Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దారిద్య రేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్న ప్రజలను ఆదుకోవడానికి, ఆర్థికంగా చేయూతనివ్వడానికి తగు సంక్షేమపథకాలను రూపొందించి అమలుపరచడం ప్రభుత్వాల బాధ్యత, నేటి అవసరం కూడా. అయితే ఇందులో ఉచితాలు అనుచితాలుగా మారితేనే అపాయం. ప్రజల మౌలిక అవసరాలైన విద్య ఆరోగ్యం న్యాయం ఉచితంగా అందించకుండా, వారి నిజమైన అవసరాలను గుర్తించకుండా, కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకోసం ఇచ్చే జనాకర్షక పథకాలు ప్రజలను మభ్యపెట్టగలవే తప్ప ఉద్ధరించలేవు. నిజానికి ఇవి అదే ప్రజలకు భారంగా మారుతాయి.
ప్రస్తుత దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రజల అభివృద్ధి పరచడానికి గాక తిరిగి గెలవడానికి రకరకాల పథకాలను అమలు పరుస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలలో ప్రజలు అడగకుండానే ''అన్నీ ఉచితంగా ఇస్తాము'' అనే మాట పరిపాటిగా మారింది. సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్లు అప్పు చేస్తున్నారు. అది పాపం పెరిగినట్టు పెరిగి... బారువడ్డీ, చక్రవడ్డీలతో ఆ రాష్ట్ర ఖజానాను దివాళా తీయిస్తుంది. దాని నుండి బయటపడటానికి తిరిగి ప్రజలే పన్నుల రూపంలో ఆ భారాన్ని మోయాల్సివస్తోంది. ''నేల విడిచి సాము'' అన్నట్టు ప్రజల ఊహకు అందని హామీలను ఉచిత పథకాల జాబితాలో చేర్చి ప్రజాస్వామ్య విలువలను పతనం చేస్తున్నారు. విచక్షణాజ్ఞానం లేకుండా ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే ఉపాధి కల్పించే పథకాలను రూపొందించకుండా ''గాలి పొట్టు'' వంటి పథకాలను ఎలక్షన్ మేనిఫెస్టోల్లో పెడుతున్నారు. రేపు అధికారంలోకి వచ్చాక, తాము చేసిన హామీలను నెరవేరుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇస్తామన్న ఉచిత పథకాలు ఏ మేరకు పూర్తి చేయగలమని కనీస విషయ పరిజ్ఞానం లేకుండా నోటికి ఎంత వస్తే అంత ఉచితం అంటున్నారు. ప్రభుత్వ ఆర్ధికపరిస్థి ఎలావుందో, ఉన్న ఆదాయ వనరులు ఎలా కాపాడుకోవాలో, వాటిని ఎలా అభివృద్ధి పరచాలో కనీస అవగాహన లేకుండా.. ప్రజలను ఎలా ఆకర్షించాలీ, అధికారంలోకి ఎలా రావాలీ అన్నదే ఏకైక లక్ష్యంగా పథకాల రూపకల్పనతో తలమునకలవుతున్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. పారిశ్రామికరంగంలో పురోగతిలేదు. నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది. కొత్త ఉద్యోగాల రూపకల్పనలేదు. పెట్టుబడులనెలా ఆకర్షించాలో, ప్రజలకు ఉపాధినెలా కల్పించాలో తెలియక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కుదేలు అవుతున్నది. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ప్రజల దీర్ఘకాలిక అవసరాలూ, శాశ్వత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా ''కళ్ళాలు లేని గుర్రాల్లా'' అవసరానికి మించిన ఉచితాలు ఏ ప్రయోజనాలకోసం?
