Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సరిగా అమలుచేయలేదు. అన్ని రంగాల్లో విలువలు పతనమయ్యాయి. అవినీతి పెరిగింది. ఎన్నికల్లో ధనకండబలాలు పెరిగాయి. నేరరాజకీయీకరణ, రాజకీయ నేరమయం జరిగాయి. కులమత విభజన ధోరణులు చొరబడ్డాయి. రాజ్యాంగ పీఠిక లక్ష్యాలు సాధించబడలేదు. సామాజిక సేవాదృక్పథంతో, త్యాగంతో నిండవలసిన రాజకీయాలు లాభసాటి వ్యాపారంగా, లూటీ వ్యవస్థగా మారాయి. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆరోగ్యం, నీరు, ఆహార సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రభుత్వాల బలం, స్థిరత్వం ప్రజా శ్రేయస్సుకు కాక బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు ఉపయోగ పడ్డాయి. నిన్నటి దాకా నీతిజ్ఞులు కాని రాజకీయులు దేశాన్ని పాలించారు. నేడు పుక్కిటి పురాణాల, ఊహాగాథల, అసత్య భావజాల తాత్విక, మతాధార సమాజ విభజన మతాంధులు పాలిస్తున్నారు. రాజకీయ సామరస్యత, సమన్వయాలు, సామాజిక నిర్మాణం, శాంతి భద్రతల నిర్వహణ, ఆర్థిక అభివృద్ధి, దేశ సమైక్యత, సమగ్రతల్లో వీరు ప్రజాకంఠకులు. ఫలితంగా నేడు ప్రజాస్వామ్యం పతన స్థాయికి, రాజ్యాంగం ప్రమాద స్థితికి చేరాయి.
నిన్న మొన్నటి పాలకులు కొందరు చెడుగా, కొందరు అధ్వాన్నంగా ఉన్నారు. కానీ నేటి పాలకులు అతి దుష్టులు. నేటి పాలక పక్షాలు మతమౌఢ్య అడ్డాలు. రాజ్యాంగ వ్యవస్థల పనితీరు అధ్వాన్నమైంది. నేటి పాలకుల పూర్వీకులు దేశవిభజన కోరుకున్నారు. ముస్లింలు పాకిస్థాన్కు వెళతారని హిందువులు మాత్రమే మిగిలి భారత్ హిందూదేశమౌతుందని ఆశించారు. వారి ఆశలు నెరవేరలేదు. అందుకే నేడు అధికారం చేపట్టిన మతాంధ వారసులు దేశాన్ని హిందూదేశంగా మార్చుతున్నారు. మతం రాజ్యాన్ని అతిక్రమించింది. అందుకే రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడింది. దేశ వ్యవస్థాపక పితామహులు విశిష్టత కలవారు. వివేక వంతులు. న్యాయవేత్తలు. దేశభక్తులు. స్వాతంత్య్ర సమరయోధులు. మత అత్యాచారహత్యలు, మతాధిక్య కేంద్రీకరణతో, అల్పమతస్తులను భయాందోళనలకు గురిచేసి అధికారం అందుకున్న మతప్రచారకుల్లో ఈ గుణాలుండవు. మన రాజ్యాంగం ఆంగ్లేయ పాలనను తిరస్కరించింది. ఆంగ్లేయ సంస్థలను కొనసాగించింది. ఫలితంగా సామ్రాజ్యవాదం కొనసాగింది. 1990లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మొదలైంది. వీటిని నిన్నటి పాలకులు పాటించారు. నేటి పాలకులు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సామ్రాట్ అమెరికాకు దాసోహమయ్యారు. స్వాతంత్య్రం, స్వావలంబన సంక్షోభంలో పడ్డాయి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తిగౌరవం, జాతి ఐక్యత, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్య నిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించు కున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించు కుంటున్నాం..'' ఇది మన రాజ్యాంగ పీఠీక. ఈ పీఠిక రాజ్యాంగ మౌలిక రూపం.
