Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితాలను ప్రజల కోసం వెచ్చించి చరిత్రలో తమకంటూ ఒక పేజీని లిఖించుకున్న వారు, త్యాగా లతో వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయిన వారు, భూస్వాముల కుటుంబంలో పుట్టి కూడా పేదల కోసం పోరాటంలో దూకిన వారు అనేక మంది ఉన్నారు. అందులో తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగుతున్న సందర్భంలో కరీంనగర్ ప్రాంత దళ నాయకుడుగా ఉండి నిజాం సేనలతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన అనభేరి ప్రభాకర్రావు ఒకరు. కరీంనగర్జిల్లా పొలంపల్లి గ్రామంలో 1910 ఆగస్టు 15న భూస్వామ్య కుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావు రాధాబాయి దంపతులకు జన్మించిన అనభేరి ప్రభాకరరావుది పేద ప్రజల పక్షపాతిగా, పోరాటయోధుడిగా గొప్ప చరిత్ర. ప్రభాకర్రావు నాయకత్వంలో రజాకార్లను, దేశ్ముఖెలను, నిజాం సైన్యాలను భూస్వాముల ఆగడాలను నిరంకుశత్వాన్ని దోపిడీని అణచి వేయడానికి అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారు. సామాన్య ప్రజానీకాన్ని చిత్రహింసలకు గురి చేసిన చోట దాడులు నిర్వహించడం ద్వారా సాయుధ పోరాటం యొక్క శక్తిని నలుదిక్కులా చాటారు.
సిరిసిల్ల ప్రాంతంలోని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న అనంతరం, సాయుధులైన దళం అనేక గ్రామాలను పర్యటిస్తూ, ప్రజలను కలుసుకుంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, భరోసా ఇస్తూ ముందుకు వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలో ఇందుర్తి గ్రామం గుండా మాందాపురం గుట్టలకు చేరుకొని అక్కడ తమ భవిష్యత్ కార్యాచరణను సమీక్షించుకోవడానికి ఆశ్రయం పొందిన సందర్భంలో ఆ అటవీ ప్రాంతంలో భోజనం చేస్తున్న దళంపైన దాడి జరిగింది. 1948 మార్చి 14న జరిగిన ఈ సంఘటనలో ప్రభాకర్ రావు దళంలో పనిచేస్తున్న సింగిరెడ్డి భూపతి రెడ్డి, దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి, మల్లారెడ్డి, ముసుకు చొక్కారెడ్డి, భూమిరెడ్డి, తూమోజు నారాయణ, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రామ్రెడ్డి నల్లగొండ రాజారామ్, చిక్కుడు సాయిలు, రోడ్ల మాధవరెడ్డితో సహా దళంలోని పన్నెండు మంది మృతి సాయుధ పోరాటములోనే తొలి పెద్ద ఎన్ కౌంటర్గా చెప్పుకోవచ్చు. ఉన్నత కుటుంబంలో జన్మించి నప్పటికీ భూస్వామ్య భావజాలాన్ని అంగీకరించని ప్రభాకర్ రావు చిన్ననాటి నుంచే సేవా దృక్పథంతో పని చేసేవాడు. సామాజిక స్పృహ బలంగా ఉన్న కారణంగా నిజాం కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే గాంధీజీతో స్ఫూర్తి పొంది స్వాతంత్ర పోరాటంలో ఉత్తరప్రదేశ్ ప్రచారక్గా నియమించ బడ్డాడు. ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో అవకాశం ఉండి తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పటికీ నాటి నిజాం పరిపాలనలోని సామాన్య ప్రజానీకం స్థితిగతులను దీనస్థితిని అర్థం చేసుకున్న ప్రభాకర్ రావు 1947 సెప్టెంబర్ 13న కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి పిలుపుతో సాయుధ పోరాటానికి నడుంబిగించి దళంలో చేరి దళ నాయకుడిగా విస్తృత సేవలు అందించాడు. హుస్నాబాద్ సమీపంలోని మహ్మదాపూర్ గుట్టల్లో విశ్రాంతి దశలో ఉన్న సమయంలో రజాకార్లు చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ప్రభాకర్ రావు నేలకొరగడాన్ని జీర్ణించుకోలేక పోయారు ఆనాటి ప్రజానీకం. ప్రభాకర్ రావు మరణించిన తర్వాత ఆయన ధరించిన కోటును నిజాం పోలీసులు, రజాకార్లు చెట్టుకు కట్టేసి షేర్ గయా అంటూ తూట్లు పొడిచి తమ అక్కసును చాటుకున్నారు అంటే నాటి పోరాట వీరులు ఎన్ని నిర్బంధాలకు, త్యాగాలకు సిద్ధపడి ఉద్యమాల్లో చేరారో నేటితరం అర్థం చేసుకోవాలి.