ఈ మధ్య ప్రజలకిచ్చే ఈ ఉచితపథకాల వల్లే దేశం దివాలా తీస్తున్నదని కొత్త సూత్రీకరణలు మొదలయ్యాయి. అనుచితాలు కూడదంటే అర్ధం చేసుకొవచ్చుగానీ, అసలు ఉచితాలే కూడదంటే, అందువల్లే నష్టపోతున్నామనడం అర్థంలేని వాదన. ఆ మాటకొస్తే ఈ దేశంలో కార్పోరేట్లకూ, బడా వ్యాపారవాణిజ్య సంస్థలకూ ఇస్తున్న ఉచితాలూ రాయితీల ముందు పేదలికిచ్చే ఉచితాలు ఏపాటివి. అవసరానికి మించిన ఉచిత పథకాలను ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టడం మాని వారి నిజమైన అవసరాలను, అందుకు తగిన పథకాలను రూపొందించాలి. కొన్ని రాష్ట్రాల్లో ఉచిత పథకాల్లో ఎవరికి ఎవరు తీసిపోని విధంగా పోటీపడి మరీ వ్యవహరిస్తున్నారు. ''సంక్షేమం'' అనే మాట పట్టుకొని దేశానికి ''పునాదిరాళ్లు'' అయినా ప్రజల మౌలిక అవసరాలను విస్మరిస్తున్నారు. ఇచ్చిన హామీ నిలుపుకోలేక ప్రజల ముందుకు ఎలా రావాలో తెలియక... ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతున్నారు. ''బడిలో పిల్లలు గొడవ పడినట్టు ''రాజకీయ నాయకులు ఎదురుపడి మరి పోట్లాడుతున్నారు. ''మాటల'' సంగతి చెప్పతరం కాదు. వాటన్నింటినీ ''ఓటరు'' నిశితంగా గమనిస్తూ ఉన్నాడు. అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా అందించడంలో ఉచిత పథకాలు ''ముఖ్య భూమిక''ను పోషిస్తాయి. తరతరాలుగా అభివృద్ధి రేఖకు దిగువన ఉన్న ప్రజల అభ్యుదయానికి, ఆర్థిక స్వాతంత్రానికి ఉచిత పథకాలు ఆసరాగా నిలుస్తాయి. వాటి ద్వారా రాబోయే తరాలకు గట్టి పునాది వేసే అవకాశం ఉంటుంది.
ప్రజలు ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరల విషయంలో అదుపు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన నెలవారి జీతాలు దశలవారీగా ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది!? వివిధ రకాల పెన్షన్లు కూడా దశలవారీగానే పడుతున్నాయి. ఎందుకు..? లోపం ఎక్కడ జరుగుతుంది...!?
ఉత్పాదక వర్గంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి .''దూది పింజల్లా ఎగిరిపోయే'' పథకాలు కాకుండా శాశ్వతంగా ఉపాధి కల్పించే మార్గాలను అన్వేషించాలి. మన భారతదేశం స్వతంత్రం సంపాదించి 75సంవత్సరాల అయినప్పటికీ మన దేశం వెనుకబాటుతనాన్ని అధిగమించలేకపోతోంది. ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులను కూడా ఈ తరం నాయకులు కాలరాస్తున్నారు. ''నోటితో నవ్వి నొసలుతో వెక్కిరించినట్టు'' ఒకవైపు ఉచిత పథకాలు ఇస్తూ, మరోవైపు పన్నుల పేరుతో వసూలు చేయటం ఈ ''ప్రజాసంక్షేమం''లో నిత్యకృత్యం. ప్రశ్నించిన గొంతుకలను ప్రతిపక్షం కింద జమకట్టి, బూతు మాటలు మాట్లాడే వారికి కొదవేలేదు. ఎంతసేపటికీ అధికారాన్ని నిలుపుకోవడానికి ఆరాటపడుతున్నారేగానీ, ప్రజల అవసరాలను గుర్తించలేకపోతున్నారు.
