Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాంరాజ్యం భారతదేశంలో విలీనంతరం ఆధునిక విద్య లోపంవల్ల పరిపాలనాలో అనేక సమస్యలు ఉత్పన్నం కావడంచేత, అందు బాటులో ఉన్నా విద్యా సౌకర్యాలతో ఆశించిన పరిపాలన నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చడానికి, గ్రామీణ ప్రాంతంలోని మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికితీయడానికి ఏర్పాటుచేసినవే నేడు మనం చూస్తున్న గురుకులాలు.
పీవీ నరసింహారావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవం పోసుకున్న ఈవిధానం ఆయనే ముఖ్యామంత్రిగా 1971 నవంబర్ 23న నల్లగొండజిల్లా సర్వేల్లో తొలి గురుకుల పాఠశాల ప్రారంభించాడు. ఆనాడు అక్షరాస్యతరేటు 20.71శాతం మాత్రమే. తర్వాత 1973లో రాయలసీమవారికి అనంతపురంజిల్లా కొడిగెనహెల్లీలో, ఆంధ్రావారికి గుంటూరు జిల్లా తాడిపత్రిలో ప్రాంతానికొక గురుకుల పాఠశాల ప్రారంభించారు. పరిపాలనలో గిరిజనుల ప్రాతినిధ్యం కోసం ఖమ్మంజిల్లా కిన్నెరసాని డ్యామ్ సైట్ నందు 1976లో మొదటి గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభమైంది. రంగారెడ్డిజిల్లా వికారాబాద్లో 1978లో తొలిబాలికల గురుకుల పాఠశాల ఏర్పాటుచేశారు.
1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత షెడ్యూల్డ్ కులాలవారి విద్య అభివృద్ధి కోసం ప్రతి జిల్లాకు ఒకటి బాలురకు ఒకటి బాలికలకు 23 జిల్లాలకు 46 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. అపుడు అక్షరాస్యతరేటు 26.49శాతం. 1998లో గిరిజన విద్యాభివృద్ధికొరకు ప్రత్యేక గిరిజన గురుకులాల సొసైటీ ఏర్పాటుచేసి 2001 నుంచి పని ప్రారంభించారు. విద్యాశాఖ పరిధిలోఉన్న బీసీ గురుకులాలను వేరుచేసి 2012లో బీసీ గురుకులాల సొసైటీ ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2014లో విద్యాశాఖపరిధిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలను వేరుచేసి మైనారిటీ గురుకులాల సొసైటీని ప్రారంభించారు. అక్షరాస్యతరేటు 49.51శాతం. అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ, ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గురుకులాలను ఏర్పాటుచేశారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఆధునిక కాలంలో విద్యావిధానమనేది సమాజంలో గుణాత్మ కమైన మార్పునుతేవాలి! కానీ గురుకులాల్లో కులాత్మకమైన మార్పైనా తెస్తుందా? అనేదే ప్రశ్న!
