Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1918-1920 మధ్య స్పానిష్ ఫ్లూ విజృభించి దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు చనిపోయారు. అప్పట్లో సమాచార మరియు శాస్త్ర సాంకేతిక రంగాలు అంతగా అభివృద్ధి చెందకపోవటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. 1956లో ఈ మహమ్మారి వచ్చినప్పటికీ పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన జననష్టం కంటే ఫ్లూతో ఎక్కువ నష్టం వాటిల్లింది. వందేండ్ల అనంతరం 2019లో కరోనా వైరస్ ఆవిర్భవించి ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్నది. ఇప్పుడు అందరూ వాక్సిన్పై దృష్టి సారించారు. సాధారణ పరిస్థితులలో ఒక వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనాలంటే ఐదు నుంచి పదేండ్లు పడుతుంది.
పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చైనీస్ శాస్త్రవేత్తలు 2020 జనవరిలోనే కోవిడ్ -19ను కనుగొని, దాని జెనెటిక్ సీక్వెన్సింగ్ని బహిర్గతం చేయగలిగారు. పది నెలల్లోనే ఔషధ ప్రయోగం చేయడం ద్వారా వ్యాక్సిన్కి రూపకల్పన చేయడం గొప్పవిషయం. ఆ వెలుగులో ప్రపంచవ్యాప్తంగా 50రకాల వ్యాక్సిన్స్ తయారవుతున్నాయి. అత్యధిక వ్యాక్సిన్స్ మనదేశంలో తయారు అవుతున్నాయి. స్పుత్నిక్, ఫైజర్, మోడెర్న, కోవిషెల్డ్ తదితర వ్యాక్సిన్స్ కరోనా నియంత్రణకు అందుబాటులోకి వస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్ని నాలుగు దశల్లో ఇవ్వాల్సి ఉంటుంది. తొలి దశలో వైద్య సిబ్బందికి, రెండవ దశలో పోలీస్, పారిశుధ్య కార్మికులకు, మూడవ దశలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి, వృద్దులకి, నాలుగవ దశలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలని అనుసరించి సాధారణ ప్రజలకి వ్యాక్సిన్ వేస్తారు. ప్రతి వ్యక్తికి రెండు డోసులు వేస్తారు.
ధనిక దేశాల వారు వ్యాక్సిన్ని సులభంగా కొనుగోలు చేయగలుగుతారు. పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ ప్రకారం 67 నిరుపేద దేశాల్లో ప్రతి పది మందిలో ఒకరికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. 2021 చివరినాటికిగానీ మిగిలిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఇంతకుముందు ఏదయినా ఒక జబ్బుకి వ్యాక్సిన్ వస్తే దానికున్న సమర్ధతపై సైన్స్ పత్రికల్లో వ్యాసాలు వచ్చేవి. ఇప్పుడు అలా రావడం లేదు. అమెరికా డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ కొనుగోలులో మనం ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, ఇది దేశ జనాభాలో 59శాతం మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంతకాలం వేచిచూడాలి. వ్యాక్సిన్ ఎంతమేర మనపై ప్రభావం చూపుతుందో పరిశీలించాలి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా పోలింగ్ తరహా జరుగుతుంది. వ్యాక్సిన్ కోసం కోవిడ్ యాప్లో పేరుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కేంద్రాలలో పేరు నమోదుకు అవకాశం లేదు. కోవిడ్ యాప్లో పేరు నమోదుతో పాటు ఆధార్కార్డ్ కచ్చితంగా అప్లోడ్ చేయాలి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారు వారి వైద్య ధృవీకరణ పత్రాలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్లో నమోదైన వారికి వ్యాక్సిన్ ఎక్కడ, ఎప్పుడు వేయించుకోవాలన్న సమాచారం ఫోన్కు వెళ్తుంది. దాని ఆధారంగా వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సిన్ని జాగ్రత్తగా నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో తొలి విడతలో 30కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అందరికీ వ్యాక్సిన్ అందాలంటే మరికొంత సమయం పడుతుంది కాబట్టి కరోనా నియంత్రణ నిబంధనలని పాటించడం మంచిది. తద్వారా కరోనాతో పాటు మిగతా సీజనల్ వ్యాధులని కుడా దూరంగా ఉంచవచ్చు.
- ఎం. రాం ప్రదీప్
సెల్: 9492712836