Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు 2020కి వ్యతిరేకం గా నవంబర్ 26న ఢిల్లీలో ప్రారంభమైన ఆందోళన రోజు రోజుకూ ఉధృత మవుతున్నది. దేశవ్యాపిత ఉద్యమంగా రూపుదిద్దు కుంది. ఖండాతరాలు విస్తరించి ప్రపంచ వ్యాపితంగా మద్దతు, సంఘీభావం ఉవ్వెత్తున ఎగిసి వస్తున్నది. నేటికీ(21-2-2021) 232మంది రైతులు, కుటుంబ సభ్యులు మరణించారు. ఎముకలు కొరికే చలి, జడి వానలు పోయి ఎండాకాలం వస్తున్నది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి మహత్తర ఉద్యమం తామెన్నడు చూడలేదని పలువురు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒక వైపు.
మరొక వైపు ఆందోళనలు చేస్తున్నది రైతులు కాదు-కొద్దీ మంది ''బడారైతు బాబులు''. ఆందోళనలు కాదు-జీడిపప్పు, పిజ్జాలు, బర్గర్లు తింటూ సరదాలు చేసికుంటున్నారు. విదేశీయుల భారీ విరాళాలతో సాగుతున్నది. లాంటి వాదనలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆందోళన జీవులని, పరాన్న జీవులని, రైతుల శ్రేయస్సు కోసమే తాము ఇదంతా చేస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి పార్లమెంటు వేదిక నుంచి చెప్పారు. పైగా మన్మోహన్ సింగ్ విధానాలనే అమలు చేస్తున్నానని కూడా ప్రధాని అన్నారు. (మన్మోహన్ సింగ్ విధానాలతో విసిగి వేశారిన ప్రజలు ఆ విధానాలకు భిన్నంగా ప్రజల మేలుకు ఏదో చేస్తాడని కదా మోడీకి పట్టాభిషేకం చేసింది). రైతుల మేలు కోసమే కొత్తగా చట్టాలు తెస్తే లక్షలాది మంది దేశ వ్యాపితంగా ఎందుకు వీధుల్లోకి వచ్చారు? కనీస మద్దతు ధర చట్టంలో ఎందుకు లేదు? రైతుల ప్రయోజనాలకు అయితే రైతు సంఘాలతో చట్టాలు చేసే ముందే ఎందుకు చర్చించ లేదు? భారతీయులే కాక విదేశీయులు సహితం ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బ్రిటిష్ పార్లమెంటులోని 100 మంది ఎంపీలు భారత రైతుల ఉద్యమానికి మద్దతునిస్తూ ఎందుకు తీర్మానించారు? ఇవన్నీ ఎవరినైనా తొలచివేసే ప్రశ్నలు. వాటికి సమాధానంగా ఆ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్న వాస్తవాలే ఈ వ్యాస ఉద్దేశం.
షాజహన్ పూర్ : ఢిల్లీ- జైపూర్ జాతీయ రహదారిలో ఢిల్లీ నుంచి 100కి.మీ దూరంలో షాజహానాపూర్ సరిహద్దు ఉంది. అక్కడి నుంచి సుమారు 3-4కి.మీ దాకా వరుసగా టెంట్లు, ట్రాక్టర్లే గుడిసెలుగా ఆందోళన శిబిరాలు ఉన్నాయి. అక్కడి వారిని చూసి ఆశ్చర్యమేసింది. విపరీతమైన చలి ఉన్నప్పటికీ ట్రాక్టర్లు, ప్లాస్టిక్ పరదాలు కప్పిన గుడారాలలోనే వారు ఉంటున్నారు. అక్కడే వంటలు, తిండి, స్నానాలు, పగలు ఆందోళన, రాత్రి నిద్ర అంతా అక్కడే. ఎలా ఉంటున్నారని ప్రశ్నిస్తే వచ్చిన జవాబుతో ఒళ్ళు జలదరించింది. ''వ్యవసాయ చట్టాలు అమలులోకొస్తే మోన్ సాంటో లాంటి పెద్ద కంపెనీలవారికి బానిసలుగా మారడం కంటే ఇక్కడ చావడమే మేలనుకుంటున్నాం. అందుకే ఇక్కడే, ఇలాగే ఉంటున్నాం'' ఇది ఒక బక్క చిక్కిన రైతు జవాబు. అక్కడున్న వారంతా రైతు కుటుంబీకులే. చిన్న, పెద్ద, ముసలి వయసుల కలయిక చూడ ముచ్చటేసింది. ఇక వారి తిండి సాంప్రదాయ రొట్టెలు, బంగాళా దుంప కూర, మజ్జిగ. వారే కాదు అక్కకడకు వచ్చిన ఎవరైనా అక్కడ భోజనం చేయవచ్చు. ఆనందంగా సేవలందిస్తున్నారు.
