Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు అధికార టీఆర్ఎస్కు ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైనాయి. ప్రధానంగా గ్రేటర్లో వచ్చిన వరదలు అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. ఫీల్గుడ్ వెదర్తో ఎన్నికలకు వెళ్లి జీహెచ్ఎంసీని మరోసారి తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన గులాబీ బాస్కు ముచ్చెమటలు పడుతున్నాయట. అంతేగాక కార్పొరేషన్ పరిధిలోని ఆయా డివిజన్లు, లోతట్టు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ఎదురవుతున్న చేదు అనుభవాలను గమనిస్తే గ్రేటర్ ఎన్నికల్లో కారుకు ఫంక్చర్ అయ్యే పరిస్థితి ఉత్పన్నమైందనే వ్యాఖ్యానాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా వానలు రావడంతో, ముందస్తు సన్నద్ధత లేదనే విమర్శలను ఇప్పటికే కేసీఆర్ సర్కార్ మూటకట్టుకోవడం, అంతేగాక కేంద్రం నుంచి నిధులను తీసుకురావడంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకబడటంతో ఇప్పుడు ఆర్థిక సమస్యలు ముప్పిరిగొన్నాయి. విరాళాల కోసం పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో రాజకీయంగా ఫీల్గుడ్ పరిస్థితి క్రమేణా చెరిగిపోతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తున్నది. నవంబరు తర్వాత ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికలు జరగొచ్చనే లీకులను కేటీఆర్ ఇప్పటికే ఇవ్వడం గమనార్హం. ఈ తరుణంలో వరదలు టీఆర్ఎస్ మెడకు ఉచ్చు కావచ్చనే గుసగుసలు ఇటు ప్రగతిభవన్తోపాటు అటు తెలంగాణ భవన్లోనూ గుప్పుమన్నాయి. సరే..ఏం జరగనున్నదో కొంచెం ఓపిక పట్టుర్రి మరి...!
- బి.బసవపున్నయ్య