Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితమంతా కవిత్వాన్నే ఆరాధిస్తూ, పల్లెల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లుతూ, ఎందరో కళాకారులను వెలుగులోకి తెస్తున్న నిత్య సాహితీ సంచారి ఆయన. తన భుజాలకు వేలాడే సంచుల నిండా పుస్తకాలను పంచుతూ విజ్ఞానాన్ని వెదజల్లిన వట్టికోట ఆళ్వార్ స్వామి వారసుడాయన. చదువుకోవడానికి పుస్తకాలు దొరకకపోవడంతో తాను పడ్డ అవస్థలు మరొకరు పడకూడదని భావించి తన సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చి రెండు లక్షలకుపైగా గ్రంథాలను కూర్చి సమాజానికి అంకితం చేసిన ఆయన. ఎనిమిది పదుల వయస్సు దాటినా నవ యువకుడిలా గ్రంథాలయాన్ని నిర్వహిస్తూ ఎందరో పరిశోధక విద్యార్థులకు దారి దీపంగా నిలుస్తున్నారు. వారే డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో జన్మించిన విఠలాచార్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆరు నెలల వయసులోనే తండ్రిని కోల్పోయి తల్లి శిక్షణలో పెరిగి పెద్దయ్యారు. విఠలాచార్య ప్రాథమిక విద్యాభ్యాసం నీరునెముల, వెల్లంకి గ్రామాల వీధి బడులలో జరిగింది. ఉన్నత పాఠశాల విద్య కోసం భువనగిరి పోఖానియా పాఠశాలలో చేరారు. భువనగిరిలో వారాలు చేసుకుని చదువుకున్నారు. ఆ రోజుల్లో చదువుకోవడానికి పుస్తకాలు లేకపోవడం వల్ల తోటి విద్యార్థులు నిద్రించిన తర్వాత తాను మేలుకొని మళ్లీ ఆ విద్యార్థులు నిద్రలేచే వరకు చదివి పడుకునేవాడు. ఇలా పుస్తకాలు లేక ఇబ్బంది పడిన సందర్భాన్ని ఆయన జీవితంలో ఎప్పుడూ మరచిపోలేరు. విద్యార్థిగా ఉన్నప్పుడే తోటి మిత్రుల సహకారంతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కానీ అది ఎంతో కాలం నిలువలేదు. అనంతరం కూరెల్ల లక్ష్మీ వెంకట రాజయ్య గ్రంథాలయం 1962లో ప్రారంభించారు. అది కూడా పూర్తిస్థాయి గ్రంథాలయంగా నిలదొక్కుకోలేకపోయింది. అప్పటి నుంచి తన ఊరిలో ఒక పెద్ద గ్రంథాలయం స్థాపించాలన్న కోరిక బలపడింది. ఇలా పరోపకారం కోసం విజ్ఞానాన్ని పదిమందికి పంచడం కోసం నిరంతరం తపిస్తుంటారు విఠలాచార్య.
జీవిక కోసం అనేక ఉద్యోగాలు చేసినా తనకు ఇష్టమైన వృత్తి అధ్యాపకత్వాన్ని చేపట్టారు. పనిచేసిన ప్రతి చోటా ఎందరో విద్యార్థులను సాహిత్యం వైపు, సృజన వైపు మళ్ళించారు. వారి శిష్యులు ఎందరో నేడు సాహిత్యంలో లబ్దప్రతిష్టులుగా కొనసాగుతున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్నతనంలోనే విఠలాచార్య సాహితీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తాను పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తాత బేతవోలు లక్ష్మీనారాయణ మరణించినప్పుడు స్మృతి కావ్యం రాశారు. ఇది వారి తొలి రచన. 1954లో రఘునాథపల్లి రైలు ప్రమాదానికి చలించి అధిక వృష్టి అనే కవిత రాశారు. తాను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడే గోవిలాపం అనే కావ్య ఖండిక రాశారు.
ఉపాధ్యాయుడిగా నియామకం అయిన తర్వాత భువనగిరి సమీపంలోని వడాయిగూడెంలో వయోజనులకు విద్య నేర్పాలన్న లక్ష్యంతో సింగి సింగడు అనే నాటిక రాశారు. తెలుగు నవలల్లో స్వాతంత్య్రో ద్యమ చిత్రణ, తెలుగులో గొలుసుకట్టు నవలలు, స్వాతంత్య్రోద్యమం ఆంధ్రప్రదేశ్లో దాని స్వరూపం, విఠలేశ్వర శతకము, మధురకవి కూరెళ్ల పీఠికలు, స్మృత్యంజలి, కవితా చందనం, తెలంగాణ కాగడాలు - సీసమాలిక, పంచమి వ్యాససంపుటి, వెల్లంకి వెలుగు, కవిరాజు ఏలె ఎల్లయ్య సంక్షిప్త చరిత్ర, చద్దిమూటలు, దొందూ దొందే, మనకథ, శిల్పాచార్యులు, హైదరాబాద్ సంస్థానం నల్లగొండ జిల్లాలో రజాకార్ల దురంతాలు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, శతాధిక శీర్షికలు శతాధిక సీసాలు, తెలంగాణ ఉద్యమ కవితలు, నాని నేత్రాలు మొదలైన ఇరవై రెండు గ్రంథాలు రచించారు.
