Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల ఫలితా లను ధవీకరించడానికి అమెరికా కాంగ్రెస్ సమావేశమవుతుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఆయన ప్రోత్సహంతో క్యాపిటల్ భవనాన్ని ముట్టడించడం ప్రపంచాన్ని తమ దిగ్భ్రాంతికి గురిచేసింది. అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించిన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపును అధికారికంగా ప్రకటించకుండా కాంగ్రెస్ను అడ్డుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన కుతంత్రం ప్రపంచ దేశాల ముందు అమెరికా తలదించుకొనేలా చేసింది.
ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టడంతో వేలమంది ఒక్కసారిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. వాషింగ్టన్లో కాంగ్రెస్ ఉభయసభలు, కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేసే వేదిక కూడా అక్కడే ఉంటుంది. గతేడాది నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలవడం తెలిసిన విషయమే. ఎన్నికలలో మొత్తం 538 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లకుగానూ జో బైడన్ 306 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించగా, ట్రంప్కు 232 ఓట్లు లభించాయి.. అధ్యక్ష పీఠానికి అవసరమైన 270 ఓట్ల కంటే అధికంగానే బైడన్ సాధించారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్.. తన ఓటమిని అంగీకరించలేదు. ఈ విషయమై ఆయన పలు కోర్టుల్లో వేసిన పిటీషన్లన్నీ తిరస్కరణకు గురైనప్పటికీ వైఖరి మార్చుకోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తన గెలుపును అడ్డుకున్నారంటూ ట్రంప్ ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు తొలగించబడ్డాయి. ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేసిన అనంతరం ఈ వీడియోలను తొలగించారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాని కూడ నిలిపివేశారు. ఆయనపై ఎంతోకొంత మిగిలివున్న అభిమానం కాస్తా తాజాగా క్యాపిటల్ భవనం పై జరిగిన దాడితో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికైనా ట్రంప్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేకుంటే, అమెరికా చరిత్రలో ఘోరమైన అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాషింగ్టన్లో చోటుచేసుకున్న ఘటనను ప్రపంచం దేశాలూ వ్యతిరేకిస్తుండగా, తమ దేశం పరువు పోయిందని అమెరికా పౌరులు మండిపడుతున్నారు.
సుమారు 207 ఏండ్ల తర్వాత క్యాపిటల్ భవనంపై ఇలా నేరుగా దాడి జరిగింది. కేపిటల్ భవనంపై తొలిసారి 1814లో దాడి జరిగింది. నిర్మాణం పూర్తయిన 14 సంవత్సరాలకు ఈ దాడి జరిగింది. నాడు జరిగిన యుద్ధంలో బ్రిటిష్ బలగాలు క్యాపిటల్ భవనంలోకి జొరబడి లూటీ చేశాయి. నిజానికి 1812లో జరిగిన యుద్ధంలో భాగంగా తొలిసారి దాడి జరిగింది. వైస్ అడ్మిరల్ సర్ అలెగ్జాండర్ కాక్బర్న్, మేజర్ జనరల్ రాబర్డ్ రాస్ నేతత్వంలోని బ్రిటీష్ సేనలు కాపిటల్ హిల్కు నిప్పు పెట్టాయి. ఆ తరువాత ట్రంప్ ప్రోద్బలంతో ఇప్పుడు జరిగింది.
ఈ హింసను ఖండించిన మాజీ అధ్యక్షులు..
అమెరికా నలుగురు మాజీ అధ్యక్షులు ఈ ఘటనను ఖండించారు. ఈ హింసాత్మక ఘటన చరిత్రలో చేదు అనుభవంగా మిగిలిపోనుందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ట్రంప్ ఓటమి చెందారన్న నిజాన్ని ఆయన మద్దతుదారులకు వివరించి చెప్పటంలో అధ్యక్షుడు విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. మాజీ అధ్యక్షులైన బిల్క్లింటన్, జార్జ్ డబ్ల్యూ.బుష్, జిమ్మీ కార్టర్ కూడా కాపిటల్ భవనం వద్ద జరిగిన హింసను ఖండించారు. ఇక అమెరికాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై యావత్ ప్రపంచం స్పందిస్తోంది.. చైనా ఈ హింసను హాంకాంగ్ నిరసనలతో పోల్చింది. క్యాపిటల్ బిల్డింగ్లోని దశ్యాలకు చైనా సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు వెల్లువెత్తాయి.
రష్యా పాశ్చాత్య ప్రజాస్వామ్యం యొక్క బలహీనతను చూపిస్తోందనీ, ఇరాన్ ట్రంప్ ప్రపంచ భద్రతకు ముప్పు అని పేర్కొన్నాయి. అమెరికా మిత్రదేశాలు సైతం ఈ దాడిని, ట్రంప్ను ఖండించాయి. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ''చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడానికి అనుమతించలేం'' అని స్పందించక తప్పలేదు. మరోవైపు, ట్రంప్ యంత్రాంగంలో ఒక్కొక్కరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ సలహాదారు మాట్ పొటింజర్, మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రాషిమ్, వైట్హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ సారాహ్ మాథ్యూస్ తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఎట్టకేలకు ట్రంప్కి ఝలక్ ఇచ్చి.. అమెరికా ఎలక్టోరల్ కాలేజీ సంచలన నిర్ణయం తీసుకుంది. జో బైడెన్ గెలుపును అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించింది. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యారు. వైస్-ప్రెసిడెంట్గా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ను కాంగ్రెస్ ఖరారు చేసింది.
- జాజుల దినేష్
సెల్: 9666238266