Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెలవుల్లో మీ పిల్లలకు మీరు ఏమి నేర్పించారో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ నుంచి పిల్లలు ప్రత్యేకంగా ఏమి నేర్చుకున్నారో అడగండి. అంతకు మించి ఈ మూడు నెలల్లో నేర్పించడానికి ప్రయత్నించండి. ఎంత సేపూ మొబైల్ ఫోన్స్లో గేమ్స్, టీవీలో సినిమాలు తప్ప నేర్చుకున్నది ఏమి లేదనిపిస్తుంది కదూ! అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లలకు ప్రత్యేక, వినూత్న ఆలోచనలు కలిగేలా ప్రోత్సహించాలి.
కరోనావల్ల కోల్పోతున్న బాల్యపు ఆనందాలను ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అందించాలి. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్య నేర్చుకొనే పిల్లలు, ప్రాథమిక పాఠశాలకు వెళ్లే వయసున్న చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ఇప్పటికి పదమూడు నెలలుగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. మరో మూడు నెలలు తెరిచే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ మూడు నెలలు ప్రణాళికా బద్దంగా చిన్నారులతో గడుపుతూ వారికి ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించాలి. దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ఇంట్లో మీ పిల్లలతో అడుతూ పాడుతూ నేర్పించవచ్చు. పిల్లల్లో చదువుతో పాటు సృజనాత్మకత పెంచడానికి వివిధ ప్రక్రియలు పెంపొందించవచ్చు. బొమ్మలు వేయడం నేర్పాలని అనుకుంటే కలర్ పెన్సిల్స్, క్రేయన్స్, కొన్ని వాటర్ కలర్స్ ఉంటే చాలు. నచ్చిన బొమ్మ గీయడం, గీతలతో బొమ్మలు, నమూనాలు, సున్నాలతో బొమ్మలు, రంగులు వేయడం, వస్తువులను చూసి బొమ్మలు గీయడం, మట్టితో బొమ్మలు, అగ్గిపుల్లలను అతికిస్తూ చేసే బొమ్మలు, చేతి గాజు ముక్కలతో బొమ్మలు, ఇసుక అంటించి బొమ్మలు వేయడం, పప్పులు, ధాన్యాలు అతికించి బొమ్మలు, పెన్సిల్ చెక్కతో బొమ్మలు ఇలా ఇంట్లో ఉన్న రకరకాల పదార్థాలతో, వ్యర్థాలతో ప్రతి దానికీ అర్థాన్ని కల్పిస్తూ నేర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. దీనివల్ల మంచి ఆలోచన విధానం పెరిగి, తమ తోటి పిల్లలతో వారు రూపొందించిన చిత్రానికి కథ, మాటలు అల్లి వారి భాషలో వ్యక్తీకరిస్తారు. మనం ఊహించిన దానికంటే వినూత్నంగా వారు వాటిగురించి చెప్పగలుగుతారు.
ఇంకా మిగిలిన సమయాల్లో పిల్లలకు పంచతంత్ర కథలు చెప్పండి. వారితో తిరిగి చెప్పించండి. ఇలా చేయడం వల్ల వారిలో ధారణ శక్తి పెరిగి, స్పష్టంగా మాట్లాడడం, తప్పులు లేకుండా, భయం లేకుండా మాట్లాడడం అలవాటు అవుతుంది. సుమతీ శతకం, వేమన శతకం లాంటి శతకాల నుంచి నీతి పద్యాలు నేర్పించండి. వారు వినేలా, తిరిగి చెప్పేలా చూస్తే వారు ఉత్సాహంగా నేర్చుకుంటారు. రాగయుక్తంగా పాడటం వల్ల వారు పాటలు పాడడం అంటే ఇష్టపడే అవకాశం ఉంది. చిన్నారులు ఒకసారి ఇటు వైపు ఆలోచించడం మొదలు పెడితే ఇక వారికి కాలమే సరిపోదు. మీరు కేవలం పరిశీలకులుగా మాత్రం ఉంటే చాలు. వారికి కావలసిన చిన్న చిన్న వస్తువులు అందుబాటులో ఉంటే చాలు. ఇలా చేయడం వల్ల ఉన్నతులుగా ఎదగడానికి అవకాశం కల్పించినవారు అవుతారు. చిన్నారులను అన్ని రంగాల్లో ప్రోత్సహించిన వారు అవుతారు.
