Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నీళ్ళు-నిధులు-నియామకాలు'' నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధనకై సబ్బండ వర్గాల నిర్విరామ పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అరుదైన పాత్ర పోషించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుసిపడుతున్న తరుణంలో విద్యార్థి ఉద్యమానికి తోడుగా తమవంతు సహాయం అందించడంలో ఓయూ సెక్యూరిటీ కార్మికులు కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం వస్తే ఓయూలో చదువుకున్న విద్యార్థులకు కొత్త కొలువులు రావడంతో పాటు, తమ ఉద్యోగాలకూ భద్రత వస్తుందని ఆశించిన వారికి ఆశాభంగమే జరిగి, నేడు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి సెక్యూరిటీ సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
గత 20 సంవత్సరాలుగా కేవలం రూ.6,000 జీతానికే వెట్టి చాకిరీ చేసిన సెక్యూరిటి సిబ్బంది ఎండకు, వానకు, చలికి, దోమల బెడదకు తట్టుకొని అనారోగ్యం పాలైనా, కార్మిక చట్టాల ప్రకారం కనీసం ఈఎస్ఐ లాంటి సదుపాయాలు లేకున్నా సొంతడబ్బులతో వైద్యం చేయించుకుని, అతి తక్కువ జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉస్మానియాను కంటికి రెప్పలా కాపాడటంలో జీవితాలను ఫణంగా పెట్టారునడంలో సందేహమే లేదు. అయితే ఉస్మానియాలో పనిచేస్తున్న సఫాయి కర్మచారులు, మెస్ వర్కర్లు, స్వీపర్లు వంటి పోస్టుల్లో ఉన్నదందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చెందిన కార్మికులే. వీరంతా ఏజెన్సీ రిక్రూట్మెంట్ ద్వారానే పని చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన కార్మిక చట్టాలకు తూట్లు పొడిచి కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక కార్మిక చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్పా అమలుకు నోచుకోలేదు. రాష్టం ఏర్పడ్డాక మొదటి సారిగా తేదీ 19-2-2016 నాడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో14 ప్రకారం వీరికి కనీస వేతనం రూ.12,000 చేయాల్సిన భాద్యత అధికారులపై ఉన్నప్పటికీ అదే ఆరువేల జీతమిస్తూ ప్రభుత్వ జీవోను సైతం అమలు చేయకుండా అప్రజాస్వామిక వ్యవహరించారు. కేవలం మాటలకే పరిమితమైన ఇదే తెలంగాణ ప్రభుత్వం తేదీ.25-6-2021నాడు కనీస వేతన చట్టం-1948ని సవరించి అసంఘటిత కార్మికులకు జీవో 21 ప్రకారం కనీస వేతన సవరణ చేస్తూ ప్రతి కార్మికునికి కుల, మత, లింగ బేధం లేకుండా ప్రతి కార్మికుడికి కనీసం రూ. 21,673 చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది. అందరికి కనీసం ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీటన్నింటినీ పట్టించుకుపోకుండా కార్మికుల హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకుండా ఉన్న ఉద్యోగాలను తీసేసి అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఆర్టికల్ 23, 24 ప్రకారం కార్మికుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. ప్రభుత్వ ఉత్తర్వులను సైతం పట్టించుకోని యాజమాన్యం జీతాలు పెంచమని ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ నిధుల కొరత సాకుతో సెక్యూరిటీలతో వెట్టి చాకిరి చేయించుకున్నారు. నిధుల కొరత అనేది వాస్తవమే అయితే యాజమాన్యానికి, అధికార పార్టీ అనునాయిలైన కొత్త ఏజెన్సీకి పర్మిషన్ ఇచ్చి ఎక్స్ మిలటరీ వాళ్ళను రూ.19,500తో రిక్రూట్ చేసుకోమని కొత్త నోటిఫికేషన్ ఎలా విడుదల చేసారు? కార్మిక చట్టాల ప్రకారం ఏ ఉద్యోగినైనా అమాంతం తీసేసి రోడ్డున పడేసే అధికారం యాజమాన్యాలకు లేదు. ప్రయివేటు కంపెనీల్లో, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించి ుష్ట్రవ ×అసబర్తీఱaశ్రీ ణఱరజూబ్వర Aష్, 1947కు సంబంధించిన ×అసబర్తీఱaశ్రీ =వశ్రీa్ఱశీఅర జశీసవ, 2020 (×=జ)లోని సెక్షన్ 44(7) ప్రకారం ఇండిస్టీయల్ ట్రిబ్యునల్ లో న్యాయవిచారణ అనంతరం వారికి కనీసం మూడు నెలలకు సరిపడ జీతభత్యాలు ఇచ్చి గ్రాట్యుటీ వంటివి విడుదల చేసి సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగమే కాదు ప్రయివేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ ప్రజల నుండి వస్తున్నా, కనీస స్పందన లేకుండా కొత్త నోటిఫికేషన్లో రిజర్వేషన్ అనేది లేకుండా ఆల్రెడీ వేలల్లో పింఛను పొందుతున్న మిలటరీ వారికి ఉపాధి అవసరమా లేక బతుకుదెరువులేక ఇన్నేళ్లు వెట్టి చాకిరీ చేసిన వీరికి అవసరమా అనేది యజమాన్యాలు పునరాలోచించాలి. ఉమ్మడి రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాలుగా ఏజెన్సీలు మారినా ఊడిపోని ఉద్యోగాలు... ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే తీసేయడం అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రామాణికమైన 'ఉద్యోగాలు' అనే నినాదం ఒట్టి మాటే అని అర్థమవుతుంది.
తెలంగాణ ఆకాంక్షను క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే క్రమంలో అద్దమ్మరాత్రుల వేళ యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థులకు అన్నం దాచిపెట్టి కడుపు నింపి కుటుంబ సభ్యుల వలే చూసుకున్న ఘనత ఈ క్రింది స్థాయి అసంఘటిత కార్మిక వర్గానిది. కార్మికుల హక్కులు సాధించుకునే క్రమంలో విద్యార్థి సంఘాల పాత్ర అమోఘమైనది. ప్రస్తుతం చేస్తున్న పోరాటంలో ఉస్మానియా సెక్యూరిటీ కార్మిక సంఘంలో విద్యార్థులు భాగమైనా, పోరాటాలను పట్టించుకోని అధికారుల, ప్రభుత్వ నిరంకుశత్వానికి, లేబర్ కోర్టుల్లో తేల్చుకోవాల్సిన దుస్థితికి తెలంగాణ రాష్ట్రం దిగజారిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డాక సామాన్యుల హక్కులను ప్రభుత్వం పెడచెవిన పెడితే కోర్టుల్లో తేల్చుకున్న అంశాలే కోకొల్లలు, అంటే ప్రభుత్వ అధికారులు కేవలం కొన్ని సంపన్న వర్గాలకు, అధికార పార్టీ కుటుంబాలకోసమే పాలేర్లుగా పనిచేస్తున్న దుస్థితి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని 182 మంది సెక్యూరిటీలను అధికారుల ఒకే ఒక్క మాటతో తీసేసి ఆయా కుటుంబాలను రోడ్డున పడేసారు. దీంతో యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా ఉద్యోగ భద్రతపై భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉన్న ఉద్యోగాలకే గ్యారంటీ ఇవ్వలేని ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తుందా..? భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ, బతుకుదెరువు కొరకు మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి కార్మిక, కర్షక, విద్యార్థి, యువత సబ్బండ వర్గాలు సన్నద్ధం కావాల్సిన సందర్భమిది.
- ముఖేష్ సామల