Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ 2020లో మనుష్యుల ఆశలని ఆవిరిచేసింది. మనిషి వేగానికి బ్రేకులేసింది. వంద సంవత్సరాల తర్వాత ప్రపంచం మొత్తం ఒకే సమస్యతో బాధపడేటట్టు చేసింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల బారిన పడకుండానైనా కొన్ని దేశాలున్నాయోమో గానీ, కరోనా నుంచి సురక్షితంగా తప్పించుకున్న దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ప్రస్థానం అతి వేగంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కొనసాగు తున్నది.
కరోనా వైరస్ మానవాళికి కొత్త సవాళ్ళను విసిరింది. మనిషికి ఉన్న పరిమితులని గుర్తు చేసింది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని హెచ్చరించింది. అయితే మనిషి తనకున్న అపార జ్ఞానంతో వైరస్కి వ్యాక్సిన్ కనుగొన్నాడు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. చిన్నారులు విద్యకి దూరం అయ్యారు. నూతన సంవత్సరంలో కూడా కరోనా ప్రభావం కొంతకాలం ఉండ వచ్చు. కరోనా సాకుతో కార్పొరేట్ వర్గాలు మరింత లాభపడ్డాయి. పేదవారి కష్టాలు రెట్టింపు అయ్యాయి.
నూతన సంవత్సరం వచ్చినంత మాత్రాన ప్రకృతిలో అసాధారణ మార్పులేవి రావు. కానీ మనం వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం కాబట్టి అవి ఎలాంటి ఫలితాలిస్తున్నాయో సమీక్ష చేసుకునేందుకు నూతన సంవత్సరం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. కరోనా తీవ్రత కొనసాగినంత కాలం మత ప్రబోధకులు మౌనంగా ఉన్నారు. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో మత బోధకులు తమ మత ప్రచారం కోసం కొత్త నిర్వచనాలు వెతుక్కుంటున్నారు. కరోనా వైరస్ సహా, అన్ని రకాల ఇబ్బందులకి తమ మతాలలో ఉన్నాయనే నమ్మించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కరోనా పాలకులకి అనేక లక్ష్యాలు నిర్దేశించింది. సైన్స్ పరిశోధనలు, ప్రకృతి సంరక్షణ అనేవి ఇప్పుడు దృష్టి సారించాల్సిన అంశాలు. కేవలం వ్యాక్సిన్స్తోనో, వ్యక్తిగత శుభ్రతతోనో వ్యాధులని నిర్మూలించలేం. సైన్స్ పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చే విధంగా పాలకుల విధానాలు ఉండాలి. ప్రకృతి రక్షణ పాలకులకు ముఖ్య అజెండాగా ఉండాలి.
నూతన సంవత్సరంలో యువతలో ఎక్కువమంది మద్యంతోనే కాలక్షేపం చేస్తున్నారు. కరోనాతో వచ్చిన కొత్త అవకాశాల్ని యువత వినియోగించుకోవాలి. ప్రజలకి సహజ వ్యాధినిరోధక శక్తి పెరిగే విధంగా పాలకులు ఆహార విధానాన్ని రూపొందించాలి. కరోనాతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలను అదుపు చేయాలి. ఏ ఆహారంలో చూసినా కల్తీ ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన విద్య ప్రజలకి అందేవిధంగా నూతన సంవత్సరంలో పాలకులు కృషి చేయాలి.
- ఎం. రాం ప్రదీప్
సెల్:492712836