మీ తీరిక వేళల్లో ఇంట్లో కూర్చొని ఆడే ఆటలను నేర్పించవచ్చు. పులి మేక, పచ్చీసు, గవ్వలాట, అష్ట చెమ్మ, కచ్చకాయలు, కైలాసం లాంటి ఆటలు ఆడే విధానం ఒకసారి నేర్పిస్తే వారు ఆడుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆట నియమాలు, గెలుపు ఓటములు సమంగా స్వీకరించడం, గెలవడానికి ప్రయత్నించడం నేర్చుకుంటారు. ఆటలాడుతూ పెరిగిన పిల్లలు ఓటమికి అతిగా కుంగిపోవడం గాని, ఒక్క గెలుపుతో ఇక చేయాల్సింది లేదన్నట్టు ఉండటంగాని చేయరు. ఆటలలో ప్రతి చిన్న వ్యక్తిగత విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చదువులలో నెమ్మదిగా ఉండే పిల్లలకు తన నైపుణ్యానికి జట్టులో లభించే గుర్తింపు వల్ల ఆత్మగౌరవం పెరిగి చదవడంలో ఆసక్తి పెరుగుతుంది.
ఇంట్లో ఉండే చిత్తు పేపర్స్తో పాము, తరాజు, పంచపాల, తుపాకీ, జల్లెడ, చొక్కా, కేమెరా, గులాబీ పువ్వు, పూలబుట్టి, రాకెట్, పడవ, కత్తి పడవ, తల, ఇల్లులాంటి ఎన్నో రకాల బొమ్మలు తయారు చేయడం కూడా నేర్పించవచ్చు. దీనికి మీరు కేవలం అతికించడానికి గమ్, కొన్ని రంగు కాగితాలు, పాత దినపత్రికలు అందుబాటులో ఉంచితే చాలు. మీరు ఊహించని బొమ్మలు కూడా తయారు చేసి మీకు బహుమతిగా ఇస్తారు. పిల్లల్లో సహజంగా ఉన్న తెలివితేటలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ పిల్లలకు మీరు మంచి నడవడికతో పాటు సృజనాత్మకత పెంచే అన్ని సహజసిద్ద ఆటలు, పనులు నేర్పించండి.
మార్కెట్లో తక్కువ ధరలో దొరికే మెదడుకు మేత ఆటలు, పజిల్స్ తయారు చేయడం, సుడోకు నింపడం, రూబిక్ క్యూబ్ కలపడం, తిక మక ఆట వస్తువులు, కలర్ బ్రిక్స్ లాంటివి చిన్నారులకు అందుబాటులో ఉంచి నేర్పించడం వల్ల సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు.
నాటి కాలంలో పిల్లలకు అన్నం తినిపించాలంటే ఇంట్లో నుండి చిన్నారులని వాకిట్లోకి, లేదా ఆరుబయటకు తీసుకువెళ్లి చందమామను చూపిస్తూ లేదా పాటపాడుతూ ప్రకృతి దృశ్యాలు చూపిస్తూ గోరుముద్దాలు తిని పించేవారు. కానీ నేటి కాలంలో అలా జరగడం లేదు. ఆకాశాన్ని, ప్రకతిని చూపించే తీరికా లేదు, పాటపాడుతూ తినిపించేటంత ఓపికా లేదు. అందుకు వారు ఎంచుకున్న మార్గం పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెట్టడం పిల్లవాడి నోట్లో ముద్ద పెట్టడం. తల్లిదండ్రులకు కావలసింది పిల్లవాడు తినడం మాత్రమే, పిల్లవాడికి కావలసినది మొబైల్ ఫోన్ మాత్రమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ పద్ధతికి అలవాటైన పిల్లలు సెల్ ఫోన్ చేతిలో పెట్టి బొమ్మలు చూపితే గానీ అన్నం తినం అనే స్థాయికి చేరుకున్నారంటే వారిని ఏ స్థాయికి తీసుకొచ్చామో తల్లిదండ్రులు గమనించాలి. అందుకే చిన్నారులతో ఎక్కువ సమయం గడుపుతూ, కొత్తకొత్త విషయాలు నేర్పిస్తూ, సృజనాత్మకత పెరిగేలా వివిధ ప్రక్రియలు నేర్పిస్తూ ఈ కరోనా, వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవాలి.
- రఘుపతిరావు జి
సెల్: 9963499282