Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం పిల్లలకు చెప్పే నీతి కథలు వారికి జీవిత పాఠాలని నేర్పే గొప్ప సాధనాలు. ముఖ్యంగా చిన్న పిల్లల పసి హదయాలలో మంచి నడవడిని గురించి, ఐకమత్యం గురించి, మంచి చెడులను గురించి, సమయస్ఫూర్తి గురించి, దేశభక్తి గురించి తెలియచేస్తూ, వారి హదయంలో చెరగని ముద్ర వేస్తాయి ''నీతి కథలు''.
పిల్లలకి కథలంటే ఎంతో ఇష్టం. ''అనగనగా ఒక రాజు...'' అని మనం కథను చెప్పడం ప్రారంభించగానే వారు కథను వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది. మనం చెప్పే కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన, అందులోని నీతి వారి మనస్సును హత్తుకు పోతుంది. కథను వినేటప్పుడు వారు బయటి ప్రపంచాన్ని మర్చి పోతారు. వాళ్ళ ముఖకవళికలు గమనిస్తూ మనం కూడా మన హావభావాలు మార్చుతూ చెపుతున్నప్పుడు వారిలో కలిగే ఆనందాన్ని వర్ణించలేం.
కానీ నేడు విశ్వవ్యాప్తంగా... అస్తవ్యస్తమైన ఉమ్మడి కుటుంబాలు, తీరిక లేని పనులు, ప్రతి క్షణం డబ్బు కోసం ఆరాటం.. ఇలా జీవితం అంతా ఉరుకులు, పరుగులు. ఈ నేపథ్యంలో పిల్లలు కథలకు దూరం కాకూడదంటే, సాంస్కృతిక వారసత్వంగా వారికి అందుతున్న కథలు కోల్పోకూడదంటే ఆ భాధ్యతను మొదట తల్లిదండ్రులు, తర్వాత పాఠశాలలోని ఉపాధ్యాయులు భుజస్కందాలపై వేసుకోవాల్సిన అవసరం ఉంది.
''చూసే'' కథనం కంటే, ''వినే'' కథనంలో పిల్లల ''ఊహాశక్తి'' ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందోననే కుతూహలం వారిని ఆలోచింపచేస్తుంది. వారికి మరింతగా ఊహించే అవకాశం కలుగుతుంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేదు. కుటుంబ వ్యవస్థలో పిల్లలకు కథలు చెప్పేంత తీరిక ఎవరికీ ఉండడం లేదు. పిల్లలకోసం కేటాయించే సమయం కూడా లెక్క ప్రకారం, రోజుకి ఇంత అని ఇస్తున్న తల్లిదండ్రులున్న ఈ హైటెక్ యుగంలో పిల్లలకు అందాల్సినంత ఆప్యాయత అందడం లేదు. ఉన్న తక్కువ సమయములో పిల్లలతో అనుబంధాన్ని పెంచేందుకు కథలు చెప్పడం ఎంతగానో తోడ్పడుతుంది. తల్లిదండ్రులు ముందుగా కథలను విని వాటిని తామే హవభావాలతో చెప్పగలిగితే పిల్లలతో తల్లిదండ్రులకు కూడా ఒక ఆప్యాయతతో కూడిన అనుబంధం పెంచడానికి కథలు చెప్పడం తోడ్పడుతుంది.
విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన మన కథలలో పంచతంత్ర కథలు, పెదరాశి పెద్దమ్మ కథలు, మర్యాద రామన్న కథలు, భట్టి విక్రమార్క కథలు, భేతాల కథలు, కాశీమజిలి కథలు, జానపద కథలు, అంతులేని కథలు ముఖ్యమైనవి.
ప్రాచీన భారతీయ కథకుల యొక్క సృజనాత్మకతకు, ఊహాశక్తికి, కథాకథనాలకు సాటిలేని మేటి ఉదాహరణగా ఎన్నో కథలు నిలిచాయి. శతాబ్దాలుగా భారతీయ సాహిత్యంలో చిత్ర విచిత్ర పాత్రలతో, అద్భుత, ఉత్సాహ భరితంగా సాగే ఈ కథలు కేవలం కుతూహలాన్ని రేకెత్తించే మాత్రమే కాలక్షేప కథలు కావు. నిజానికి ఈ కథలు మానవుల ఊహాశక్తికి తర్కాన్నీ, వివేచననూ పరిచయ చేస్తాయి.
