Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టి.నాగరాజు
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
స్వాతంత్య్రోద్యమం నాటి సంఘటిత విద్యార్థి ఉద్యమం వారసత్వం. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలు. అధ్యయనం, పోరాటం నినాదం. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ.) పతాకం. కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలో 1970 డిసెంబర్ 27-30 తేదీలలో ఎస్.ఎఫ్.ఐ ఏర్పడింది. నాణ్యమైన విద్య కోసం, ప్రజాతంత్ర హక్కుల కోసం ప్రత్యామ్నాయ విద్యా విధానం రూపొందించి ఆనతి కాలంలోనే విద్యార్థుల్లో ఛాంపియన్గా నిలిచింది. పాలకులు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలపై పోరు చేయడంలో, విద్యారంగ సమస్యలపై ఐక్య ఉద్యమాలు నిర్వహించడంలో ఎస్.ఎఫ్.ఐ. గొప్ప పాత్రను పోషించింది. ఈ 50 ఏళ్ళ ప్రస్థానంలో నమ్మిన సిద్ధాంతాల కోసం, సంఘ నిర్మాణం కోసం అనేకమంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. భారతదేశంలో 19వ శతాబ్దం మధ్య భాగంలో విద్యార్థి ఉద్యమాలకు అంకురార్పణ జరిగిన సంఘటిత విద్యార్థి ఉద్యమం అస్థిత్వంలోకి వచ్చింది మాత్రం 1936లో. భారత ఉద్యమంపై 1917 రష్యా విప్లవ ప్రభావం అది ఈ దేశంలోని కార్మిక, కర్షక పోరాటాలను మరింత హెచ్చరించింది. భగత్సింగ్, అతని సహచరులు అసమాన త్యాగాలు, భారత జాతీయ కాంగ్రెస్ సామ్రాజ్యవాద రాజీ ధోరణులు భారతదేశంలో సంఘటిత విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకువచ్చాయి. సంఘటిత విద్యార్థి ఉద్యమం ప్రారంభంలో స్వాతంత్య్రం పూర్వం విద్యార్థి ఉద్యమాన్ని ప్రోత్సహించిన కాంగ్రెస్, నెహ్రూ స్వాతంత్య్రానంతరం విద్యార్థి ఉద్యమ అవసరాలను తగ్గిస్తూ ప్రయాణించారు. ఒకవైపు విద్యార్థి రాజకీయాలు అవసరం లేదనే పల్లవినందుకున్నారు. మరోవైపు 1950లో ఎన్.ఎస్.యు.ఐ.ని ఏర్పాటు చేయటంతో కాంగ్రెస్ కుచ్చిత స్వభావం అర్థమయ్యింది. దీనికి తోడు భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో చోటు చేసుకుంటున్న మార్పులు, వాటిని అర్థం చేసుకోవటం, వాటి పట్ల స్పందన, ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై విభేదాలు ముందుకొచ్చాయి. స్వాతంత్య్ర భారతదేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వాలు సాధించటంలో, సోషలిస్టు తరహా వ్యవస్థను ఏర్పాటు చేయటంలో కాంగ్రెస్ వర్గ ప్రయోజనాలను అర్థం చేసుకునే విషయాలలో సంఘంలో విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎ.ఐ.ఎస్.ఎఫ్.లో చీలికలు తప్పకపోవటంతో 1968, 1969 సమయానికి దేశవ్యాప్తంగా రాష్ట్రాలవారీగా స్టూడెంట్ ఫ్రంట్లు ఏర్పడ్డాయి. తిరిగి అందులో అతివాద దుస్సాహసిక ధోరణులు ముందుకు రావటంతో విద్యార్థి ఉద్యమం మరోసారి పెద్ద చీలికను చవిచూసింది. నాడు 1,24,624 సభ్యత్వంతో ఏర్పాటైన ఎస్.ఎఫ్.ఐ. నేడు 45,00,000 సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉంది. ఆవిర్భవించిన తరువాత కేరళలో 10వ తరగతి ఫీజులు పెంపునకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, బెంగాల్లో కాంగీ, నక్సలైట్లు మాస్ కాపీయింగ్కు పాల్పడితే దానికి వ్యతిరేకంగా ఏడు సంవత్సరాలపాటు దీర్ఘకాలికంగా పోరాడి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్పులు పెంచాలని హౌటల్ ధరలు పెంచితే తగ్గించాలని పోరాడింది. 1978లో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని పోరాడి విజయం సాధించింది. 1974లో జరిగిన ఎస్.ఎఫ్.ఐ. రెండవ అఖిల భారత మహాసభల్లో స్వాతంత్య్రం వచ్చినా భారతదేశంలో విద్యా విధానంలో మార్పు తీసుకురాలేదు. దీని వలన ఉపాధితో సంబంధంలేని, శాస్త్రీయత లేని విద్యా విధానం అందుతుంది. దీనిస్థానంలో శాస్త్రీయ విద్యా విధానం తీసుకురావాలని, అది ఎలా ఉండాలో కూడా చూపించి ఈ దేశానికి ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని తయారుచేసిన ఏకైక విద్యార్థి సంఘంగా ఎస్.ఎఫ్.ఐ. నిలిచింది. 2004లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నియంత్రణకు చట్టం చేయాలని చలో పార్లమెంట్ నిర్వహించింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఒక ప్రత్యామ్నాయ చట్టాన్ని తయారుచేసి దేశానికి అందించిన చరిత్ర ఈ ప్రపంచంలో ఎస్.ఎఫ్.ఐ. విద్యార్థి సంఘానికి మాత్రమే చెల్లింది.
