Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా జరుగుతున్న రైతు పోరాటం జాతీయోద్యమ స్ఫూర్తిని చాటుతున్నది. నవంబర్ 26న ప్రారంభమైన ఉద్యమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు భాగస్వాములు అయ్యారు. తీవ్రమైన చలి, మంచు కురుస్తున్నప్పటికీ చలించకుండా దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించినా, లాఠీచార్జీ చేసినా రైతులు శాంతియుతంగానే ఆందోళన కొనసాగి స్తున్నారు. శాంతియుతంగానే ర్యాలీగా ఢిల్లీకి బయలుదేరిన రైతాంగాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంతో రహదారిపైనే బైటాయించారు. తమపై లాఠీÄలు జూళిపిస్తున్న పోలీసులకే భోజనాలు పెట్టి, ఆశ్రయమిచ్చి తమ ''అన్నదాత'' మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు. డిసెంబర్ 20వ తేదీన సింఘు బార్డర్ను రైతు, వ్య.కా.స, సీఐటీయూ తెలంగాణ ప్రతినిధి బృంధం సందర్శించినపుడు కనిపించిన దృశ్యాలివి. ఢిల్లీకి 25వ కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 7 కి.మీ పొడవునా రైతాంగం మోహరించి ఉన్నది. మిగిలిన సరిహద్దు ప్రాంతాల్లో కూడా రైతులు జనసంద్రాన్ని తలపిస్తున్నారు. అనేకచోట్ల సభలు జరుగుతున్నాయి. నాయకుల ఉపన్యాసలను రైతులు, అక్కడికి హాజరైన ప్రజలు ఆసక్తిగా వింటున్నారు. వేలాదిమంది గ్రామాల నుంచి రోజూ వస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి వారం రోజులు, 10రోజులు ఉండే విధంగా తమ ఆహారం, దుస్తులు సర్దుకొని వచ్చి ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. దగ్గరి గ్రామాల ప్రజలు రోజూ వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి వెళ్తున్నారు. యువకులు ప్రభుత్వ అబండాలకు సమాధానంగా ''మేము టెర్రరిస్టులం కాదు రైతులం'' అనే ప్లే కార్డులు పట్టుకొని గుంపులుగా తిరుగుతున్నారు. జాతీయోద్యమంలో భగత్సింగ్ ఇచ్చిన ''ఇంక్విలాబ్ జిందాబాద్'' నినాదాన్ని ఈ ఉద్యమంలో భాగస్వాములైన యువత ఎత్తుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని అనేక తప్పుడు ప్రచారాలతో ఒంటరి చేసేందుకు ప్రయత్నించింది. కానీ కేంద్ర ప్రభుత్వ కుట్రలు ఇక్కడ సాగడం లేదు. అనేకమంది విద్యావంతులు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడుతున్నారు.
వసతుల ఏర్పాట్లు :- అక్కడ తాత్కాళికంగా ఏర్పాటు చేసిన టెంట్లుగానీ, భోజన వసతులుగానీ, నీటి సౌకర్యంగానీ, మొబైల్ టాయిలెట్లుగానీ చూస్తే ఎన్ని రోజులైనా ఈ ఉద్యమం కొనసాగే అవకాశం ఉంది. భోజనాలు ఎంత మంది వచ్చినా వండిపెట్టే విధంగా స్టీమర్లు, ఆటో మిషన్లతో ఏర్పాటు చేస్తున్నారు. కూర్చొని తినగలిగే వారికి ఆ రకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలు సామూహికంగా భోజనాలు చేసే అవకాశం ఉంది. ఉక్కు క్రమశిక్షణతో రైతు నాయకులు, ప్రజా సంఘాలు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. అనేకచోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు ఇది కేవలం పంజాబ్ ఉద్యమం మాత్రమే కాదు. అనేక రాష్ట్రాల నుంచి ఆ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి వస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్తో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు భాగస్వాములు అవుతున్నారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది రైతు వాలంటీర్లు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ ప్రజానీకానికి కావాల్సిన సహాయ సహకారాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇది ఖలిస్తాన్ ఉద్యమం అని, చైనా అనుకూల ఉద్యమమని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేశంలోని నలుమూలల ప్రజానీకం మేము అండగా ఉన్నామని ఐక్యతను చాటుతున్నారు.
ఈ ఉద్యమం ఒంటిరికాదు :- రైతుల ఉద్యమం ఒంటరి కాదని రోజు రోజుకు రుజువు అవుతున్నది. ఈ పోరాటంలో కార్మికవర్గం పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు. వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు, సామాజిక తరగతులు, మేధావులు మద్దతుగా నిలబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లుగా ఈ ఉద్యమం ప్రస్తుతం ఒంటరిగా లేదు. అనేక తరగతులు ఈ ఉద్యమానికి బాసటగా నిలబడుతున్నాయి.
