Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రూనో
మానవులని రక్షించడానికి ఏసు క్రీస్తు ప్రాణత్యాగం చేసారని క్రైస్తవులు విశ్వసిస్తారు. క్రీస్తు ఆనాటి రాజుని ఎదిరించాడంటే దానర్థం ఆనాటి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలని ఆయన వ్యతిరేకించినట్టే. ఈ నమ్మకాలు ప్రజల హక్కులకు భంగం కలిగించాయని మనం భావించవచ్చు. క్రీస్తు ఆనాటి దురాచారాలకి వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత కాలంలో ఆయనని దైవంగా కొలవడం వేరే విషయం.
మధ్యయుగంలో కూడా అనేకమంది శాస్త్రవేత్తలు మత గ్రంథాలలో ఉన్న విషయాలని పరిశీలించి అవి వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని నిర్థారించుకొని ఖగోళ రహస్యాలని కనిపెట్టారు. వారిలో గెతాలియో, కోపర్నికస్, బ్రూనో ముఖ్యులు. టోలమి ప్రతిపాదించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని మత గ్రంథాలు సమర్థించగా, కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విశ్వానికి సూర్యుడే కేంద్రమని, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయని ఆయన తెలిపారు. అప్పటివరకు భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. కానీ భూమి గుండ్రంగా ఉందని రుజువైనది. సూర్యుడు కూడా నక్షత్రమని రుజువు చేశారు. సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని బ్రూనో సమర్థించాడు. ఆయన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. 1548లో ఇటలీలో జన్మించిన గ్యియర్డెనో బ్రూనో కోపర్నికస్ సిద్ధాంతానికి ఆకర్షితుడైనాడు. 1572లో మతగురువుగా నియమింప బడినప్పటికీ, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దీనిపై మరింత పరిశీలనలను, పరిశోధనలను చేసి మరిన్ని అదనపు అంశాలను చేర్చి అనంత విశ్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. బ్రూనో ప్రతిపాదనలు మత విశ్వాసాలకు విరుద్ధమైనవి కదా! మత బోధకులకు కోపం తెప్పించిన అంశం భూమికి, సూర్యునికి అంతం, ఆరంభం ఉంటాయన్నది. బ్రూనోపై 131 అభియోగాలను మోపి 1591లో కేసును నమోదు చేశారు. 1593లో బ్రూనోను గాలి, వెలుతురు చొరబడని ఒక కారాగృహంలో బంధించి ఎన్నో హింసలకు గురిచేశారు. ఈ కారాగారంలో బ్రూనో సుమారు ఏడు సంవత్సరాలకుపైగా నరకయాతన అనుభవించాడు. ప్రతిరోజూ మత గురువుల నుంచి బ్రూనోకు వర్తమానం వచ్చేది. దాని సారాంశం బ్రూనో తన ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోవడం, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఖండించడం, తాను ప్రచారం చేసిన అంశాలు తప్పని బహిరంగంగా ఒప్పుకోవడం. అయితే ప్రతి రోజూ బ్రూనో ఈ ప్రతిపాదనలు తిరస్కరించే వాడు. చివరకు బ్రూనోను మత పెద్దలు దారుణంగా చంపారు. బ్రూనో మరణానంతరం ప్రపంచ వ్యాప్తంగా విద్యావేత్తల ఆలోచనలలో పలు మార్పులు వచ్చాయి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విలువ పెరిగింది. మానవవాదానికి ప్రాముఖ్యత లభించింది. యూరప్ సమాజం మొత్తం ఆచరణాత్మక ఆలోచనలు చేయడం ప్రారంభించింది. కొన్ని సవరణలతో సూర్య కేంద్ర సిద్ధాంతం ఆమోదించబడింది. మత గ్రంథాలు కేవలం నైతిక విలువలు బోధించడానికే పరిమితం కావాలని, ఖగోళ పరిశోధనలకు అవి ఉపయుక్తం కావని గెలిలియో, బ్రూనో తరుచుగా చెప్పేవారు. అందుకే వారు మత పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. తమకు తెలియని కాలంలో మానవ సమాజం కొన్ని నమ్మకాలను, విశ్వాసాలను తయారు చేసుకుంటుంది. కాలక్రమంలో పరిశీలనల వల్ల, పరిశోధనల వల్ల ఆ నమ్మకాల, విశ్వాసాల డొల్లతనం బయటపడవచ్చు. రుజువైన విషయాన్ని మతం పేరుతో, సంప్రదాయం పేరుతో వ్యతిరేకించే శక్తులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంటాయి. వీరిని ఎదుర్కొని రుజువైన విషయాన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడే సమాజం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది. లేదంటే బ్రూనో, గెలీలియో వంటి మహనీయులు చేసిన త్యాగాలు వృధాగా మిగిలిపోయే అవకాశం ఉంది