1994లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఫీజులు పెంపుకు వ్యతిరేకంగా పోరాడి ఆ రోజున్న ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర ఎస్.ఎఫ్.ఐ. సంఘానికి ఉన్నది. 2006లో నాలుగేళ్ళ డిగ్రీకి వ్యతిరేకంగా ఉద్యమించి విజయం సాధించింది. మెస్ ఛార్జీలు, హాస్టల్ సౌకర్యాలు ఫీజులు, స్కాలర్షిప్పులు కోసం పోరాడి విజయం సాధించింది. 2010లో రాష్ట్ర విద్యా రంగానికి బడ్జెట్లో ఎన్ని నిధులు కావాలో తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన సంఘం ఎస్.ఎఫ్.ఐ. మాత్రమే. ఇన్ని రకాలుగా ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుతూ పేదలకు చదువు అందుబాటులో ఉండే విధంగా నిరంతరం కృషి చేస్తూనే శాస్త్రీయ విద్యా విధానం కోసం కృషి చేసింది. అందుకే ఈ రోజు ఈ చదువులైనా పేదలకు అందుతున్నాయి. అలా ఒక్క పోరాటానికే ఎస్.ఎఫ్.ఐ. పరిమితం కాలేదు. అధ్యయనంలో ముందున్నది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభంకు ఈ రోజుకు అమెరికాలో గంటకు 7 వేల ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయం చూపించాల్సిందిగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలను కోరినా అది సాధ్యం కాకపోవడంతో స్వయాన ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని దీనికి ప్రత్యామ్నాయం చూపించడానికి నియమించిన కమిటీ చైర్మన్ ప్రభాత్ పట్నాయక్ ఎస్.ఎఫ్.ఐ. జాతికి అందించిన మణిపూస ఎస్.ఎఫ్.ఐ. సంఘం వాడే కావడం ఎస్.ఎఫ్.ఐ. అధ్యయనానికి నిదర్శనం. అర్థశాస్త్రంలో నోబుల్ బహుమతి పొందినందుకు ప్రపంచం మొత్తం అమర్త్యసేన్ను పొగిడితే, అతనితో మెప్పింపు పొందిన సీతారాం ఏచూరి ఎస్.ఎఫ్.ఐ. సంఘం జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళను ఎస్.ఎఫ్.ఐ. సంఘం జాతికి అందించింది.