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చిన్నప్పటి నుంచీ ఉద్యమ జీవి. తాను పుట్టి పెరిగిన పరిసరాల ప్రభావం ఆయనపై బలంగా ఉంది. తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నీరునెముల ఆంజనేయస్వామి ఆలయంలో నిమ్నకులాలతో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఇది అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి కారణమైంది. ఆ సహపంక్తిలో భోజనం చేసిన అగ్రవర్ణాల పిల్లల నాలుకలను బంగారు తీగతో కాల్చి తమ ఇండ్లలోకి అనుమతించారు. విఠలాచార్యను గ్రామ బహిష్కరణ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇలా చిన్నతనం నుంచే వివక్ష పట్ల ధిక్కార స్వభావం కలిగిన వారు విఠలాచార్య. అక్షరాస్యతా ఉద్యమం, ఉపాధ్యాయ ఉద్యమం, నల్లగొండలో ప్రారంభించిన విశ్వవిద్యాల యానికి పోతన నామ సాధన ఉద్యమం, ఊరూరా గ్రంథాలయ ఉద్యమం మొదలైన అనేక ఉద్యమాలతో మమేకమై నడిచారు. పల్లెల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక సాహితీ సంస్థలు స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కవులు కళాకారులను వెలికితీసే ప్రయత్నంలో ఈ సంస్థలు చేసిన కృషి ఎనలేనిది.
విద్యార్థులలో సృజనను వెలికితీయడానికి పత్రికలు బలమైన సాధనాలు. ఈ మర్మం తెలిసినవాడు కనుకనే విఠలాచార్య పనిచేసిన పాఠశాలల్లో, కళాశాలల్లో కొన్ని పత్రికలు ఏర్పాటు చేసి విద్యార్థులను కవులుగా రచయితలుగా తీర్చిదిద్దారు. వలిగొండ మండలం గోకారంలో బాపు భారతి, వెల్లంకి పాఠశాలలో మన తెలుగు తల్లి, వలిగొండ ఉన్నత పాఠశాలలో వలి వెలుగు, సిరిపురం ఉన్నత పాఠశాలలో చిరంజీవి, నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రియంవద, రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముచికుంద పత్రికలతో పాటు లేఖిని మొదలైన పత్రికలను స్థాపించి సాహిత్యాన్ని విస్తరింపజేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విఠలాచార్య నిర్వహిస్తున్న గ్రంథాలయం మరో ఎత్తు. సామాజిక రుగ్మతల నివారణకు, విజ్ఞాన సమాజ నిర్మాణానికి గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని విఠలాచార్య బలంగా విశ్వసిస్తారు. అందుకే తాను పుట్టిన ఊర్లో అతి పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించాలనే లక్ష్యంతో మొదట ఐదు వేల పుస్తకాలతో తన సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చి 2014లో ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆ గ్రంథాలయం నేడు యాభై లక్షల విలువైన పక్కా భవనంతో పాటు రెండు లక్షల పైచిలుకు పుస్తకాలతో ఎంతో మంది విద్యార్థులకు పరిశోధకులకూ ఉపయుక్తంగా మారింది. కేవలం తెలంగాణ నుండే గాక ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుండి కూడా పరిశోధక విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుండటం విశేషం. ఈ గ్రంథాలయ స్ఫూర్తితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక చోట్ల యువకులు గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కక్కిరేణి, అమీనాబాద్, చిత్తాపురం, మొగిలి పాక, తంగడపల్లి, షా పల్లి, రాఘవాపురం, మొదలైన గ్రామాలలో విఠలాచార్య గారే స్వయంగా వెళ్లి ఆయా గ్రంథాలయాల్ని ప్రారంభించారు. యువకులు ముందుకు వచ్చి గ్రంథాలయాలను ప్రారంభిస్తే ఆ గ్రంథాలయాలకు వందలకొద్దీ పుస్తకాలూ బహూకరిస్తారు. ఇలా గ్రంథాలయాల వ్యాప్తిని ఒక ఉద్యమ స్ఫూర్తితో నడిపిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విశిష్ట పురస్కారాన్ని అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించే దాశరథి సాహిత్య పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. అనేక సాహిత్య సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వీరి కృషిని గౌరవించాయి. ఇటీవలి కాలంలో విశ్వగురు ఫౌండేషన్ వారు అంతర్జాతీయ స్థాయి పురస్కారాన్ని, మూసి సాహిత్య వేదిక వారు బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారాన్ని అందజేశారు. అనేక సంస్థలు విశ్వవిద్యాలయాలు జీవన సాఫల్య పురస్కారాల్ని అందజేశాయి. అయితే ఆరు దశాబ్దాలకు పైగా సాహితీరంగంలో, సామాజిక రంగంలో విశేష సేవలందిస్తున్న విఠలాచార్యకు ప్రభుత్వ గుర్తింపు కంటే సామాజిక గుర్తింపే ఎక్కువ.
పల్లెలను సాహిత్యానికి ఆటపట్టు చేయాలన్న దృఢ సంకల్పంతో తన ఉద్యోగానికి సైతం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్న ఈ సాహితీ సమరయోధుడు నేటి తరానికి ఆదర్శం. పుస్తకాన్ని మరిచిపోయి డిజిటల్ యుగంలో బతుకుతున్న నేటి యువతరానికి తన గ్రంథాలయం ద్వారా చేస్తున్న సేవ మార్గదర్శకం కావాలి.
(డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాన్ని భారత ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తున్న సందర్భంగా....)
సెల్: 7989117415
సాగర్ల సత్తయ్య