ఒక శిబిరం గోడౌన్లోకి వెళ్లి ఈ సామానంతా ఎక్కడ నుంచి ఎలా వస్తున్నదో తెలుసుకోవాలనుకొని లోనికి వెళ్ళాం. ఆ గోడౌన్ బాధ్యుడిని కలసి వివరాలు అడిగాం. ప్రతి గ్రామం నుంచి పాలు, కూరగాయలు, ఇతర సరుకులు రోజూ వస్తాయని చెప్పాడు. ఎవరిస్తున్నారని అడిగాం. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వారి ఇండ్లలో ఉన్నవి ఒక కేంద్రానికి తెస్తే అక్కడి నుంచి వాహనాల్లో శిబిరానికి వస్తాయని చెప్పాడు. ఇంతలో ఒక జీపు కూరగాయలు, పాల క్యాన్లతో వచ్చింది. వచ్చిన సామాను భద్ర పరచడం, సక్రమంగా వినియోగించడం తన బాధ్యత అని సవినయంగా చెప్పాడు. ఇంతకీ ఆయనెవరో తెలుసుకొని ఒక్క క్షణం గొంతు ముగ పోయింది. ఆయన రాజస్థాన్లోని బాంద్రా నియోజక వర్గం నుంచి ఎన్నికైన సీపీఐ(ఎం) శాసనసభ్యులు బల్వాన్ పునియా.
అక్కడే మరొక టెంట్ దగ్గరకు వెళ్ళాం. అక్కడ ఒక పెద్దాయన చుట్టూ కొద్దీ మంది రైతులతో మాట్లాడుతున్నారు. వారివద్దకు వెళ్ళాం. వారు మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాజస్థాన్ రాష్ట్ర కార్యదర్శి అమరారామ్. వారు దాదాపుగా శిబిరం ప్రారంభమైనప్పటినుంచి అక్కడే గుడారంలో ఉంటున్నారు. ఇతర రైతు సంఘాల నాయకులు కార్యకర్తలు చాలా మంది అక్కడే ఉంటున్నారు. ఇవి షాజహానాపూర్ సరిహద్దు శిబిరం దశ్యాలు.
సింఘ: ఇది ఢిల్లీ చండీఘర్ జాతీయ రహదారిలో బాలఘర్కి దగ్గరలోని హర్యానా సరిహద్దు. రహదారిని ప్రభుత్వం మూసివేయడంతో సోనిపట్ దాకా బస్లో వెళ్లి అక్కడినుండి 20కి.మీ. హర్యానా రోడ్వేస్ వర్కర్స్ యూనియన్ నాయకులు నవీన్రానా ద్విచక్ర వాహనంపై వెళ్లాను. దాదాపుగా బాలఘర్ నుంచి సుమారు 10కి.మీ.పొడవునా గుడారాలు, ట్రాక్టర్లు, సోనిపట్ నుంచి బయలు దేరగానే మరొక ట్రాక్టర్ల ప్రవాహం కనపడింది. అదేమిటని విచారిస్తే ప్రతి రోజు ఒక గ్రామం నుంచి ఇలా ట్రాక్టర్లలో రైతులు వచ్చి పోవడం మామూలేనని తోటిమిత్రుడు చెప్పాడు. దారిపొడవునా ట్రాఫిక్ స్వీయ నియంత్రణ, అక్కడక్కడా రైతు వాలంటీర్లతోనే ఉంది తప్ప ఒక్క పోలీస్ లేరు. దారిపొడవునా కోలాహలం. అక్కడి వాతావరణం చూస్తే సమ్మక్క సారలక్క, సింగరకొండ, కోటప్ప కొండ జాతరలు గుర్తొచ్చాయి. పిల్ల పాప, కుటుంబాలకు కుటుంబాలే తరలి వస్తున్నాయి. ఇక్కడ షాజహానాపూర్ కన్నా పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. అనేక మీడియా సంస్థలు ఇక్కడ ఒక మీడియా క్యాంపు నిర్వహిస్తు ఎప్పటికప్పుడు వార్తలను చేరవేస్తున్నాయి.
