Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే నని చెబుతోంది. కానీ నేటికీ మన దేశం రెండు భారతాలుగా విభజితమై ఉంది. ఆకలి, పేదరికం, దారిద్య్రం, అవమానాలు, మెజార్టీ ప్రజలకు సొంతం కాబడితే, కొద్దిమంది చేతుల్లో సంపద కుప్పలు తెప్పలుగా పోగుపడింది. దేశ జనాభాలో 40కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉంటే, అంబానీ, ఆదానీల ఆస్తులు పెరిగి అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో అగ్రభాగాన నిలిచారు. రాజ్యాంగంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అని స్పష్టంగా పేర్కొనబడితే అవి ఎవరికి సొంతమైనాయో దీనినిబట్టి విధితమవుతుంది.
మూడువేల సంవత్సరాలుగా మానసిక చట్టాల ద్వారా పరిపాలిస్తున్న మనుస్మృతి విషమ స్వీయ ఆచారాలు మనిషిని పశువుకంటే నీచంగా చూస్తున్నాయి. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో పాదాల్లో నుంచి పుట్టారని చెప్పబడుతున్న శూద్రులు చదువు, భూమి, ఆభరణాలు, ఆయుధాలు, అధికారాలకు దూరంగా నెట్టివేయబడ్డారు. భారతీయ సామాజిక పరిస్థితిని పరిశీలిస్తే.. మిషనరీ స్కూల్స్, మిషనరీ హాస్పిటల్స్ నిర్మించి అంటరాని జాతులకు క్రిస్టియానిటీ విద్యా వైద్యం అందించింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి నుంచి నేటి వరకు దళితులకు విద్య, వైద్యం ఈ మేరకు అందింది అంటే బలమైన అంశం క్రిస్టియానిటీ ద్వారా సాధ్యమైందనడంలో అతిశయోక్తిలేదు. 'బానిసగా బతకడం అయినా పర్వాలేదు కానీ, ఆత్మగౌరవం చంపుకొని బతకడాన్ని ఒప్పుకోను' అంటాడు డా|| బి.ఆర్. అంబేద్కర్. నాటి దుష్ట శాస్త్రాలు బడిలో చదువనీయకపోతే మిషనరీ స్కూల్స్ ఏర్పడి చదువు నేర్పగా, గుడిలోకి అంటరానివారు రాకూడదు అంటే కులాలకతీతంగా చర్చి చేరదీసింది. నాటి దుష్ట సాంప్రదాయాల ప్రకారం దళితులను పొట్టిపేర్లు, నీచపు పేర్లతో పిలవాలని సెలవిచ్చింది మనుస్మృతి. ఎల్లయ్యను ఎల్లిగాడు అని సంబోధించింది. ఆ అవమానం నుంచి ఆత్మగౌరవం దగ్గరకు వెళ్ళడం మానవ సహజ నైజమే కదా! నలుదిక్కుల్లో ఏ దిక్కు నిలబడి చూసినా దారికడ్డంగా కనపడే పెనుభూతమే కులం అంటాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. అందుకే క్రిస్టియానిటిని కూడా కులం వదలలేదు. చివరికి కమ్మ, రెడ్డి, మాదిగ, మాలక్రైస్తవులుగా విభజితమై ఉంటున్నారు. దళిత క్రిస్టియన్లు తీవ్ర అణచివేతకు, వివక్షకు గురవుతూనే ఉన్నారు.
