మారు పేరు. బతుకమ్మ ఆటలు, అలరు బలరు పాటలు, ఊళ్ల ప్రయాణాలు, ఉత్సాహం ఉరకలెత్తే జీవితాలు...బళ్లో పోరగాళ్లకు పది రోజులపాటు సెలవులు, ఆ కాలంలో అమ్మలు, అమ్మమ్మలు చేసే పిండి వంటల ఘుమ ఘుమలు... మటన్, చికెన్ పలావులు, పిల్లా పెద్దా అంతా ఒక చోట జేరి చేసే విందు భోజనాలు... ఒకటేమిటి దసరా వస్తూనే మనకెన్నో సరదాలను తెచ్చి పెడుతుంది. పురాణాలు, ఇతిహాసాల్లోని కథల మాటెలా ఉన్నా తెలుగోళ్ల జీవితాల్లో తనకంటూ ఒక పేజీని సుస్థిరం చేసుకున్నది ఈ పెద్ద పండగ. అది రావటానికి పది రోజుల ముందు నుంచే పట్నం నుంచి పల్లె దాకా ఒకటే సందడి. బట్టల షాపులు, నగల దుకాణాలు, కిరాణా కొట్లు, సినిమా హాళ్లు ఒకటేమిటి ఎక్కడ చూసినా విపరీతమైన రద్దీ. కిక్కిరిసిపోయిన బస్సులు, రైళ్లతో ప్రయాణాలు మహా జోరుగా సాగుతాయి. పండగ అయిపోయిన తర్వాత కూడా నాలుగైదు రోజులపాటు ఇదే సందడి. కానీ ఈ యేడాది ఆ సందడి సన్నగిల్లింది. జనాల్లో జోరు తగ్గి వారి మోములు కళ తప్పాయి. ఈ యేడాది మార్చిలో ప్రారంభమైన కరోనా ఇప్పటికీ కరాళ నృత్యం చేస్తుండటంతో 'బతుకు జీవుడా...' అనుకుంటూ ప్రజలు కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఎండకాలంలో సూరీడు తన కోపాన్నంతటినీ మనుషుల మీద చూపించగా... నేనేం తక్కువ కాదంటూ వరుణుడు సైతం ఈ మధ్య శత్రువుల మీద దాడి చేసినట్టుగా పగబట్టి మరీ మొదనష్టపు వానలు కురిపించాడు. ఆ దెబ్బకు పోటెత్తిన వరదలు హైదరాబాద్ను ముంచెత్తాయి. బస్తీలకు బస్తీలు, కాలనీలకు కాలనీలు ఇంకా మురుగు నీటిలోనే నానుతున్నాయి. మరోపక్క ఊళ్లలో వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట మట్టికొట్టుకుపోయింది. దాంతో అన్నదాత నోటి కాడ ముద్ద గంగ పాలైంది. కరోనాతో ఎలా బతకాలో తెలియక అవస్థలు పడుతున్న ప్రజలకు ఇది నిజంగా 'పిడుగు' పాటైంది. వీటన్నింటి నుంచి తేరుకునేలోపే సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీంతో ఇప్పుడు జనాల్లో దసరా జోష్ లేదు, వారి ముఖాల్లో హుషారు లేదు. అందుకే కరోనా రక్కసి నుంచి మనం బయటపడ్డప్పుడు.. వరద బాధితుల జీవితం పట్టాలెక్కినప్పుడు.. రైతన్న కడగండ్ల నుంచి గట్టెక్కినప్పుడు.. బండి మీద ప్లాస్టిక్ సామాన్లమ్ముకునే నాలుగు గిర్రల బండి వాడి చేతిలో నాలుగు పైసలు పోగుబడ్డప్పుడే... అప్పుడే.. అప్పుడే.. అప్పుడే మనకు నిజమైన దసరా. ఆ సరదాలు త్వరలోనే రావాలని ఆశిద్దాం.
- బి.వి.యన్.పద్మరాజు