Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎదురుగా రెపరెపలాడుతున్న జాతీయ పతాకం. మంద్రంగా వినిపిస్తున్న జాతీయ గీతం. తమ జాతి మొత్తం దేశభక్తితో పులకిస్తుండగా ఉప్పొంగుతున్న గుండెలతో పోడియంపై నిల్చుని పతాకం అందుకోవడం ప్రతి అంతర్జాతీయ క్రీడాకారుడు కనే కల అది. ప్రతి దేశం వాస్తవ రూపం దాల్చాలని కోరుకునే సన్నివేశం అది. కానీ రష్యా దానికి దూరం కానుంది. 2018లో దక్షిణ కొరియాలో జరుగనున్న శీతాకాల ఒలంపిక్స్ నుంచి రష్యాను అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (ఐవోసీ) బహిష్కరించింది. రష్యా ప్రభుత్వమే క్రీడాకారుల్లో క్రమపద్ధతిలో డోపింగ్ (నిషేధిత డ్రగ్స్ వాడకం)ను ప్రోత్సహించిందని ఐవోసీ ఆరోపించింది. ఒలంపిక్ గేమ్స్కు రష్యా ప్రతినిధుల్ని హాజరు కానివ్వబోమని, ప్రారంభ కార్యక్రమంలో రష్యా జాతీయ జెండా ఏర్పాటు చేయబోమని క్రీడాకారులు రష్యా పేరు మీద కానీ, రష్యా యూనిఫామ్తో కానీ పాల్గొనకూడదని ఆంక్షలు విధించినట్టు ఐవోసీ అధ్యక్షులు థామస్ బాచ్ ప్రకటించారు. క్రీడాకారులు వ్యక్తిగతంగా ఒలంపిక్స్లో పాల్గొనవచ్చనీ, వారు పతకాలు గెలిస్తే ఒలంపిక్ జెండా ఎగురవేస్తామనీ, ఒలంపిక్ గీతాన్ని మాత్రమే ఆలపిస్తామనీ తెలిపారు. 2014లో రష్యాలోని సోచిలో జరిగిన శీతాకాల ఒలంపిక్లో రష్యా క్రీడా మంత్రిత్వశాఖ, రష్యన్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలు ప్రయత్నపూర్వకంగా డోపింగ్ను ప్రోత్సహించాయని ఐవోసీ విమర్శించింది. దీనిపై కెనడాకు చెందిన రిచర్డ్ మెక్ లారెన్ను దర్యాప్తు అధికారిగా నియమించింది. ఈ కమిటీ రెండు దఫాలుగా నివేదికలు సమర్పించింది. ఈ నివేదిక వేసవి, శీతాకాల, పారా ఒలంపిక్స్లో పాల్గొన్న వెయ్యి మందికి పైగా రష్యా అథ్లెట్ల సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్ వాడినట్టు నిర్థారించింది. నివేదికపై చర్చించిన ఐవోసీ కార్యవర్గం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ధారణకు మూలమైన ఆధారాల్సి మాత్రం ఐవోసీ వెల్లడించలేదు. సోచీ ఒలంపిక్స్లో ఆరుగులు ఆటగాళ్ల డోపింగ్ టెస్ట్ నమూనాలు పాజిటీవ్గా రాగా వారిలో ఒకరు కూడా రష్యన్ లేకపోవడం గమనార్హం. అయితే ఇది దురుద్దేశ్యపూర్వక కుట్రని, ఇతర దేశాలకు లేని విధంగా రష్యన్ అథ్లెట్లకు మాత్రమే పదేపదే వందల సంఖ్యలో డోపింగ్ టెస్టులు నిర్వహించడం, రిపోర్టులను బహిర్గతం చేయకపోవడం వెనుక సామ్రాజ్య వాద అమెరికా రాజకీయ నాయకులు, మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులు, అమెరికా కార్పొరేట్ స్పాన్సర్లు ఉన్నట్టు క్రీడా పండితులు భావిస్తున్నారు. ఒక కోణంలో రష్యా అడ్డు లేకపోతే అమెరికాకు పతకాల పట్టికలో ఎదురుండదని, తద్వార తమ వాణిజ్య ప్రయోజనాలు నెరవేరుతాయని అమెరికా కార్పొరేట్ సంస్థల భావనగా అంచనా వేస్తున్నారు. ఒలంపిక్స్ గ్లోబల్లో ఉన్న 12 సంస్థల్లో కోకాకోలా, డోవ్, జీఈ, బ్రిడ్జ్స్టోన్, ఇరిటెల్, మెక్డోనాల్డ్ తదితర అమెరికా సంస్థలే ఉండటం ఈ వాదనను బలపరుస్తున్నాయి. మరో కోణంలో ఉక్రెయిన్, క్రొయేషియా, ఉత్తర కొరియా వివాదాల్లో అమెరికాకు