ఆశయసాధనలో అమరవీరులు
దేశంలో ఎస్.ఎఫ్.ఐ. త్యాగాలు అజరామరం, వారి రక్తం వృధాకాదు. 25 ఏళ్ళు కూడా నిండని చిరుదివ్వెలు మన మదిలోనే, మన జెండాలో ఆశయాల రూపంలో నిత్యం ప్రతిబింబిస్తారు. వారు అందరిలాగానే చదువుల్లో, ఆటల్లో రాణించాలనుకున్నారు. జీవితంలో ఎదగాలనుకున్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాలేదు? అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, పేదల ఆకలి, దారిద్య్రాన్ని ఎదిరించినందుకు, కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజల్ని చీల్చే కుహనా రాజకీయాలకు వ్యతిరేకంగా నిలిచినందుకు నింగికెగసినారు. చుక్కల్లో చంద్రులైనారు. మన హృదయాలలో చిరస్మరణీయులైనారు. 1970లలో అవినీతి, ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్, అరాచకాలకు, బెంగాల్లో అర్థ ఫాసిస్ట్ దమనకాండకు వ్యతిరేకంగా ఎస్.ఎఫ్.ఐ. నిలబడింది. 140 మంది వెలకట్టలేని అమూల్యమైన కార్యకర్తల ప్రాణాలను కర్కశ కాంగ్రెస్ బలిగొంది. అస్సాం, పంజాబ్లలో ఖలిస్తాన్ వంటి విచ్ఛిన్న ఉద్యమాలకు ఎస్.ఎఫ్.ఐ. ఎదురు నిలిచింది. హిందూత్వవాదులు సాగించిన మండల్ కమీషన్ వ్యతిరేకంగా మండల అనుకూల ఉద్యమాల పేరుతో విద్యార్థులను చీలగొట్టే ప్రయత్నం జరిగినపుడు ఎస్.ఎఫ్.ఐ. నిక్కచ్చిగా వ్యవహరించింది.
1980లలో దేశవ్యాప్తంగా విచ్ఛిన్న ఉద్యమాలు పంజాబ్, కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో ఊపందుకున్నాయి. ఆయా రాష్ట్రాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ రాజకీయ, సైద్ధాంతిక పోరాటం నిర్వహించటంలో వీరోచిత పాత్రను పోషించింది. అనేక మంది కామ్రేడ్స్ అసువులు బాసారు. ''మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం'' అనే నినాదాన్ని ఎస్.ఎఫ్.ఐ. ఇచ్చింది. 50 ఏళ్ళ ప్రస్థానంలో ప్రత్యేకించి ఎమర్జెన్సీ కాలంలో వందలాదిమంది ఎస్.ఎఫ్.ఐ. కార్యకర్తలు జైళ్ళలో మగ్గారు, హత్యగావించబడ్డారు.
కామ్రేడ్ నిరంజన్ తలుక్దర్ అస్సాం రాష్ట్రం కమ్రుప్ జిల్లా నిజ్జాజని గ్రామంలో జన్మించాడు. విద్యార్థులలో పాపులర్ నాయకుడిగా వున్న నిరంజన్ తలుక్దర్పై ''అసు'' తీవ్రవాద సంస్థ అనేకసార్లు దాడులు చేసింది. ఆయన చేసిన నేరం ఎస్.ఎఫ్.ఐ.లో పనిచేయటం, ఎస్.ఎఫ్.ఐ. ఇచ్చిన దేశ సమైక్యత నినాదానికి జైకొట్టడం, దాని కోసం విద్యార్థులను సమీకరించటంతో మానవత్వం లేని ''అసు'' తీవ్రవాదులు నిరంజన్ను తన ఇంటికొచ్చి ఆయన తల్లి, తండ్రిని బలవంతంగా బయటకు లాగి శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా నరికి గోనె సంచిలో వేసుకొని తీసుకుపోయారు.
కామ్రేడ్ రంజన్ గోస్వామి బెంగాల్ విద్యార్థి ఉద్యమంలో కీలక నాయకుడు. 1963లో బి.పి.ఎస్.ఎఫ్. ఏర్పాటు చేసి బిమన్ బసుతో పాటు ఉన్న నాయకులలో ఆయన ఒకరు. సైద్ధాంతిక నిబద్ధత కోసమే కాదు, ప్రజల కోసం పనిచేసిన నాయకుడు. 1877లో బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత సీపీఐ(ఎం) అభ్యర్థి రాధికా బెనర్జీతో కలిసి వస్తుండగా కామ్రేడ్ రంజన్పై కాంగ్రెస్ గూండాలు బుల్లెట్ల వర్షం కురిపించారు. కామ్రేడ్ జస్బీర్ సింగ్ హర్యానాలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ కురుక్షేత్ర యూనివర్శిటీలో ఎం.ఎ. అర్థశాస్త్రం చదువుతుండేవాడు. 1986లో విద్యార్థి ఎన్నికల్లో ఎస్.ఎఫ్.ఐ. గెలిచింది. ఎస్.ఎఫ్.ఐ. ఎదుగుదలను చేసి ఓర్వలేని లోక్దళ్కు చెందిన హర్యానా ఛాత్రసభ రౌడీలు జస్బీర్ను కత్తులతో, తల్వార్లతో పొడిచి చంపారు.