ఓవైపు ఉపాధి, మరో వైపు ఆత్మగౌరవం లభిస్తుందని వేలాదిమంది దళిత నిరుద్యోగులు పాస్టర్లుగా మారారు. అయితే దళిత క్రిస్టియన్లు మత స్వేచ్ఛను పొందలేకపోతున్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మతస్వేచ్ఛ, మతపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవటం, సంస్థలను ఏర్పాటు చేసుకోవటాన్ని రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా పేర్కొంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత క్రిస్టియన్లపై దాడులు పెరిగాయి. ఇంట్లో ప్రార్థన చేసుకుందామన్నా సంఘవ్యతిరేక శక్తులు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. పోలీసు పర్మిషన్ ఉందా? తహసిల్దారు నుంచి సర్టిఫికెట్ ఉందా? అని బెదిరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది దళిత పాస్టర్లు దారుణ హత్యకు గురయ్యారు. 2000లోనే సరిగ్గా 20 ఏండ్ల కిందే మతోన్మాదులు దళితుడైన పాస్టర్ బొట్ల రత్నంను కిరాతకంగా హత్యగావించారు. ఒడిషాలో గ్రహం స్టెయిన్ తన ఇద్దరు పిల్లలతో ఒక వాహనంలో బైబిల్స్ తీసుకొని వెళుతుండగా పెట్రోలుపోసి తగులబెట్టి ఆ ముగ్గురిని సజీవదహనం చేశారు. 2005లో దళిత పాస్టర్ హైజాక్ రాజ్ డానియల్ను మతోన్మాదులు కిరాతకంగా హత్యచేశారు. 2014లో వికారాబాద్లో దళిత పాస్టర్ సంజీవ్ని మతోన్మాద గూండాలు హతమార్చారు. 2017లో కె.ఎ. స్వామి అనే దళిత పాస్టర్ ట్యాంక్బండ్ వద్ద ఉండగా బైక్పై వచ్చిన 30మంది దుండగులు కిరాతకంగా దాడిచేశారు. ఆయన గత మూడేళ్ళుగా వీల్చైర్పై కనీస స్పృహలేకుండా ఉంటున్నాడు. నేటికీ ఏమి జరిగిందో మిస్టరీగానే ఉంది. పోలీసులు నిగ్గుతేల్చలేదు. దళిత క్రిస్టియన్లపై దాడులు జరిగినప్పుడు పోలీసులు రాజ్యాంగ దృష్టి, చట్టం దృష్టి మరిచి మతం దృష్టితో చూస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు జరిపి మిస్టరీని ఛేదించాలి. నిజామాబాద్, నర్సంపేటలలో చర్చీలకు నిప్పుపెట్టి దహనం చేశారు. బైబిల్స్ కాలబెట్టి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఎల్బినగర్లో చర్చి నిర్వహిస్తున్న దళిత పాస్టర్ను మాదిగలం... కొడుకా అంటూ అక్కడి పెత్తందారులు దౌర్జన్యం చేశారు. మీర్పేట్లో స్టీవెన్ అనే దళిత పాస్టర్, ఒక కుటుంబాన్ని పలకరించడానికి వెళ్ళారు. అక్కడే ఉన్న మతోన్మాదులు ఆ కుటుంబ సభ్యులు పాస్టర్పై దాడి చేశారు. నిజామాబాద్లో డేవిడ్ మాదిగ అనే పాస్టర్ తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటుండగా దాడి చేశారు. ఇలాంటి సంఘటనలు కోకోల్లలుగా జరిగాయి. దాడులు, హత్యలు జరుగుతున్నప్పుడు పోలీసులు రాజకీయ ఒత్తిళ్ళకు తొలగ్గకుండా పక్షపాతం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలి.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం క్రిస్టమస్ పండుగ సందర్భంగా బట్టలు పంపిణీ చేస్తున్నది. కానీ ఈ దాడులను అరికట్టలేకపోతున్నది. రాజ్యాంగ హక్కుగా ఉన్న మతస్వేచ్ఛను వినియోగంచు కోకుండా, మతోన్మాదులపట్ల రాజీ ధోరణితో ఉంది. క్రిస్టియన్స్లోని నూటికి 90శాతం మంది దళితులే. ఓసిలు క్రిస్టియానిటీలోకి వెళ్ళినా ఓసీలుగానే, బీసీలు వెళ్ళినా బిసీలుగానే ఉంటున్నారు. కానీ దళితుల క్రిస్టియన్లుగా మారితే మాత్రం బీసీ-సీ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. దళితుడు మతం మారినప్పటికీ కులం మారలేదు. అదే కుల వివక్ష అవమానాలుంటున్నాయి. ఆర్థికంగా పేదరికం మారలేదు. అవమానాలు, ఆకలి ఏదీ పోకుండా ఓ దళితుడు ఎస్సీ కాకుండా బీసీ-సీ ఎలా అవుతాడు. అందుకే దళిత క్రిస్టియన్లందరికీ ఎస్సీ హోదా కల్పించాలి. దీనిపై ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది కొనసాగుతున్నది.