గెలీలియో
సాధారణంగా సంఘ సంస్కర్తలకి, స్వాతంత్ర సమర యోధులకి ఉన్న ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలకి లభించడం లేదు. కనీసం విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రముఖ శాస్త్రవేత్తల జయంతులు, వర్థంతులు జరపడం లేదు. పాఠశాలల్లో వివిధ పండుగల సందర్భంగా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. శాస్త్రవేత్తల గురించి పరిచయం చేసే సందర్భాలు విద్యాలయాల్లో చాలా అరుదు. వారి విగ్రహాలు కూడా ఎక్కడా పెద్దగా కనిపించవు. ఎందరో శాస్త్రవేత్తలు తమ ప్రాణలను సైతం త్యాగం చేసి అనేక విషయాలు కనుగొన్నారు. అటువంటి వారిలో గెలీలియో ఒకరు. గెలీలియో తన పరిశోధనలతో ఖగోళ శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన కోపర్ని కస్ ప్రతిపాదించిన సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని బలపరిచాడు. గురు, శని గ్రహాలపై పరిశోధన చేసాడు. గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించగలిగాడు. 20ఏండ్ల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుంచి వ్రేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు. గెలీలియో కాలంనాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికి ఆయన డోలనా కాలాలను గణించటం విశేషం. వైద్య విద్యార్థి కాబట్టి, నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటంపై పరిచయం ఉంది కాబట్టి కాలనిర్ణయాన్ని తేలికగా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో ''పల్స్ మీటరు'' రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెన్జీ గోడగడియారాన్ని తయారు చేశాడు. మనం వాడుతున్న పెండులం క్లాక్కు కూడా మూలసూత్రం యిదే.
గెలీలియో కూడా ఆనాటి క్రైస్తవ మత పెద్దల ఆగ్రహాన్ని చవిచూశారు. అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి, కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. అయితే రెండు సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. ఆయన తన వాదాలను విడిచిపెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన ఈ ''డైలాగ్స్ కాన్సర్నింగ్ ద టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్'' అనే గ్రంథం ఐరోపా ఖండంలో సారస్వత వేదాంత గ్రంథానికి ఉదాహరణగా పేర్కొంటారు. నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్థించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను అడ్డుకున్నారు. ఆయనకు జైలు శిక్ష విధించారు. చివరికి ఆయన జైలులోనే తీవ్ర అనారోగ్యంతో మరణించారు.
గెలీలియో టెలిస్కోప్ కనుగొన్నారు. ఆయన శని గ్రహానికున్న వలయాలని పరిశీలించాడు. గురు గ్రహం యొక్క ఉపగ్రహాలలో నాలుగు ఉపగ్రహాల ఉనికిని గుర్తించాడు. శుక్రగ్రహంపై కూడా ఆయన పరిశోధన చేసాడు. సన్ స్పాట్స్పై పరిశోధన చేసి సరికొత్త విషయాలని కనుగొన్నారు. ఆయనను ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ఆధునిక సైన్స్ పితామహుడు అని కీర్తించాడు. కొందరు ఆయనను ఆధునిక ఖగోళ శాస్త్ర పితగా పరిగణిస్తారు. గెలీలియో 1564 ఫిబ్రవరి 15న ఇటలీలోని పీసా నగరంలో జన్మించారు. చిన్నప్పుడు మత విశ్వాసాలని ఆచరించినప్పటికినీ, కాలక్రమేణా ఆయన ఆలోచనలు శాస్త్రీయ దక్పథం వైపు మళ్లా యి. గెలీలియోని కూడా గొప్ప సంఘ సంస్కర్తగా చెప్పవచ్చు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, గాంధీ, అంబేద్కర్ వంటి మహనీయులు పోరాటాలు, ఉద్యమాల ద్వారా సమాజంలో మార్పు తీసురావడానికి కృషి చేయగా, గెలీలియో వంటి వారు ప్రయోగాలు, పరిశోధనల ద్వారా ప్రజల ఆలోచనలలో మార్పు తీసుకువచ్చారు. ఇటువంటి మహానీయులని నిరంతరం స్మరించుకోవాలి.
- ఎం. రాంప్రదీప్
సెల్: 9492712836