Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేట్లు రాజకీయాలను శాసిస్తున్న నేటికాలంలో నికార్సయిన కమ్యూనిస్టులకు పెద్దగా ఓట్లు దక్కకపోవచ్చు, సీట్లు రాకపోవచ్చుగానీ వాళ్లెప్పుడూ ప్రజల మనస్సులో గూడు కట్టుకునే ఉంటారు. సామాన్యుల ప్రేమాభిమానాలను పొందుతూనే ఉంటారు. ఒక జర్నలిస్టుగా నేను ఊరికే చెప్పట్లేదు.. కమ్యూనిస్టుల పట్ల నమ్మకం, విశ్వాసం ఇప్పటికీ ఎంత బలంగా ఉందో నాకు ఎదురైన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ క్రాస్రోడ్లో ప్రతిరోజూ ఏదో ఒక నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి పోతూనే ఉంటాం. అక్కడ ఓ చారువాలా తన దగ్గర టీ తాగేందుకు వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ.. 'కమ్యూనిస్టులు ఎంతో నీతిమంతులు. వారి ప్రతి పోరాటమూ ప్రజల కోసమే. ఎంతో కష్టపడతారు. పట్టిన పట్టు వదలరు. కమ్యూనిస్టులుండబట్టే రాజకీయాల్లో ఇంకా ఎంతోకొంత విలువలున్నాయి. నిజాయితీ బతుకుంది' అంటూ తన మనస్సులోని మాటను చెప్పారు. పక్కనే ఉన్న కమ్యూనిస్టు కార్యకర్త మాట కలుపుతూనే 'మా ఎర్రజెండోళ్లం ఎప్పుడూ పేదోళ్ల కోసం కొట్లాడతం' అంటూ చెప్పుకొచ్చారు. చారువాలా అవునంటూనే 8న జరిగిన భారత్ బంద్ గురించి ప్రస్తావించారు. 'బంద్ రోజు టీఆర్ఎస్ నాయకులూ ఇక్కడకు వచ్చారు. చౌరస్తాలో కొద్దిసేపు నిలబడ్డారు. 100 చారులు తాగి 50 చారులకే పైసలు ఇచ్చారు. వెళ్లిపోయారు. 50 చారులకు పైసలు ఇవ్వకుండా గైమత్ చేశారు. కమ్యూనిస్టులు గంటల కొద్దీ ఇక్కడే ఎండలోనే కూర్చున్నారు. 50 చారులు తాగి అన్నింటికీ పైసలిచ్చారు. సరిపోయాయా? ఇంకేమైనా కావాలా? గిరాకీ మంచిగయితుందా? కుటుంబం గడుస్తుందా? అని యోగక్షేమాలను ఆరాతీశారు. కష్టసుఖాల గురించి వారు తెలుసుకోవడంతో ఎంతో ఆనందమైంది. ఏ కార్యక్రమం జరిగినా చాయ తాగి నయాపైసాతో సహా ఇచ్చిపోతారు. కమ్యూనిస్టులు గొప్పోళ్లయ్యా' అంటూ కమ్యూనిస్టుల నిజాయితీ గురించి చెప్పారు. చారువాలా తన వ్యాపారం కోసం ఈ మాటలు చెప్పినట్టు అస్సలు అనిపించలేదు. ఆ మాటలు ఆయన గుండెలోతు నుంచి వచ్చినట్టు అతని ముఖకవళికలు చెప్పాయి.
- గుడిగ రఘు