దళిత క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నెలకొల్పారు. కానీ, దానికి పాలకమండలిని ఏర్పాటు చేయక అది తలలేని మొండెంలా పడి ఉంది. తక్షణమే పాలకమండలిని నియమించాలి. దళిత క్రిస్టియన్లకు తమ శవాలను పూడ్చుకునే ఆరడగుల స్థలం కూడా ఇవ్వలేదు. ప్రత్యేకనిధులు కేటాయించాలి. సమాధుల స్థలం కేటాయించాలి. మతోన్మాద మూక దాడులను అరికట్టడానికి, దళిత క్రిస్టియన్లకు భద్రతకోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో దళిత, క్రైస్తవులు సామాజిక న్యాయానికి నోచుకోకుండా వెనుకబడి పోతున్నారు. ఎస్సీ హౌదా కల్పించి అన్ని రకాల సంక్షేమం వర్తింపచేయాలి.
ముమ్మాటికీ మతం మనిషి వ్యక్తిగత విశ్వాసమే, దీని వరకు రాజ్యాంగం గ్యారంటీ చేసింది. పరమత ద్వేషం కలిగి ఉండడమే మతతత్వం. మతాన్ని రాజకీయాలకు పులమడమే మతోన్మాదం. ప్రస్తుతం నేటి రాజకీయ పరిస్థితులు మతోన్మాదంతో ఉన్నాయి. దీంతో సమాజంలో అశాంతి నెలకొంటు న్నది. తమ రాజకీయ ప్రయోజనాలకోసం, ఓటు బ్యాంక్ స్థిరీకరణకోసం మతాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారు. మనిషిని మానవత్వంతో చూసేదానికి విరుద్ధంగా మనిషిని మతతత్వంతో చూడటంతో మానవీయత మంటగలుస్తున్నది. నేటి తరం ఈ దుర్మార్గాలను చీల్చి చెండాడాలి. నిజమైన దేశభక్తి అంటే సర్వమత సమ్మేళనంతో సహజీవనం చేయాలి. కొన్ని శతాబ్దాలుగా ప్రజల ఈ మధ్య ఈ ఐక్యత నెలకొని ఉంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో హిందూ, ముస్లీం, క్రిస్టియన్ తేడా లేకుండా భారతీయులుగా భాగస్వాములయ్యారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడాలే కుండా పీడితవర్గం మొత్తం నైజామ్కు ఘోరీ కట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఎక్కడా మతపరమైన చర్చలేదు. ఇన్ని విజయాలలో ఎక్కడా మతం కనపడలేదు. ప్రజల ఐక్యతే గీటు రాయిగా ఉంది. మతస్వేచ్ఛ, ఐక్యత, సమానత్వం, రాజ్యాంగ రక్షణ, మత సామరస్యం వంటి మౌలిక ఆశయాలు నేటి అవసరం. మతాన్ని వ్యక్తిగత విశ్వాసంగా మాత్రమే పరిగణించి, దళిత క్రిస్టియన్ల హక్కుల పరిరక్షణ వారి అభ్యున్నతికోసం కృషిజరగాలి. ఈ దిశగా దళిత, గిరిజన, బలహీన వర్గాల ఐక్యతను కాంక్షిస్తూ ''బహుజన క్రిస్మస్'' నేడు సికింద్రాబాద్ అమృతవాణిలో జరుగుతున్నది. సామాజిక, విప్లవ ప్రజా సంఘాల నేతలు, గద్దర్, విమలక్క, మంద క్రిష్ణ మాదిగ, జూపూడి ప్రభాకర్, మల్లేపల్లి లక్ష్మయ్య, జాజుల శ్రీనివాస్గౌడ్, జయరాజ్, చెన్నయ్య, బెల్లయ్య నాయక్, స్కైలాబ్బాబు, మల్లు లక్ష్మి, కృపాకర్ మాదిగ వంటి ప్రముఖులు పాల్గొని ఐక్యతా సందేశమిస్తారు. ''దేశమంటే మట్టికాదోరు.. దేశమంటే మనుషు లోయ్..'' అనే గురజాడ మాటలను నిజంచేస్తూ మతం వ్యక్తిగత విశ్వాసం, కానీ మనుషుల మధ్య ఐక్యత శాశ్వతం అనే దిశగా 'బహుజన క్రిస్మస్' భవిష్యత్ కు బాటలు వేస్తుందని ఆశిద్దాం.
- జి. విజయరాజు
సెల్: 9948546129