Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మద్యపానం, ధూమపానం అనేవి భారతజాతి సంక్షేమాన్ని, సౌభాగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్న వ్యసనాలు. కాగా అందులో మొదటిది పిశాషైతే, రెండవది దెయ్యమని మహాత్మ గాంధీ ఎప్పుడో సెలవిచ్చారు. సిగరేట్, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా, చుట్టా, బీడి, జర్దా ఇలా ఎన్నో మరెన్నో రకాలు. నాణ్యతను బట్టి కొన్ని, రుచిని బట్టి కొన్ని, పరిమాణాన్ని బట్టి కొన్ని, ఇలా ఎన్ని ఉన్నా చివరికి వాటి ముడి పదార్థం మాత్రం పొగాకు. వీటిని వినియోగించే వారికి మాత్రమే గాకుండా, వారి పక్కనున్న వారికీ హాని కల్గించే శక్తి కలిగిన పొగాకును ఎవరైనా ఒక్కసారి రుచి చూశారా? అంతే వారు వాటి బారిన పడాల్సిందే. అంత సులభంగా వదులుకునే ప్రసక్తే ఉండదు. ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే ఒక సిగరేట్ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. మెకానిక్స్ డ్రైవర్లల్లో ఎక్కువ శాతం గుట్కా, ఖైనీ, సిగరేట్ అలవాటు ఉన్నవారే ఉంటారు. రైతు, కూలీ కుటుంబాలలో బీడి, చుట్టా, జర్దా, ఖైనీ అంటూ పొగాకు అలవాటున్నవారే అనేకం. మానసిక వ్యధతో బాధపడేవారు, ప్రశాంతతకై కొందరు, ఫ్యాషన్ కని కొందరు దీని బారిన పడుతుంటారు. ప్రత్యేకంగా రాత్రి సమయాలలో పనిచేసేవారు నిద్ర రాకుండా ఉండటానికి ఎక్కువశాతం పొగాకును వినియోగిస్తుంటారు. ఇలా విద్యార్థులు, విద్యావేత్తలు, మేస్త్రీలు, సుతారీలు, కార్మికులు, రైతులు, పేద, ధనిక, ఆడ, మగ, చిన్న, పెద్ద అని ఎలాంటి తారతమ్య బేధాలు లేకుండా వారి వారి స్తోమతను బట్టి వీటి బారినపడినవారే వుంటారు. పొగాకు ఏ రకంగా ఉపయోగించినా అది చేయాల్సిన పనిని మాత్రం తప్పకుండా చేసి తీరుతుంది. విశ్వ వ్యాప్తంగా ఏటా మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాల కన్నా, మాదక ద్రవ్యాల వాడకం వల్ల అర్ధాయుష్కులవుతున్న అభాగ్యుల సంఖ్యే అధికమని, 2030 నాటికీ పొగాకు సంబంధిత మరణాలు అత్యధికంగా ఇండియాలో నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం సగటు భారతీయుడిని కలవపరిచే విషయం. చైనా తర్వాత ధూమకేతులు అత్యధికంగా ఉన్న దేశం భారత్ కాగా, దాదాపు 57 శాతం పురుషులు, 11 శాతం మహిళలు ఏదో విధంగా పొగాకు సేవిస్తున్నట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి. భారతదేశంలో 12 కోట్ల మందికి పైగా ధూమకేతులుండగా, మరో 18.5 కోట్ల మంది పొగాకు ఉత్పత్తుల వినియోగదారులున్నారు.
దేశంలో 90 శాతం నోటి క్యాన్సర్లకు కారణం గుట్కా అని వైద్యులు చెబుతున్నారు. 1910-2010 శతాబ్ద కాలంలో 10 కోట్ల మంది పొగ రాక్షసి బారినపడి అర్ధ జీవితానికే పరిమితమైనట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దంలో 20 కోట్ల మంది మత్యువాత పడటానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకు ఉత్పాదనల్లో 400కు పైగా రసాయనాలు ఉంటాయని, వాటిలో రూ.200 ప్రమాదకరమైనవి కాగా, అందులో 20కి పైగా క్యాన్సర్ కారకాలున్నాయని పలు పరిశోధనలు శాస్త్రీయంగా నిరూపించాయి. పొగాకు ఉత్పత్తుల్ని నమిలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వలన క్షయ, శ్వాసకోశ వ్యాధులు, స్వైన్ ఫ్లూ వంటి విభిన్న ప్రమాదకర రోగాలు వ్యాపిస్తున్నాయని, ఒక క్షయ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం మనదేశంలో రెండు లక్షల మంది మరణిస్తున్నారని కేంద్రమే చెబుతుంది. పొగాకు వినియోగం ప్రాణాంతకమని ప్రచారోద్యమాలు సాగుతున్న పొగాకు ఉత్పతుల వినియోగంతో ఏటా ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల మంది, మన దేశంలో 10 లక్షల మంది, ప్రతిరోజు 2300 మందికి పైగా విగజీవులవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రోజురోజుకి పొగాకు విక్రయాలు పెరిగి వినియోగదారులు ఎక్కువై 2020 నాటికి దేశంలో ఏటా కోటి మంది ప్రాణాలు గాలిలో కలుస్తాయని ప్రజా ఆరోగ్య ఫౌండేషన్ సాగించిన అధ్యయనం సగటు మానవున్ని కలవర పెడుతుంది.
ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలంటే పొగాకు వినియోగాన్ని నియంత్రించేలా ప్రతక్ష కార్యాచరణ ఉండి తీరాలని ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు నిర్ణయించాయి.
సిగరేట్ ప్యాకెట్ల మీద హెచ్చరికల ముద్రణ విషయంలో మనదేశం 136వ స్థానంలో ఉంది. కాబట్టి నిర్దేశిత లక్షాన్ని సాధించలేకపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సదస్సులో ఓ నివేదిక ఎలుగెత్తి చాటింది. అయితే సిగరేట్ పెట్టలపై ప్రస్తుతమున్న 40 శాతం సచిత్ర హెచ్చరికల్ని 85 శాతం వరకు కేటాయించాలంటూ కేంద్రం 2014 అక్టోబర్లోనే రాజపుత్ర గెజిట్ ప్రకటన జారీచేసి ఏప్రిల్ 1, 2015న అమలులోకి రావాల్సినది పార్లమెంట్ కమిటీతో ఆటకెక్కింది. దేశంలో 62 లక్షల మంది పొగాకు రైతులు, ఆ ఉత్పత్తులు, విక్రయాలపై ఆధారపడిన 6.4 కోట్ల మంది కార్మికులు, కూలీలు, చిన్న తరహా వ్యాపారుల ఉపాధి ప్రయోజనాల్ని దష్టిలో ఉంచుకోవాలని కమిటీ ప్రస్తావన. ఒక రకంగా పేదలకు ( తయారీ రంగానికి ) మేలు జరిగినప్పటికీ తీసుకునే నిర్ణయాలు అందరికీ, ఆమోదయోగ్యాంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 2006 సంవత్సరంలో ఒకసారి సుప్రీం కోర్టు యువతరం మత్తుపానీయాలకు బానిస అవుతుందని వ్యాఖ్యానిస్తూ 'రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకునేది' అంటూ అప్పటి ప్రభుత్వానికి చురక వేసింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పొగాకు రైతుల్ని ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించడం కోసం 5000 కోట్లతో కార్యక్రమం ప్రకటించింది. కానీ ఎన్నో పథకాల మాదిరిగానే అది తెల్లారిపోయింది.
జరిమానా విధించే అధికారం :
బహిరంగ ప్రదేశాలల్లో ధూమపానం చేస్తే జరిమాన విధించే అధికారాన్ని పోలీసు శాఖలోని ఎస్సైలకు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులకు, గ్రామ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, జాతీయ రూరల్ హెల్త్ మిషన్ ఫైనాన్స్ మేనేజర్లకు, ప్రభుత్వ వైద్యాధికారుల పరిధిలో ఉంటుంది. అలాగే న్యాయవాదులు, రిజిస్టార్లు, డిప్యూటీ రిజిస్టార్లు, కోర్టు భవనాల్లో ఆ బాధ్యత తీసుకోవచ్చు. పాఠశాలలో నిబంధలను డీఈవో అమలు చేయాలి. ట్రాఫిక్ సూపరిండెంట్లు, బస్స్టేషన్ అధికారులు, టికెట్ కలెక్టర్లు, కండక్టర్లు రవాణా వాహనాల్లో జరిమాన విధించే అధికారాన్ని కలిగి వుంటారు .
ముగింపు : చైనా, థాయిలాండ్ లాంటి దేశాలలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నేరారోపణలు రుజువైతే మరణ శిక్షలు విధించే చట్టాలు అమలులో వున్నాయి. ఫిలిప్పీన్, మలేసియా, ఇండోనేషియా లాంటి చోట్ల కఠిన శిక్షలతో మాదక ద్రవ్యాలను నియంత్రిస్తున్నారు. మనదేశంలోని నేటి పరిస్థితి చట్టాలు చేయడానికి, కమిటీలు, చర్చలు, విశ్లేషణాలంటూ కాలయాపన చేసి, చట్టాలు చేసినా అమలులో అనుకున్నంత మేర ఫలితాలకు నోచుకోవడం లేదు. అధికారిక అంచనాల ప్రకారం దేశంలో డ్రగ్స్ బానిసలు 34 లక్షలు, ఒక పంజాబ్లో 70 శాతానికి పైగా యువత డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు అక్కడి మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నత న్యాయస్థానానికి నివేధించింది. ఇదిలా ఉండగా దేశంలో డ్రగ్స్ పునరావాస కేంద్రాలు మాత్రం కేవలం 400కే పరిమితం. దీనిని బట్టి ఏండ్ల తరబడి మన పాలకులు తీసుకునే నిర్ణయాలు, అమలుపరిచే విధానాలు ఏ మేరలో ఉన్నాయో తెలియకనే తెలుస్తుంది.
రోజురోజుకు పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలను వివిధ అధ్యాయనాల గణాంకాలు ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి. నేటి యువత వీటిని చూసైనా మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలి. వీటి బారినపడి మత్యువు ఒడిలోకి చేరుకొని తనను నమ్ముకున్న కుటుంబాన్ని బజారుపాలు చేయకుండా, వీటి పర్యావసానాలపై పునరాలోచించి సరైనా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. పొగాకును
నిరోధించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
డా||పోలం సైదులు
సెల్ : 9441930361