Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ భారతదేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడు రాష్ట్రంలోని ఏరోడ్ పట్టణంలో జన్మించాడు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా, తల్లి కోమలటమ్మాళ్ గహిణిగా ఉండేవారు. వీరు కుంభకోణం పట్టణంలోని ఒక పెంకుటింట్లో నివసించే వారు. 1892 అక్టోబరులో రామానుజన్ ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో చదవడం ప్రారంభించాడు..
తల్లి నుంచి రామానుజన్ సంస్కతి, సంప్రదాయాల గురించి, ఆచార వ్యవహారాల గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు. అనతి కాలంలోనే ఆంగ్లం, తమిళం, భూగోళశాస్త్రం, గణితంలో పట్టు సంపాదిస్తు ప్రాథమిక విద్య పూర్తిచేశాడు. మంచి మార్కులతో జిల్లాలో అందరికన్నా ప్రథముడిగా నిలిచాడు. 1898 రామానుజన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు. ఈ పాఠశాలలోనే మొట్టమొదటి సారిగా గణితశాస్త్రంతో పరిచయం ఏర్పడి, కాల క్రమంలో ప్రపంచం మెచ్చే వ్యక్తిని చేసింది.
15ఏండ్లకే రామానుజన్లోని తెలివితేటలను ప్రపంచానికి చాటడానికి దోహదం చేసిన గ్రంథం జార్జ్ స్కూచ్సిడ్జ్కార్ రాసిన 'సినాప్సిస్'. అందులో ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6,165 సిద్ధాంతాలున్నాయి. అప్పటికే అందులో చాలా సమస్యలు నిరూపించబడ్డాయన్న విషయం ఆయనకు తెలియకపోవడం చేత వాటిని తన పద్ధతితో సాధించి చూపారు.
1909, జులై 14న రామానుజన్కు జానకీ అమ్మాళ్తో వివాహమైంది. సంసారం గడవటం కోసం రూ.25ల వేతనం మీద రామానుజన్ గుమాస్తాగా చేరారు. గణితంలో ఆయన ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను చూసి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం నెలకు రూ.75 ఫెలోషిప్ మంజూరు చేసింది. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని కలిసి తనకొక చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. తాను తీరికవేళలో గణితం మీద రాసుకున్న పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన ఆయన చాలా ఆశ్చర్యపోయి రామానుజన్ ప్రతిభ చాలా గొప్పదని గుర్తించాడు. తన వద్ద చిరుద్యోగిగా చేరడం బాగుండదని భావించి, మద్రాస్లోని తనకు పరిచయం ఉన్న గణిత శాస్త్రవేత్తల దగ్గరకు తన సిఫారసు లేఖతో పంపించాడు. రామానుజన్ రాసుకున్న పుస్తకాలను చూసిన కొద్ది మందిలో ఒకరైన జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్రరావు, భారతీయ గణిత శాస్త్ర సమాజంలోని బృందానికి రామానుజన్ ప్రతిభ అమోఘం అని అర్థమైంది. వారు రామానుజన్ పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు.
1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ హకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన ''కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డి''కి పంపారు. ఉన్నతస్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్ను జి.హెచ్.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్సిటీకి ఆహ్వానించారు. రామానుజన్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ ఏదైనా ఉందంటే అది రామానుజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే అని వ్యాఖ్యానించడం విశేషం.
ఇంగ్లాండులో పరిశోధన పత్రాలు రాయడానికి తగిన అవకాశాలు ఉంటాయని భావించి 1914 మార్చి 17న రామానుజన్ ఇంగ్లాండుకు ప్రయాణమయ్యారు. సరిగా తినకపోవడం, ప్రతిక్షణం పరిశోధనలపై దృష్టిపెట్టడం వల్ల అనారోగ్యానికి గురికావాల్సి వచ్చింది. అయినప్పటికీ అకుంఠిత దీక్షతో ఎంతో శ్రమ పడి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. ఎన్నో కారణాల వల్ల తీవ్రమైన అనారోగ్యంతో అక్కడనుంచి భారతదేశానికి బయలుదేరవలసి వచ్చింది. 1919 మార్చిలో ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో అలాకాక, పాలిపోయిన ముఖంతో, ఏమాత్రం బలంలేని శరీరంతో, అస్థిపంజరం వలే తిరిగి రావడం చూసి అక్కడ ఉన్నవారందరు చలించి పోయారు. అనేక రకాల వైద్యం చేయించినా ఆయన కోలుకోలేక పోయాడు. దాంతో ఆయన 1920, ఏప్రిల్ 26న పరమపదించాడు.
1918 ఫిబ్రవరి 28న ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయునిగా, 1918 అక్టోబరులో 'ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి' గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ చరిత్రకెక్కాడు. 2012, ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును ''జాతీయ గణిత దినోత్సవంగా'' ప్రకటించారు. గణితశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962లో రామానుజన్ 75వ జన్మదినం సందర్బంగా స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
కానీ శ్రీనివాసన్ రామానుజన్ మరణానంతరం అంతటి ప్రతిభ గల గణిత శాస్త్రవేత్తలను భారతదేశం తయారు చేసులేకపోవడం దురదృష్టకరం. మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట, భాస్కరుడు... ఆ తదనంతరం రామానుజన్ వంటి గణిత మేథావుల పరంపర ఆ తరువాత కొనసాగలేదు. భవిష్యత్తులోనైనా ఈ లోటును నేటి విద్యార్థి లోకం భర్తీ చేయగలదని భావిద్దాం...
- జి. రఘుపతిరావు
సెల్:9963499282