Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే కరోనా కాలం ఆపై పనిదొరకని సమయం, ఎలాగో అలాగా కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాలు, చూసి చూసి ఖర్చు పెడుతున్న మధ్యతరగతి వర్గాలు... ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. 9, 10వ తరగతులు ఆపై తరగతులు మొదలైనాయి. ఆన్లైన్లో పాఠాలు అర్థంఅయ్యి కానీ విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన కాలం కేవలం మూడు, మూడున్నర నెలలే. సరిగ్గా ఇప్పుడే ప్రయివేటు విద్యాసంస్థలకు బంగారు బాతు దొరికినట్టయింది. సంవత్సరానికి వసూలు చేసే ఫీజులు కేవలం మూడున్నర నెలలకే చెల్లించాలని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే, మేము ఆన్లైన్ క్లాసులు చెప్పలేదా? భవనాలకు అద్దెలు చెల్లించలేదా? మీకు అకాడమిక్ ఇయర్ పూర్తి కావడంలేదా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం 30శాతం సిలబస్ తగ్గిస్తే, ప్రయివేటు విద్యాసంస్థలు మాత్రం 100శాతం ఫీజు అంటే సంవత్సరానికి కట్టే ఫీజు మూడున్నర నెలలకే కట్టమంటున్నారు. ఎందుకు కట్టాలని అడిగితే ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే వెళ్లండని ముఖం మీదే చెపుతున్నారు. దిక్కుతోచని తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితులలో అప్పుతెచ్చి మరి ఫీజులు చెల్లించాల్సి వస్తున్నది. ప్రభుత్వం మాత్రం జీవోలు జారీచేశాం, పర్యవేక్షణ చేస్తున్నామని చెపుతున్నా దోపిడీ మాత్రం యధేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. కేవలం రెండవ తరగతి విద్యార్థికి ఒక మాములు ప్రయివేటు పాఠశాలవారు కేవలం ట్యూషన్ ఫీజుగా 21 వేల రూపాయలు చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. పోనీ ఆన్లైన్ క్లాసులైన జరిగాయా అంటే రెండో తరగతి పిల్లలకు ఆన్లైన్ క్లాసులులో వారు ఏమిచెప్పినట్టు, పిల్లలు ఏమి వినట్టు? ఐదవ తరగతికి కేవలం ట్యూషన్ ఫీజుగా 30,000 రూపాయలు ఫిక్స్ చేశారు. పాఠశాలల ట్యూషన్ ఫీజులు ప్రభుత్వం నెల నెలా కట్టమంటే లేదు రెండు లేదా మూడు విడతల్లో కట్టాల్సిందే అని విద్యార్థులను ఆన్లైన్ క్లాస్లోనే హెచ్చరిస్తున్నారు. సమయానికి కట్టకపోతే ఆన్లైన్ క్లాస్ లింక్ కట్ చేస్తున్నారు. ఎవరైనా ఎందుకు అని ప్రశ్నిస్తే మేము టీచర్లకు జీతాలు ఇవ్వడంలేదా అని తిరిగి ప్రశ్నిస్తారు. నిజమే కదా టీచర్లకు జీతాలు ఇవ్వాల్సి ఉందికదా అని విచారిస్తే, ఆన్లైన్ క్లాసులు కొంతమంది టీచర్లతో మాత్రమే చెప్పించి వారికి మాత్రమే 50శాతం నుంచి 25శాతం వరకు జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. మిగిలిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అంటే ఇస్తున్న జీతాలు 50 నుంచి 25శాతం వరకు, కానీ వసూలు చేస్తున్న ఫీజు 100శాతం.. పోనీ ఇతర పాఠశాలలకు వెళ్దామంటే టీసీ ఇవ్వరు. అయినా 8వ తరగతి వరకు టీసీ అవసరం లేదుగా అని వేరే పాఠశాలకు వెళ్తే పాత పాఠశాలలో విద్యార్థి పేరు చైల్డ్ ఇన్పోలో తొలగించరు. ఆ విద్యార్థి పేరు కొత్త పాఠశాలల్లో నమోదు కావటం లేదు. చైల్డ్ ఇన్ఫోలో పేరు తొలగించాలంటే పాత పాఠశాలకు ఫీజు కట్టాల్సిందే.
ఇక కళాశాలల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రయివేటు కళాశాలలలో చేరిన విద్యార్థులు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టే. ముఖ్యంగా ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం సంవత్సర ఫీజు కట్టాల్సివస్తున్నది. మూడు నెలలకే సంవత్సరం ఫీజు కట్టాలా అని ప్రశ్నిస్తే నీవు మా కాలేజీలో చదువుతున్నావన్న విషయం మర్చిపోవద్దు అని పరోక్షంగా బెదిరింపులు. ఎటూతోచని తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు కట్టాల్సివస్తున్నది. ఈ దోపిడీ చిన్నచిన్న పాఠశాలలు, కళాశాలల్లో ఉండకపోవచ్చు, కానీ ఓ మోస్తరు పెద్ద పాఠశాలలు, కళాశాలల్లో మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కరోనా కాలంలో అన్ని వర్గాలకు చివరకు ప్రభుత్వాలకు సైతం ఆదాయం తగ్గి నష్టాలపాలైతే, విద్యా, వైద్య సంస్థలు మాత్రం నష్టాలు కాదుకదా లాభాల బాటలో ప్రయాణిస్తున్నాయి. ఉపాధ్యాయులను తొలగించడం, ఉన్న వారికి జీతాలు తగ్గించడం, నిర్వహణ ఖర్చులు లేకపోవడం అందరికీ తెలిసిందే. కానీ ఫీజులు మాత్రం మొత్తం వసూలు చేస్తూ ఎడారిలో పంటలు పండించినట్టు కరోనా కాలంలో లాభాలు గడిస్తున్నారు. ఒక పక్క గత కొన్ని సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తు ఆ విద్యాసంస్థనే నమ్ముకుని ఉన్న ఉపాధ్యాయులను, వర్కర్లను, డ్రైవర్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ లేదా జీతాలు తగ్గిస్తూ మరోపక్క విద్యార్థులనుంచి మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారు. మార్కెట్లో కూరగాయల బేరంవలే ఒకరికి ఒక్క లెక్క, మరొకరికి మరోలెక్క. ఫీజులకంటూ ప్రామాణిక విధానమే లేదు. దానికి తోడు మెటీరియల్ అని వగైరా వగైరా అమ్మకాలు జరిపి ఒక పెద్ద బుక్ స్టోర్నే నడిపిస్తున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే మా మెటీరియల్నే చదవాలని ఒత్తిడి చేస్తున్నారు. విద్యా రంగం అంటే లాభాల కోసం కాదని సమాజ సేవ కోసం అని అనేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అత్యంత లాభాలు గడించే రంగంగా మార్చివేశారు. అభివృద్ధి అంటే అందమైన రోడ్లు, పెద్దపెద్ద భవనాలు, పెద్ద పారిశ్రామిక సంస్థలు, విదేశీపెట్టుబడులు మాత్రమే కాదనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజలకు కావలసిన కనీస అవసరాలైన విద్యా, వైద్యం ఉచితంగా అందించడమే కాదు, నాణ్యంగా ఉండాలి. నాణ్యమైన విద్యా, వైద్యమే భవిష్యత్తు పెట్టుబడి అని అందరూ గ్రహిస్తే, అదే భవిష్యత్తులో నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుంది.
- జుర్రు నారాయణ
సెల్:9494019270