నాటి నిజాం పరిపాలన కాలంలో ఆర్థికంగా చితికిపోయి భూమి లేక, భుక్తి లేక, వెట్టిచాకిరి నుండి విముక్తి కానరాక నిర్బంధాల మధ్యన గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో ఆ ప్రజల స్థితిగతులను మార్చడానికి సాగించిన తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ ప్రభాకర్ రావు జీవిత చరిత్రను అధ్యయనం చేయవలసిన అవసరం నేటితరం పైన ఉన్నది. ఇప్పటికీ వారి కుటుంబం, ప్రజలు ప్రభుత్వాన్ని కోరేది తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా ఈ ప్రాంతానికి విముక్తికి సేవలందించిన ప్రభాకర్ రావు యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంగా విద్యార్థులకు అందించాలని, వారి విగ్రహాన్ని ట్యాంకుబండ్పైన ఏర్పాటు చేయాలని, అమరత్వం పొందిన మహ్మదాపూర్ గుట్టల ప్రాంతాన్ని పోరాట క్షేత్రంగా మార్చి చరిత్రను భావితరాలకు అందించడానికి కృషి చేయాలి. అదే నేటి తరానికి కావలసింది. ఈ దళంపైన జరిగిన ఎన్కౌంటర్ సంఘటన ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజానీకాన్ని ఆగ్రహావేశాలకు గురి చేయడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం మరింత ఉధతం కావడానికి తోడ్పడింది అని చరిత్రకారులు చెబుతుంటారు.
మహమ్మదాపూర్ గుట్టల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన దళ సభ్యుల యొక్క జ్ఞాపకార్థం ప్రభాకర్ రావు తదితరుల సమాధిని గుట్టల సమీపంలోనే నిర్మించడం జరిగింది. ప్రతి ఏటా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మార్చి 14న ఈ అమరుల భవన్ దగ్గర అమరుల సంస్మరణ సభను నిర్వహించడం కొనసాగుతూ వారి త్యాగాలను పోరాట పటిమను నెమరువేసుకుంటూ కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కరీంనగర్లోని హుస్నాబాద్లోనూ ఇతర ప్రాంతాలలో కూడా వారి యొక్క స్మారకార్థం భవనాల నిర్మాణంతో పాటు స్థూపాలను కూడా నిర్మించి తమ చారిత్రక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సాయుధ పోరాటం నిజాం రాజు పరిపాలనకు వ్యతిరేకంగా పేద ప్రజల విముక్తి కోసం జరిగినటు వంటిది. ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ యొక్క నాయకత్వంలో జరిగిన పోరాటమే కానీ ఇది ఆ పార్టీలకు మాత్రమే సంబంధించిన పోరాటం కాదు. ఇది ప్రజా పోరాటం. దీనిని ప్రజలందరి పోరాటంగా గ్రహించినప్పుడు మాత్రమే ప్రజా ఉద్యమాలను అర్థం చేసుకోగలం. ప్రస్తుతం కూడా భారతదేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ నాటి పరిస్థితుల కంటే భిన్నమైన పరిస్థితులు ఏమీ లేవు. కాకపోతే రాజుల పరిపాలన తప్ప. నిర్బంధం, అణచివేత, పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ప్రజా పోరాటాలపై నియంత్రణ, ప్రశ్నిస్తే జైలుపాలు వంటి అనేక ఆగడాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నవి. ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, నల్ల నరసింహులు వంటి వీరోచిత పోరాట యోధులు నేడు బతికి ఉంటే మాత్రం మౌనంగా ఉండేవారు కాదు. మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టే వారు. ప్రభాకర్ రావు చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ద్వారా నిత్య చైతన్యంగా ప్రజల కోసం ప్రజల మధ్యన నిజమైన ప్రజాస్వామిక విలువలను పరిరక్షించుకోవడానికి మనలో ఆత్మస్థైర్యం మేల్కొనాలి. ఆ చైతన్యం అవినీతిని అన్యాయాన్ని అక్రమాలను అడ్డుకునే తెగువ చూపాలి.
- వి. మల్లేశం
సెల్:9014206412