గతంలో జరిగిన అనేక ఉద్యమాల ప్రస్తావన కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నది. 1988లో జరిగిన ఉద్యమం కూడా లక్షలాది మందితో జరిగింది. ఢిల్లీలో దాదాపు 10రోజుల పాటు ఆ ఉద్యమం కొనసాగింది. కానీ, ఆ ఉద్యమంలో కేవలం చెరుకు రైతులు, పెద్ద రైతులు మాత్రమే పాల్గొన్నారు. ఏ స్పష్టమైన హామీ లేకుండానే ఆ ఉద్యమం విరమించబడింది. కానీ నేటి ఉద్యమం రైతాంగం చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పట్టుదలతో ఉంది. ఈ నాటి ఉద్యమంలో చిన్న-సన్నకారు రైతులతోపాటు అనేక తరగతుల ప్రజలు భాగస్వాములైనారు. పోలీసులు, సైనికులు, క్రీడకారులు సైతం మేమూ రైతు బిడ్డలమేనంటూ రైతుల పోరాటానికి అండగా నిలబడుతున్నారు.
అఖిల భారత రైతుపోరాట సమన్వయ కమిటీ డిసెంబర్ 20వ తేదీని రైతు ఉద్యమంలో మరణించిన అమరులను స్మరించుకునే కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన రోజే మేము అక్కడికి వెళ్ళాం. 33మంది అమరులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, మానవ హారాలు, క్రొవ్వొత్తుల ప్రదర్శనలు లక్షలాది కేంద్రాల్లో జరిగాయి.
ప్రభుత్వం రెచ్చగొట్టినా అహింసా మార్గంలోనే పోరాటం కొనసాగుతున్నది. 33మంది చనిపోయినా, ప్రభుత్వం అన్ని రకాల నిర్భందం ప్రయోగించినా ఉద్యమం మాత్రం శాంతియుతంగానే కొనసాగుతున్నది. ప్రభుత్వానికి ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొన్నది. నాయకుల్లో మాత్రం ఒక విశ్వాసం ఖచ్చితంగా కనబడుతున్నది. ఈ పోరాటం విజయాన్ని సాధించి తీరుతుందని.
జాతయోద్యమ కాలంలో 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఉత్తర భారత దేశానికే పరిమితం అయ్యింది. మహారాష్ట్రలో జరిగిన వర్లి ఆదివాసుల పోరాటం, కేరళలో జరిగిన ఉన్నప్ర-వాయిలార్ పోరాటం, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక్కో పోరాటం మహత్తరమైనవే. కానీ ఇవి ఆయా ప్రాంతాల్లో జరిగాయి. కానీ నేటి పోరాటం భారతదేశ నలుమూలలా అలుముకున్నది. కేంద్ర ప్రభుత్వం 3 కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమా? లేదా గద్దె నుండి దిగిపోవడమా? అనే పద్ధతిలోనే ఈ పోరాటం కొనసాగుతున్నది. ఇది కేవలం రైతుల పోరాటంగానే కాకుండా దేశరక్షణ పోరాటంగా ప్రజానీకం భావిస్తున్నారు. అందుకనే ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.
అదానీ, అంబానీ ఉత్పత్తుల బహిష్కరణ :- నాడు జాతీయోద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తే, విదేశీ వస్తువులతోపాటు విద్యాలయాలు, కోర్టులు, బిరుదులు కూడా అనేకమంది త్యజించారు. అదే తరహాలో నేడు ఏ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ చట్టాలు తీసుకొచ్చారో ఆ కార్పొరేట్ల వస్తువులను బహిష్కరించాలని రైతు సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపును అందుకొని ఆ కార్పొరేట్ల వస్తు బహిష్కరణతో పాటు అనేక మంది తమకు లభించిన అవార్డులను సైతం తిరిగి వెనక్కి ఇస్తున్నారు. జియో సిమ్ కార్డులను, ఫోన్లను వాడడం ఆపేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు, యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములౌతున్నారు. రిలయన్స్, పెట్రోల్, గ్యాస్ వాడొద్దని నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ మార్ట్లు, రిలయన్స్ ప్రెష్లలో కొనుగోళ్ళు ఆపేశారు. ఆదాని ఫార్చూన్ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. అడు గడుగునా ఈ పోరాటం జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నది. పాలకులకు వణుకుపుట్టిస్తున్నది.
- టి. సాగర్
సెల్: 9490098055