''కోతి-తాబేలు'' కథ ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ సంక్షేమపథకాలలో కొన్ని వన్నె తెచ్చేవి ఉండక పోలేదు. మరికొన్ని రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయే విధంగానూ లేకపోలేదు. ఏది ఏమైనా ఎక్కువభాగం తమ తమ ఓటు బ్యాంకులను ''రిజర్వు బ్యాంకు ఖాతాలా'' కాపాడుకోవడానికి ఉద్దేశించినవే..! ప్రతి ప్రభుత్వం ముఖ్యమైన అభివృద్ధి సూచికలు పెంచే ఉచిత పథకాలు అమలు చేయాలి. రాష్ట్రాల్లో విద్య ఆరోగ్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే పథకాలను అమలుచేయాలి. ప్రజలను ఉచిత పథకాల వైపుగా కాకుండా, ఉపాధి అవకాశాల వైపు నడిపించాలి. కుల వృత్తులలో ఆధునికతను అందిపుచ్చుకునేలా అవకాశాలు విస్తృతం చేయగలగాలి. ఈ లక్ష్యంలేని పథకాలు రాజకీయుల అవసరాలు తీరుస్తాయేమోగాని, ప్రజల అవసరాలు తీర్చలేవు.
అనుచిత పథకాలను కట్టడీ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కో, సుప్రీం కోర్టుకో ఉండాలి. ఈ రెంటికీ లేకపోతే ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది....!? అప్పుల పుట్టే పరిస్థితులు అడుగంటి పోతే సంక్షేమ పథకాల, ఉచిత పథకాల అమలు మాటేంటి..? ఎన్ని పథకాలు రూపొందించినప్పటికీ ఆ పథకాలకు సమకూర్చే పైకము ప్రజలది అన్న విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. ప్రజలందరికీ సమన్యాయం జరిగే ప్రజాయోగ్యమైన పథకాలు, ఉపాధి అవకాశాలు విరివిగా రావాలి. విద్య, ఆరోగ్యం, న్యాయం ఈ మూడింటిని ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలి. అప్పుడు ఉపాధి రంగంలో, ఉత్పత్తి వనరులు పెరిగి, విప్లవాత్మకమైన మార్పులు జరిగి, రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు, దేశ ఆర్థిక పరిస్థితి ఎన్నో రెట్లు మెరుగుపడుతుంది. ఈ విధంగా చేయటం వల్ల సమస్త ప్రజానీకం నిరాశ నిస్పృహల నుంచి అభివృద్ధి బాటలో ప్రయాణిస్తారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలుగా కీర్తించి, చరిత్రలో నిలుపుతారు.
దేశానికి ఆర్థిక బలం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి మాత్రమే ఆదాయం మెండుగ వస్తున్నది. ఈ ఆదాయంతోనే ఉత్తరాది రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం చేపడుతున్నది. ఇప్పుడు అక్కడ స్థాయికి మించి, అనేకమైన అనుచిత పథకాలను, సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేయటం వల్ల, ప్రజలపై పన్నుల భారంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఏది ఏమైనా అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, ఉపాధి ఆలోచన చేసి, అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేసి, ఆచరించాలి. అంతేగాని అవసరానికి మించిన ఉచిత పథకాలు ఇచ్చి, నిలుపుకోలేక వారు బాధ పడి, ప్రజలను వేదనలకు గురి చేయొద్దు. ప్రజలను సోమరి పోతుల్లామార్చి, బిచ్చగాళ్ళ చేసి, ఆ ఆర్థిక భారాన్ని తిరిగి వాళ్ళ నెత్తిన వేసి పరిపాలించడం, సంక్షేమపాలన కాదు... అవసరాలను గుర్తించి, ఆసరాగా నిలిచి, ఆపదలను తొలగించే ఉచిత పథకాలను ప్రజలకు అందించాలి. అవసరం ఉన్న ప్రజలకే ఉచిత పథకాలను అందించాలి. అప్పుడే ప్రభుత్వాలు ప్రజల ఆశీస్సులు పొందుతాయి.
- దరిపెల్లి స్వరూప
సెల్: 9912965549