Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను మొదటిసారిగా మానికొండ సుబ్బారావు గారిని 1973లో ఎన్.వి.భాస్కర్రావు గారి ఇంటివద్ద కలిశాను. వారి పెద్దమ్మాయి విజయవాణితో నా వివాహం గురించి మాట్లాడే సందర్భంలో ఈసమావేశం జరిగింది. నాగార్జుననగర్ కాలనీలో భాస్కర్రావుగారి ఇంటి ఎదురుగా ఉండే యలమంచిలి లక్ష్మయ్య గారి సతీమణి తాయారుగారు నా గురించి సుబ్బారావు, సూర్యావతిగార్లకు తెలియజేశారు. తాయారుగారు అభ్యుదయ రచయిత్రి, సీపీఐ అభిమాని. అప్పుడు నేను నక్సలైటు పార్టీకి గట్టి అభిమానిగా ఉన్నాను. నా తల్లితండ్రులు, పెదనాన్నలంతా వరంగల్ జిల్లాలో మార్క్సిస్టు పార్టీకి గట్టి అభిమానులు. మా ఇల్లు మార్క్సిస్టుపార్టీకి రాజకీయకేంద్రంగా ఉండేది.
మానికొండ దంపతుల గురించి మా కుటుంబంలోనూ, మా ఊరిలోని పార్టీ అభిమానులూ గొప్పగా మాట్లాడుకోవటం వింటూ ఉండేవాడిని కానీ వారినెప్పుడూ చూడలేదు. మొదటిసారి సుబ్బారావుగారిని కలిసినప్పుడు ఆయన చిరునవ్వుతో మాట్లాడే పద్ధతి నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ సందర్భంలో ఆయనతో మాట్లాడిన రెండు గంటలలో గంటపాటు నా రాజకీయ అభిప్రాయాలను చెప్పటం జరిగింది. ఆ మొత్తం సమయంలో అంతపెద్ద నాయకుడు మధ్యలో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. సావధానంగా చిరునవ్వుతో విన్నారు. ఆ తర్వాత ఒక అర్ధగంటసేపు ఆయన నక్సలైట్ ఆలోచనా విధానం ఏవిధంగా తప్పో వివరిస్తూ మాట్లాడారు. చివరగా ఆయన అన్న మాట నీకు రాజకీయ కమిట్మెంట్ ఎక్కువగా ఉంది. కానీ మా అమ్మాయికి అంత అవగాహన లేదు. పార్టీమీద అభిమానం వుంది. మీరు ఇద్దరూ మాట్లాడుకోండి. ఇద్దరూ ఇష్టపడితే నాకు అభ్యంతరంలేదు అన్నారు. సుబ్బారావుగారు పెండ్లి విషయం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఆస్తిపాస్తుల వివరాలు ఏవీ అడగలేదు. నా రాజకీయ అభిప్రాయాలు తెలుసుకొని అవి ఎలా తప్పో వివరించారు.
ఆతర్వాత 26 డిసెంబర్ 1973న నాగార్జుననగర్లో కడియాల గోపాలరావుగారి ఇంటిలో సూర్యావతిగారిని మొదటిసారిగా చూశాను. వాణితో మాట్లాడిన తర్వాత మేమిద్దరం పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. 1974 మార్చి 17న కడియాల గోపాలరావుగారి ఇంటిలో 50 మంది బంధుమిత్రులు, రిజిష్ట్రారు సమక్షంలో నిరాడంబరంగా ఉద్దరాజు రామంగారు మా వివాహం జరిపించారు. అతిధులను గోపాలరావుగారు కాలనీలోవున్న పెద్దలను మాత్రమే పిలిచారు. సుబ్బారావుగారి సూచనమేరకు నేను కూడా పదిమంది బంధుమిత్రులను మాత్రమే పిలిచాను. ఆతర్వాత మాఇంటికి వెళ్లి భోజనం చేసి సుబ్బారావుగారు, సూర్యావతిగారు, వాణిలతో కలసి విజయవాడ వెళ్లాం. అప్పుడే ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. మోటూరు ఉదయంగారు వచ్చి సూర్యావతిగారు ఖమ్మం వెళ్లవలసి వుందని కొత్త అల్లుడిని ఇంటికి తీసుకొచ్చి వెళ్లిపోతే ఎట్లాగా అని మదనపడుతున్నదని చెప్పారు. నాకు ఏవిధమైన ఇబ్బంది లేదనీ ఆమెను మహాసభలకు వెళ్లమని చెప్పాను. ఆతర్వాతి రోజు వాణి, నేను వరంగల్ వెళ్లటానికి ఉదయం ఆరు గంటలకు బయలుదేరాము. సుబ్బారావుగారు సైకిల్ వేసుకుని స్టేషన్కి వచ్చారు. రైలు కదలటానికి 20 నిమిషాలు సమయముంది. ఆసమయంలో మాట్లాడింది చైనా విప్లవంలో ఎత్తుగడల గురించే. అదంతా నా ఆలోచనలు మార్చే ప్రయత్నమే. ఈ సంబంధం కుదిరిన విషయం తెలిసి కొండపల్లి సీతారామయ్యగారు అభినందిస్తూ కబురు పంపారు. రెండునెలల తర్వాత సుబ్బారావుగారి పినతల్లి చనిపోయిన సందర్భంగా కాసరనేనివారిలంకలో మళ్లీ సుబ్బారావుగారిని కలిశాను. ఆయన నన్ను వేరే బంధువుల ఇంటికి తీసుకువెళ్లి ఒకగంటసేపు విప్లవ ఎత్తుగడలు, పరిస్థితులను అంచనావెయ్యటం వంటి విషయాలు చర్చించారు.
దసరా పండుగకు మేము విజయవాడ వెళ్లాము. అప్పుడు రెండురోజులు ఆయనతో కలసివున్నాం. అదే ఆయనను ఆఖరిసారి చూడటం. ఆయన సైకి ల్పై తిరగటం, ముఖంలో చిరునవ్వు, కార్యకర్తలతో మాట్లాడే విధానం, ఎదు టివాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపైనా ఓపికగా విని ఆ తర్వాత ఆయన అభిప్రాయం చెప్పటం నన్నెంతో ఆకర్షించాయి. ముఖ్యంగా సూర్యావతిగారిని ప్రోత్సహించి మంచి గుర్తింపున్న నాయకురాలిగా చేయటం ఆయన ఔనత్యాని కి నిదర్శనం. నాకు ఆయన ఇచ్చిన సలహా వ్యాపారం గురించి ఆలోచన వద్దనీ, నాకున్న కమిట్మెంట్తో పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తే బాగుంటుందనీ, వీలుకాకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తూ పార్టీకి సేవచేయమనీ వ్యాపారంచేస్తూ పనిచేయటం సాధ్యంకాదని చెప్పారు. అప్పటికే సంవత్సరంపాటు పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాను. కేవలం సంవత్సర కాలంలో అందులోనూ అతికొద్ది సమయం మాత్రమే సాన్నిహిత్యం కలిగిన నాకు జీవితమంతా ఆరాధ్యుడే.
- చెన్నుపాటి చంద్రశేఖరరావు
సెల్ : 7382619025