రష్యా అడ్డు పడటం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయంగా రష్యా ప్రతిష్ట దిగజార్చడం కోసం ఈ తతంగం జరిపినట్టు విశ్లేషిస్తున్నారు. రష్యన్ డోపింగ్ ఏజెన్సీలో పని చేసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రోడ్ చెన్ కోవ్అనే అధికారిని పావుగా వాడుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా మొత్తం ఒలంపిక్స్ చరిత్రను పరిశీలిస్తే ఐవోసీ రాజకీయాలకతీతంగా, స్వతంత్య్రంగా పని చేయకపోవడం వల్ల ఒలంపిక్స్ స్ఫూర్తి అడుగంటుతున్నదని అంచనా వేయవచ్చు. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య తర్వాత అత్యంత అవినీతి మకిలి అంటిన సంస్థగా ఐవోసీ, సామ్రాజ్యవాదానికి సాగిలపడే తన ధోరణిని కొనసాగిస్తున్నది. 1936 ఒలంపిక్స్ బెర్లిన్లో జరపాలని నిర్ణయించగా నాజీ హిట్లర్ యూదుల పట్ల వివక్ష చూపుతున్నారనే నెపంతో ఆ ఒలంపిక్స్ను బహిష్కరించాలని అమెరికా, స్విట్జర్లాండ్ తదితర దేశాలు ప్రయత్నించాయి. ఐవోసీ నిర్ణయం సరైనదేనని ఆధునిక ఒలంపిక్స్ పితామహుడు డి కోబర్టిన్ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని అమెరికా పత్రికలు తీవ్రంగా ఆక్షేపించాయి. ''ఒలంపిక్ గేమ్స్ ఆటగాళ్లకు సంబంధించినవే తప్ప రాజకీయ నాయకులవి కాదు'' అని ఆనాటి అమెరికా ఒలంపిక్ అధ్యక్షుడు అవెరి బ్రాండెజ్ ప్రకటించడం గమనార్హం. జాతి వివక్షను ప్రదర్శిస్తున్న దక్షిణాఫ్రికాను 1960 ఒలంపిక్స్ నుంచి బహిష్కరించాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినా ఐవోసీ స్పందించలేదు. ఒత్తిడి తీవ్రం కావడంతో 1964 ఒలంపిక్స్ నుంచి బహిష్కరించారు. శ్వేతజాతి మైనారిటీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని రొడీషియా (జింబాంబ్వే)ను మ్యూనిచ్ ఒలంపిక్స్ నుంచి బహిష్కరించాలని, లేనిపక్షంలో తామే బారుకాట్ చేస్తామనీ ఆఫ్రిక దేశాలు డిమాండ్ చేశాయి. చివరివరకూ స్పందించని ఐవోసీ ఒలంపిక్స్ ప్రారంభానికి 4 రోజుల ముందు 31/36 మంది సభ్యుల మెజారిటీతో రొడీషియాను ఒలంపిక్స్ నుంచి బహిష్కరించాయి. 1976లో మాంట్రియేల్ ఒలంపిక్స్ నాటికే బహిష్కరణలో ఉన్న దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ క్రీడా సంబంధాలు కొనసాగిస్తుండటంతో ఒలంపిక్స్ నుంచి న్యూజిలాండ్ను బహిష్కరించాలని ఆఫ్రికన్ దేశాలు డిమాండ్ చేశాయి. ఒలంపిక్స్ ప్రారంభానికి కూడా ఐవోసీ అంగీకరించకపోవడంతో 21 ఆఫ్రికన్ దేశాలు ఆ ఒలంపిక్స్ను బారుకాట్ చేశాయి. రష్యా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిందనే నెపంతో 1980 మాస్కో ఒలంపిక్స్ను అమెరికా తదితర దేశాలు బహిష్కరించాయి. ప్రతిగా క్రీడాకారుల భద్రత కారణాల పేరుతో 1984 లాస్ ఏంజెల్స్ ఒలంపిక్స్ను అమెరికా తదితర 14 దేశాలు బహిష్కరించాయి. 1988 ఒలంపిక్స్ దక్షిణ కొరియా సియోల్లో జరుగుతుండటంతో ఉత్తర కొరియా బహిష్కరించింది. మొత్తం మీద ఒలంపిక్స్ స్ఫూర్తి అంతర్జాతీయ సమైక్యత స్థానంలో జాతీయవాదం తీవ్రమైంది. వివిధ దేశాలు తమ రాజకీయ ఆధిపత్య నిరూపణకు వేదికగా ఒలంపిక్స్ను పరిగణిస్తున్నాయనేది తేటతెల్లమవుతున్నది.