ఇక్కడ కూడా షాజహానాపూర్ లాగే గ్రామాల నుంచి పాలు, కూరగాయలు, తినుబండారాలు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం కెనడాలో స్థిర పడిన పంజాబ్ రైతు కుటుంబాలవారి ఆర్ధిక సహకారంతో చలిని తట్టుకోగలిగిన గుడారాలు 5 కనిపించాయి. వీటిలో 200- 250 మందికి పడుకునే అవకాశం ఉంది. మిగిలిన వేలాది మంది తాత్కాలిక గుడారాలలోనే ఉంటున్నారు. ఇక్కడ మరొక విషయమేమంటే ప్రతి రైతు ఎకరానికి రూ.100 చొప్పున ఉద్యమ నిర్వహణకు విరాళాలు ఇస్తున్నట్టు చెప్పారు. స్తోమత ఉన్న రైతులు కొందరు ఇంక కొంత అదనంగా కూడా ఇస్తున్నారట.
దీనికి మరొక ప్రత్యేకత ఉంది. అదేమంటే సింధు వెళ్లేదారికి ఒక వైపు అన్ని పరిశ్రమలు, మాల్స్. రెండవవైపు గ్రామాలు. ఆ గ్రామాలలోని అత్యధికమంది రైతుల నుంచి సేకరించిన భూములతోనే రెండవవైపున నిర్మితమైన పరిశ్రమలు, మాల్స్ కట్టారట. భూములిచ్చినందుకు వాటిలో చిన్న చితక ఉపాధి కల్పించడంతో వారి కుటుంబాలు సాగుతున్నాయి. అయితే ఈ ఆందోళన ప్రారంభమైనప్పటినుంచి ఆ పరిశ్రమలు, మాల్స్ మూత పడ్డాయి. ఉపాధి పోయింది. వారందరికి భోజనాలు ఉద్యమ శిబిరాలలోనే కల్పిస్తున్నారు. ఆ విధంగా ఉపాధిలేనివారికి అన్నం పెట్టి ఆదుకుంటు పోరాడుతున్న అన్నదాతల విశాల హృదయం తెలుసుకొని కన్నీరు పెట్టని వారుండరు.
టిక్రి: ఇది ఢిల్లీ రోహతక్(హర్యానా) దారిలో ఉంది. ఢిల్లీ నుంచి టిక్రి సరిహద్దు వరకు మెట్రో రైలు ఉంది. ఢిల్లీ నుంచి వెళ్లే దారిలోని ఈ సరిహద్దు వద్ద ప్రభుత్వం 3 అడుగుల ఎత్తు గోడ నిర్మించి రాకపోకలను మూసివేసింది. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నారు. రోజూ ట్రాక్టర్లలో కుటుంబాలతో వచ్చి పోయే వారితో కోలాహలంగా ఉంది. ఇక్కడ కూడా సింధులో లాగే ప్రతి రైతు ఎకరానికి రూ.100కి తగ్గకుండా స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. గ్రామాల నుంచి పాలు, కూరగాయలు, తినుబండారాలు నిత్యం వస్తున్నాయి. ఇక్కడ తాత్కాలిక గుడారాలే వారి నివాసాలు. సరిహద్దు నుంచి బహదూర్ ఘర్ దాకా 8 కి.మీ.పొడవున గుడారాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇండ్ల నుంచి ఎవరికి తోచిన తినుబండారాలు వారు తయారుచేసుకొని వచ్చి ఇక్కడి వారికి పంచుతున్నారు. ప్రధాన కేంద్రాలలో ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో పలు గ్రామాల వారు ఇక్కడ తాత్కాలిక వసతి ఏర్పాటు చేసికొని వారి గ్రామస్తులు, బంధువులకు ఇక్కడే భోజనాలు తయారు చేసి పెడుతున్నారు. ఇది ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల ఆందోళన వాస్తవ ముఖ చిత్రం.