ప్రాచీన భారతీయ కథా కౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచిన కథలనేకం ఖండంతరాలను దాటి ప్రపంచ నలుమూలలా విస్తరించాయి. ''పంచతంత్రం'' కథలను పరిశీలిస్తే ప్రతి జంతువు, ప్రతి పక్షి పాత్రలు పాత్రదారులుగా ఉన్నాయి. కానీ కథలు మాత్రం దేనికదే విడికథగా ఉండి, ప్రతికథకూ ప్రారంభమూ, ముగింపూ వేర్వేరుగా ఉంటాయి. ప్రతి కథలో ఒక నీతి లేదా ఒక మంచి తప్పకుండా ఉంటాయి. పిల్లలకు సులభంగా అర్థమై తక్కువ సమయంలో ముగిసేలా ఉంటాయి. జంతువులతో పక్షులతో మాట్లాడించి కథను కోనసాగించిన విష్ణుశర్మ, చిన్నయసూరి లకు తెలుగు వారందరు రుణపడి ఉన్నారు.
ఉమ్మడి కుటుంబాలుంటే తాతా, నాన్నమ్మ, అమ్మమ్మలు కథలు చెప్పేవారు. ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులు ఈ బాధ్యతను స్వీకరించాలి. కథలలో వివిధ ప్రాంతాలలో వాడే ప్రత్యేక పదాలు, గ్రామీణ పదాలు, పర్యాయపదాలు, సామెతలు ఉండి చిన్నారులకు భాషపై పట్టు కలిగిస్తాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అమూల్యమైన గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది ''పిల్లలతో'' ఎక్కువ సమయం గడపడం మాత్రమే అని గుర్తించాలి. కానీ నేడు అదే లేక పోవడం విచారకరం. ప్రతి ఒక్కరూ బిజీ బిజీ అంటూ పిల్లల కోసం కొంత సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. గతంలోకి ఒకసారి వెళ్లి చూస్తే.. పని భారం ఉన్నప్పటికీ, రాత్రి సమయాల్లో తప్పకుండా తలిదండ్రులు తమ పిల్లలకు కథలు చెపుతూ గడిపేవారు. కానీ నేటి యుగంలో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న తల్లిదండ్రులు తాము విన్న అ చిన్ననాటి కథలను జ్ఞాపకం చేసుకొని పిల్లలకు చెప్పే ఓపిక, సమయం లేదనుకోవడం విచారకరం. అ మాట కొస్తే కథలు వినడం చిన్నారులకు ఎంత అవసరమో, చెప్పడం అమ్మా నాన్నలకు అంతే అవసరం. ఎందుకంటే కథలు చెప్పడం మనం ఆపేస్తే, అవి క్రమంగా అంతరించిపోతాయి. అంతరించి పోయిన ఆ కథలతో పాటు మన అస్తిత్వం, మన చరిత్ర అంతరించిపోతుంది. చిన్నపిల్లలకు కథలు చెప్పడం ఎంత ముఖ్యమో ఇంట్లో ఉండే పెద్దవారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మన భారతీయ చరిత్ర, పురాణాలు పరిశీలిస్తే చిన్నతనంలో వారి తల్లి చెప్పిన కథల వల్ల ప్రేరణ పొందామని ఎందరో గొప్పవారు తెలియచేశారు.
ప్రతి చిన్నారీ తెలియని అనేక విషయాలు తెలుసు కోవాలంటే, వారిలో సృజనాత్మకత పెరగాలంటే వారికి కథలు చెప్పడం అనేది ఒక అద్భుతమైన విధానం. నేటి పిల్లలకు అటు పాఠశాలల్లో లేదా ఇంట్లో కానీ కథలు వినడానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండు సంవత్సరాలు నిండడంతోనే చిన్నారులను పాఠశాలలో చేర్చడం, ర్యాంకుల కోసం పరిగెత్తించడంతోనే జీవితం గడిచిపోతున్నది.
కథలు పిల్లలలో వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంపొందిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి.
తెలుగు సాహిత్యంలో చిత్ర విచిత్రాలైన మలుపులతో, వినోదభరితంగా ఉండి మంచి నడవడికను తెలియచేస్తున్నాయి. కాబట్టి పెద్దలంతా వారి చిన్నారులకు నీతి కథలు నేర్పిస్తూ, వారిని మిగిలిన పిల్లలకు చెప్పేలా ప్రోత్సహిస్తూ చిన్నారుల ఉజ్వల భవిష్యత్కు చేయందించాలి. తద్వారా సృజనాత్మక, మానవీయ సమాజానికి పాదులు చేయాలి.
- రఘుపతిరావు గడప
సెల్:9963499282