ఆధునీక విద్యావిధానం అంతిమ లక్ష్యం విద్యార్థి సమగ్ర మానసిక, సామజిక వికాసాభివృద్ధిని పెంపొందించేదై ఉండా లి. కానీ తెలంగాణ గురుకులాల్లో విద్యార్థిని తన కులానికే పరిమితం చేయడమేమిటి? ఒక గిరిజన విద్యార్థి 11ఏండ్ల వయసులో 5వ తరగతిలో గురుకుల పాఠశాలలో చేరితే 22 ఏండ్ల వరకు అనగా డిగ్రీ వరకు గురుకులాల్లో చదివే అవకాశాలు కల్పించబడినవి. సౌకర్యాల గురించి కాదుకానీ, ఈ ''కుల'' గురుకుల వ్యవస్థ ఎంతవరకు విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడుతుందనేదే పెద్ద ప్రశ్న? ఇక్కడ విద్యార్థి ఉద్రిక్తతలు, అలజడి, ఒత్తిడి, సందిగ్థత సంభవించే కౌమార దశ అనగా టీనేజ్ అతి ముఖ్యమైనదని విద్యావేత్తలు మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన వాస్తవం. ఈ దశలో విద్యార్థి శారీరక మానసిక ఎదుగుదల క్రమంతో, విద్యార్థి విచక్షణాజ్ఞానం పొంది, విద్యార్థి భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. 11ఏండ్ల వయసు నుంచి 22ఏండ్ల వయసు వరకు అనగా 11ఏండ్ల కాలంలో ఒక గిరిజన విద్యార్థి తన ''కులం'' గిరిజన విద్యార్థుల తోనే గడపడంవల్ల సామాజిక వైవిధ్యాలను ఎలా అర్థం చేసుకోగలడు? సామాజిక సవాళ్లను ఎలా ఎదుర్కోగలడు? సమాజంలో ఇతర విద్యార్థులతో పోటీపడే అవకాశం, ఇతరుల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం కోల్పోయి తన ''కులం'' వారే తనకు పోటీ అని గిరిగీసిన రిజర్వేషన్ పరిధి దాటలేని పరిస్థితి కల్పించబడి, విద్యార్థి మానసిక, సమగ్ర, గుణాత్మకమైన పెరుగుదల సన్నగిల్లబడుతుంది.
విద్యార్థి మానసిక వికాసాభివృద్ధిలో కుటుంబం, పాఠశాల, పరిసరాలు ప్రభావం చూపుతాయి. అనేక మంది శాస్త్రవేత్తలు విద్యార్థులలో టీచర్ బోధనవల్ల 25శాతం, అనువంశికతవల్ల 25శాతం, పరిసారాలప్రభావం స్వయంకృషితో 50 శాతం నైపుణ్యాల పెరుగుదల జరుగునని తమ పరిశోధనలతో రుజువుచేశారు. ఇప్పుడు దేశంలో అమలు చేయబడుతున్న ఆధునిక విద్యావిధానం ''నిరంతర సమగ్ర మూల్యాంకనం'' (సీసీఈ మెథడ్)లో ఉపాధ్యాయుడు ఒక ''ఫెసిలిటేటర్'' మాత్రమే! కానీ గురుకులాల్లో మాత్రం విద్యార్థి ఫలితాలకు టీచర్లను బాధ్యుల్నిచేసి దోషులుగా నిలబెట్టడం ఆటవిక పోకడలకు నిదర్శనం కదా? ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల తరహాలో విద్యాసంస్థల్లోని తరగతి గదిలోకి ఆయుధాలు ధరించిన వ్యక్తులు ప్రవేశించడమేమిటి? ఒక టీజీటీ టీచర్ తన బోధనకు సంబంధంలేని పదవ తరగతి ఇంటర్ క్లాసులు బోధింపచేయడమేమిటి? నెలకు అక్షరాలా లక్షాయాభైవేల వేతనం పొందే గణిత, భౌతికశాస్త్రాల ఉపాధ్యాయుల చేత బోధనకు సంబంధంలేని గుమాస్తాగిరీ పనులు ఏండ్ల తరబడి చేయించడమేమిటి? అనాగరిక నిబంధన రూల్ 28 బూచిగా చూపెట్టి ఫలితాలు తక్కువగా వచ్చాయని తొమ్మిది వార్షిక ఇంక్రిమెంట్లు కోత పెట్టడమేమిటి? గురువులపై నిందలుమోపి నేరగాళ్లుగా నిర్ధారించి శిక్షించడమేమిటి? పరిశీలించి ప్రశ్నించేతత్వాన్ని గురువులనుండే కదా విద్యార్థులు నేర్చుకునేది! కానీ ప్రశ్నించే గురువులను పగబట్టి, ప్రతీకారంతో పక్కనబెట్టి, వారి ప్రమోషన్లు కుంటిసాకులతో తొక్కిపెట్టడమేమిటి?