మరోవైపు ఒలంపిక్స్పై మార్కెట్ శక్తుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. క్రమంగా కార్పొరేట్ సంస్థల ఒత్తిడితో ప్రొఫెషనల్ క్రీడాకారులు ఒలంపిక్స్లోకి ప్రవేశించారు. ప్రేక్షకాదరణ, టీవీ రేటింగ్లు, స్పాన్సర్ల పేరుతో క్రీడలు వ్యాపారీకరించబడ్డాయి. ఒలంపిక్స్ మనీ మేకింగ్ స్కాంగా మారింది. క్రీడా వేదికల నిర్ణయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. 2016 రియో ఒలంపిక్స్ను 300 దేశాల్లో 3.9 బిలియన్ల మంది వీక్షించారు. 584 టీవీ చానెళ్లు, 270 పైబడి డిజిటల్ వేదికలు కలిసి 5 లక్షల గంటలపాటు ఒలంపిక్ క్రీడల్ని ప్రసారం చేశాయి. ఐవోసీకి వచ్చిన ఆదాయం 5.6బిలియన్ డాలర్లు. గత 30 సంవత్సరాల్లో ఐవోసీకి ఒలంపిక్ గ్లోబల్ భాగస్వాముల నుంచి వచ్చిన ఆదాయం 96 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రసార హక్కుల ఆదాయం 1.2 మిలియన్ డాలర్ల నుంచి 4.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. తాజాగా 2017-20 కాలానికి ఒలంపిక్స్ గ్లోబల్ భాగస్వాముల పన్నెండులో ఒకటిగా పానాసోనిక్ సంస్థ ఐవోసీకి 350 మిలియన్ డాలర్లు చెల్లించిందంటేనే ఈ క్రీడలెంత వ్యాపారమయమైనవో ఊహించవచ్చు. వ్యాపారమయమైన క్రీడలు సహజంగా గెలుపునే కోరకుంటాయి. అపసవ్య మార్గాల్ని అనుసరించైనా గెలవాలన్న దృక్పథం వల్లే క్రీడాకారుల సామర్థ్యం పెంచడానికి నిషేధిత డ్రగ్స్ వాడకం పెరుగుతూ వస్తున్నది. అనేక అంతర్జాయ క్రీడల సందర్భంగా జరుపుతున్న డోపింగ్ పరీక్షలు ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. దీంతో జయాపజయాలకు అతీతంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం వట్టి మాటలుగా మిగులుతున్నాయి. అందుకే ఒలంపిక్స్ను రాజకీయాలకు, మార్కెట్ శక్తులకూ అతీతంగా నిర్వహించేలా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. క్రీడల్లో గెలుపు కోసం అక్రమ పద్ధతుల్ని అవలంభించే విధానాల్ని అడ్డుకోవాలి. దీనికోసం పాఠశాలలు, కళాశాలలు, కిందిస్థాయి నుంచే క్రీడా స్ఫూర్తి పెంపొందేలా క్రీడలు నిర్వహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
- ఆర్.విక్రమ్రెడ్డి