కేరళకు చెందిన కామ్రేడ్ కె.వి. సుదీష్ను 1994లో ఆర్.ఎస్.ఎస్. గూండాలు ఇంటికి వచ్చి తల్లి ముందే అత్యంత క్రూరంగా హతమార్చారు. ఢిల్లీ జామియా మిలియా యూనివర్శిటీ ఎస్.ఎఫ్.ఐ. నాయకుడు షకీల్ అహ్మద్ భక్షిని సంఘ విద్రోహశక్తులు పొట్టనబెట్టుకున్నాయి. కా|| అవినాష్ కుమార్ చౌహాన్ను పాట్నా యూనివర్శిటీలో అవినీతి, గూండాగిరీకి వ్యతిరేకంగా పోరాడినందుకు ఎబివిపి, ఆర్.ఎస్.ఎస్. గూండాలు క్లాస్లలో చొరబడి బాంబులేసి హతమార్చారు. కా|| నరేష్ పత్యాని ఎస్.ఎఫ్.ఐ. చురుకైన కార్యకర్త ఒరిస్సా రాష్ట్రం ''పిపిలి'' నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో 1985లో కాంగ్రెస్ గూండాలు హతమార్చారు.
కేరళలో విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1994లో జరిగిన ఉద్యమంలో నాటి రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ తూటాలతో 5 మంది కామ్రేడ్స్ను కా|| కె.కె. రాజీవన్, మధు, షిబులర్, బాబు మరియు రోహన్లను ''కుతుపరంచ''లో పొట్టనబెట్టుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్స్ చనిపోయారు. లక్ష్మినారాయణ, వీరారెడ్డి, నరసింహ, వరలక్ష్మి, భారతి, సాయిబాబు వంటి విప్లవ వీరకిషోరాలను అరాచక కాంగ్రెస్ గూండాలు, నక్సలైట్లు, సంఘ విద్రోహశక్తులు బలితీసుకున్నారు. నేడు ఈ దేశాన్ని పరిపాలించేది కూడా ''మను'' వారసులే విద్యా రంగాన్ని పూర్తి కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, అది ఇచ్చిన హక్కులను హరిస్తున్నారు. దేశంలో బిజెపి విద్యా రంగాన్ని పూర్తిగా మార్చి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ యూనివర్శిటీలలో భారీగా ఫీజులు పెంచుతుంది. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధులలో విద్యార్థులు రక్తమోడ్చారు. నేడు బిజెపి విద్యా రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసేందుకు పూనుకుంటున్నది. కరోనా సమయంలో దేశ విద్యా రంగాన్ని ప్రైవేట్పరం, విదేశీయత, కాషాయీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ చేసేందుకు నూతన విద్యా విధానం-2020ను తీసుకువచ్చారు. ఈ విద్యా విధానం దేశంలో సామాజిక అంశాలను విస్మరిస్తుంది. ధనవంతులకు ఒక రకమైన విద్య,పేదలకు ఒక రకమైన విద్యను అందించేలా ఉన్నత విద్య అయిన యూనివర్శిటీ విద్య పూర్తిగా అందకుండా పోయే ప్రమాదం ఉంది. నూతన విద్యా విధానం-2020 పేరుతో దేశంలో ''ఆర్.ఎస్.ఎస్. తన భావాలను విద్యార్థులకు చెప్పే ప్రయత్నాలు చేస్తుంది. జిడిపిలో విద్యకు నిధులు తగ్గింపు నుండి ఇప్పుడు మేం నిధులు పెంచుతామనే బూటకపు ప్రచారం చేస్తుంది''.
సాయుధ రైతాంగ పోరాట వారసత్వం కలిగిన నేల తెలంగాణ రాష్ట్రంలోనూ ఎస్.ఎఫ్.ఐ. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించింది. యూనివర్శిటీల సమస్యలు, పాఠశాలలు, హాస్టల్స్ ప్రైవేట్ యూనివర్శిటీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంది. ఈ 50 ఏళ్ళలో ఎస్.ఎఫ్.ఐ. ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా విద్యార్థులను చైతన్యం చేస్తూనే ఉంది. 50 వసంతాలు అమరవీరుల స్ఫూర్తితో పూర్తి చేసుకొని 51వ వసంతంలోకి అడుగుపెడుతుంది. అమరుల ఆశయాల సాధనకై, భారతదేశ విద్యారంగ రక్షణకై నేడు ఎస్.ఎఫ్.ఐ. పోరాడుతుంది.