విద్యాసంస్థల్లో భజనపరులకు బహుమానాలు, ప్రశ్నించే వారికి పనిష్మెంట్లతో బానిస వ్యవస్థను, భజన తత్వాన్ని పెంపొందిస్తారా? బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యసిరి సంపదలను దోచుకోవడానికి, దండయాత్రకు ముందు కోవర్టును ప్రయోగించిన కాలకేయుడి విధంగా విద్యాసంస్థల్లో కోవర్టుల సంస్కృతిపెరగడంతో, ఉపాధ్యాయులలో నిరంతరం భయం, అభద్రతా, మానసిక ఒత్తిడి పెరిగి బోధనపట్ల నిర్లిప్తత ఏర్పడితే నష్టపోయేది ఎవరు? ఇక్కడ గురువులపై మోపే నిందలు, వేసే శిక్షలు బూటకపు ఎన్కౌంటర్లను తలపిస్తాయి! మధ్యయుగంలో యూరప్ దేశాలలో కోపర్నికస్, బ్రూనో, గెలీలియో లాంటివారిని నిజాలు మాట్లాడినందుకు మరణదండన విధించిన క్రెస్తవ మతాధికారుల శిక్షలను పోలి ఉండటమే ఒకవింత. బైబిల్లోని టెన్ కామాండ్మెంట్లను పోలిన టెన్ కామాండ్మెంట్లను ప్రభుత్వ గురుకులాల్లో అమలు చేయడమేమిటి? అసలు మతపరమైన ఉత్సవాలు గురుకులాల్లో నిర్వహించడమేమిటి? లౌకిక రాజ్యంలో శాస్త్రీయతను, సైంటిఫిక్ టెంపర్ పెంపొందించాల్సిన ప్రభుత్వ విద్యాసంస్థల్లో మతపరమైన ఉత్సవాలకు అవకాశం కల్పించడం దేనికిసంకేతం?
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్షమంది టీచర్ల బదిలీలు ఆధునిక సంకేతిక పరిజ్ఞానం ఆన్లైన్ విధానంలో ఎంతో పారదర్శకంగా జరగగా గురుకులాల్లో మాత్రం బూజుపట్టిన మాన్యువల్ విధానంతో చేయడమేమిటి? ఈ బదిలీల్లో కూడా బదిలీకి అర్హుడైన ఉద్యోగికి కోరుకున్న ప్లేస్ ఇవ్వకపోవడమేమిటి? ప్రభుత్వం రెండేండ్లు పూర్తి చేసుకున్న టీచర్లందరికి బదిలీ అవకాశం కల్పిస్తే కొన్ని గురుకులాల్లో నాలుగేండ్లు పూర్తిచేసుకున్నా బదిలీకి అనుమతించక పోవడమేమిటి? పారదర్శకత అనేది ఇక్కడ వెతికినా కనబడదు. ప్రభుత్వ నిబంధనలే అమలుచేయకపోతే ఇక గురుకుల ఉద్యోగులకు దిక్కెవరు? లామేకర్స్ లాబ్రేకర్స్ గామారితే వ్యవస్థను ఎవరు కాపాడాలి?
ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం మిగితా గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను విస్మరించడం శోచనీయం. గురుకులాల ఫలితాలను లోతుగా పరిశీలిస్తే టాప్టెన్ ర్యాంకుల్లో గురుకులాల విద్యార్థులకు చోటుండేది. కానీ ఇప్పుడు ఆ దరిదాపుల్లో కూడా ఉండడంలేదు. ఎంబీబీఎస్, ఐఐటీ సీట్లల్లో ఒక్క సీటు కూడా ఓపెన్ కేటగిరిలో రావడంలేదు. రిజర్వేషన్ కోటాకే పరిమితమవుతున్నారు. ఇంకా వెలుగు చూడని చీకటి కోణాలెన్నో గురుకులాల్లో వెక్కిరిస్తున్నాయి!
- మామిడి నారాయణ
సెల్: 9441066032