జనవరి 26 ఘటనకు సంబంధించి ఒక రైతు మాతో ఇలా అన్నాడు. వారి కుమారుడు ఇతర పిల్లలతో కలసి ట్రాక్టర్లో బయలుదేరాడట. అయితే పోలీసులు నేరుగా వెళ్ళండి అని డైరెక్ట్ చేశారట. ఆ కుర్రకారుకు విషయం తెలియదు. తీరా పోలీసుల డైరెక్షన్ ప్రకారం వెళ్తే వారు ఢిల్లీ చేరారట. అక్కడినుంచి కుర్రాడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మేము ఢిల్లీ వచ్చాం నీవెక్కడున్నావని అడిగితె తండ్రి బిత్తరపోయి, ఢిల్లీ ఎందుకు వెళ్ళావని అడిగితే పోలీసులు చెప్పిన డైరెక్షన్లో వెళ్తే ఢిల్లీ వచ్చిందని చెప్పాడట. అప్పుడా రైతు వెంటనే వెనక్కు వచ్చేయమని కొడుక్కు చెప్పాడట. ఆ విధంగా 26ఘటనతో రైతు ఉద్యమాన్ని అభాసుపాలు చేయాలనే ముందస్తు పథకం ప్రకారం ప్రభుత్వమే పోలీసుల ద్వారా రైతులను తప్పు దారి పట్టించి ఢిల్లీ వచ్చేలా చేసిందని తెలిసి విస్తుపోయాను.
కానీ ప్రధాన జాతీయ మీడియా వాస్తవాన్ని, ప్రభుత్వ కుట్రను వదిలిపెట్టి రైతులు అంగీకరించిన మార్గాన్ని అతిక్రమించి అక్రమంగా ఢిల్లీలోకి చొరబడి అలజడి సృష్టించారని ప్రచారం చేసి వీడియోలు చూపించింది. జనవరి 26, ఆగస్టు 15న ఢిల్లీలో పకడ్బందీ బందోబస్తు ఉంటుంది. రెండు మూడు రోజులు ముందునుంచే రిహార్సల్స్ జరుగుతాయి. ట్రాఫిక్ కొన్ని ప్రాంతాల్లో నిషేధిస్తారు. వేల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఢిల్లీలోని ఎర్రకోటకు కొందరు ఎలా వెళ్లారు, ఎర్రకోటలోపలికి ఎలా ప్రవేశించారు, స్తంభం ఎలా ఎక్కాడు, ఎక్కిన స్తంభం దిగి ఎవరికి దొరకకుండా ఎలా పారిపోయాడు అనేవి చిన్న పిల్లవాడికి కూడా కలిగే సందేహాలే.
ప్రజలను కొల్లగొట్టి అపరిమిత సంపదను పోగేసుకోవాలనే స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభత్వం వ్యవసాయ చట్టాలు చేసింది. వాటికి వ్యతిరేకంగా దేశంలోని 500లకు పైగా రైతు సంఘాలు సంయుక్తంగా శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆందోళనను వక్రీకరించి అణచివేయడానికి ప్రభుత్వం మొదటి నుంచి నానా అగచాట్లు పడింది. దేశ వ్యతిరేకులనే ముద్రలు వేసింది. అవన్నీ ఎదురు తిరగడంతో ఎలాగైనా ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేసి అణచివేయడానికి 26నాటి కథ ఆడించిందనే నిర్ధారణకు రావాలి వస్తున్నది. ఇది ప్రభత్వ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నది. ఇప్పటికైనా మించి పోయింది ఏమిలేదు. ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్యులు ఒకరు ఇటీవల హిందూ పత్రికలో ఒక వ్యాసం రాసారు. అందులో ప్రభుత్వం తాను తెచ్చిన వ్యవసాయ చట్టాల అమలును 18నెలలు నిలుపుదల చేస్తానని చెప్పినప్పుడు ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసికోవచ్చు కదా! అని అడిగారు. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి(ఫిబ్రవరి 13 నుండి మార్చి 7వరకు విరామం ఇచ్చారు. మరల మార్చి 8న ప్రారంభం అయి ఏప్రిల్ 8వరకు జరుగుతాయి). కావున చట్టాలు రద్దు చేసి రైతు సంఘాలు, సంబంధిత ఇతరులు అందరితో చర్చించి కొత్తగా పార్లమెంటులో ప్రవేశ పెట్టవచ్చు. అవసరమైతే స్టాండింగ్ కమిటీకి నివేదించి మరింత లోతుగా చర్చించవచ్చు. ఎలాగూ ఏడాదిన్నర సమయముందిగదా!
- ఆర్. లక్ష్మయ్య