1973 కేశవానంద భారతి-కేరళ ప్రభుత్వం కేసులో రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని, మౌలిక స్వరూపాన్ని మార్చరాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రాజ్యాంగ సవరణలు, చట్టాలు రాజ్యాంగ పీఠికలోని అంశాలకు కట్టుబడి ఉండాలి. నేటి ప్రభుత్వ చట్టాలు, సవరణలు ఈ పీఠికకు తూట్లుపొడిచాయి. నేటి పాలకులు ప్రజా రాజ్యాంగాన్ని పాలక గ్రంథంగా మార్చారు. సర్వసత్తాక పదానికి అర్థం మార్చారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ దోపిడీలను సామ్యవాదం నిరోధిస్తుంది. నేటి పాలకులు ఆదాయ తారతమ్యాలను పెంచారు. వాణిజ్యవేత్తలకే ఉద్దీపనలు ఇచ్చారు. సామాన్యులను ఇబ్బంది పెట్టారు. దోపిడీ పెంచారు. సామ్యవాద భావాన్ని హత్యచేశారు. రాజ్యం మతాతీతంగా ప్రవర్తించటం, హేతు, భౌతిక, మానవ వాదాలను ప్రోత్సహించటం లౌకిక లక్షణం. నిన్నటి ప్రభుత్వాల్లో నిర్వీర్యమైన లౌకికభావం నేటి పాలనలో మాయమైంది. దేశాన్ని హిందురాజ్యంగా మార్చే పనులు పెరిగాయి. పౌరసత్వ సవరణ చట్టంలో లౌకికత్వం పతనమైంది. ఎస్.ఆర్.బొమ్మై-భారత ప్రభుత్వం కేసులో, బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో, లౌకికత్వాన్ని మంటగలిపిన బీజేపీ ప్రభుత్వాల రద్దును 1994 సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది. మతమౌఢ్య మోడీ-షా ప్రభుత్వ అలౌకిక తాత్వికత దుర్మార్గమైంది. మతాచారాలను, మతకార్యకలాపాలను క్రమబద్దీకరించవచ్చు, నియంత్రించవచ్చన్న 25(2) అధికరణను తుంగలో తొక్కారు. సామ్యవాద, లౌకిక పదాలనే రాజ్యాంగం నుండి తొలగిస్తామన్నారు. ఈ పదాల వాడకం మానేశారు. ప్రజాస్వామ్యం స్థానంలో ఏకఛత్రాధిపత్యం, నియంతృత్వం ఏలుతున్నాయి. నిర్ణీత కాలానికి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ప్రభుత్వమే గణతంత్రం. ఈ ప్రభుత్వం గణతంత్రాన్ని నాశనంచేసింది. గణతంత్ర వేడుకలను కాషాయీకరిస్తోంది. ''మార్క్సిజం పట్ల జనాకర్షణకు కారణం దాని శాస్త్రీయ సిద్ధాంతం మాత్రమే కాదు, సామాజక న్యాయ తపన'' అని నెహ్రూ అన్నారు. నేడు న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి నల్లపూస. భ్రమభయాలు, ఆశలతో ప్రభుత్వం న్యాయమూర్తులను లొంగదీసుకుంది. అన్నీ ఏకగ్రీవ తీర్పులే. అసమ్మతి ఆనవాళ్ళు కనిపించవు. తన దుశ్చర్యలను ప్రశ్నించినవారిని, తాత్వికతను ఆమోదించనివారిని ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్టుచేసింది. శిక్షించింది. హత్యలు చేయించింది. స్వేచ్ఛకు సంకెళ్ళు వేసింది. రాజ్యాంగ సమానత్వ అధికరణలు 14-18లను తిరస్కరించింది. సంఘీయులనే పదవుల్లో, అధికారాల్లో నియమించింది. ప్రజల వ్యక్తిగౌరవాన్ని మంటగలిపింది. వీరి జాతి ఆర్య జాతి. మతం హిందువాదం. వీరి ఐక్యత అఖండతలు ఇవే. భారతీయ సౌభ్రాతృత్వం, అంతర్జాతీయ మానవత్వం లేకుండా దేశ సమైక్యత, సమగ్రతలకు సంపూర్ణత లేదు. హిందూయేతరులను తిరస్కరించి భారతీయ సౌభ్రాతృత్వ భావనకు తూట్లుపొడుస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యంచేస్తోంది. కాషాయీకరిస్తోంది. దేశ సమాఖ్య స్వభావానికి గండికొడుతోంది. సంఘీయులు మహిళలను అవమానించారు. బాబాలను, అమ్మలను, గాడ్సే భక్తులను ప్రోత్సహించారు. ప్రజాప్రతినిధులను చేశారు. ఈ పనులన్నీ సంఫ్ు సిద్దాంతకర్త గోల్వాల్కర్ ప్రవచించినట్లు రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్మృతిని రుద్దడానికే. అందుకే ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్నే కాదు దేశాన్నే భ్రష్టుపట్టిస్తుంది. రాజ్యాంగ నిర్మాత ఆంబేడ్కర్ సూచించినట్లు దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే. రాజ్యాంగ రక్షణకు పౌరసమాజం నడుంబిగించాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545