Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె ప్రథమ స్త్రీ వాద చరిత్రకారిణి
మహిళాభ్యుదయానికి తొలి విదుషీమణి
ఆడపిల్ల అబల కాదు సబల అని
వంటింటి కుందేలుగా బతకొద్దని
అంటరానితనాన్ని ఎదిరించి అక్షరాలను హత్తుకున్న అగ్గిపువ్వు
తెలంగాణ కళల కాణాచి. కథలు, కవితలు, పాటలు ఒక్కటేమిటి ఎన్నెన్నో సాహితీ పరిమళాలు విరబూసిన నేల. మహిళామణులూ ఈ తెలంగాణ మాగాణంలో సాహితీ సేధ్యం చేశారు. ఇక్కడి మట్టి పొరల్లో తమ కలంతో కవితలు పాటల విత్తనాలు జల్లి పుట్ల కొద్దీ సాహితీ సిరులను పండించి కుప్పగా పోశారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు, అధ్యులు భండారు అచ్చమాంబ.
తొలి తెలుగు కథా రచయిత్రి. మునగాల పరగాణాలోని వెంకటప్పయ్య- గంగమ్మల సంతానం. 1874వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో పుట్టింది. ఆమెకు ఆరేండ్ల వయసప్పడే తండ్రి చనిపోయాడు. పదవ యేటనే తన మేనమామ మాధవరావుతో పెండ్లి జరిగింది. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమె తోపాటు ఉండేవారు. తమ్ముడికి చదువు చెప్పించారు తప్ప అచ్చమాంబకు చదువు వద్దని అన్నారు. కానీ ఎంఏ చదివిన తమ్ముడే అక్కకు అక్షరాలు నేర్పాడు. బడికి వెళ్లకుండానే అచ్చమాంబ అక్షరాల ను అల్లుకుంది. తెలుగు, హిందీ నేర్చుకున్నది. ఇంగ్లీషు, గుజరాతీ భాషలలో కూడా ప్రవేశం సంపాదించింది.
మునగాల సంస్థానంలో అచ్చమాంబ తండ్రి దివానుగా పని చేశారు. ఇతరులకు సహాయపడటం అనేది తండ్రి నుండి అంది పుచ్చుకుంది. సాహిత్య, ప్రజా సేవలో ముఖ్యంగా మహిళల సేవలో గడుపాలనుకుంది. బాలురకన్నా బాలికలు ఎందులోనూ తక్కువ కాదన్నది అచ్చమాంబ మాట. కుటుంబం, సామాజం ప్రోత్సాహం లభిస్తే మహిళలు ఏ పనినైనా చేయగలరు, దేనినైనా సాధించగలరని అచ్చమాంబ నమ్మింది. ఇటు భర్త, తమ్ముడి ప్రోత్సాహం లభించింది. మొదటగా ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో వ్యతిరేక పరిస్థితులు తట్టుకుని దేశంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహిళల మీద పరిశోధనలు ప్రారంభించింది. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎంతో సమాచారం సేకరించి ''అబలా సచ్చరిత్ర రత్నమాల'' పేరుతో మహిళల చరిత్రలతో కూడిన గ్రంథం రాసింది. స్త్రీల కోసం తొలి సారిగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. అచ్చమాంబ స్త్రీల గురించి భిన్నంగా ఆలోచించేది. స్త్రీలకు విద్య నేర్పితే కుటుబం, సమాజం నాశనం కావు. నాశనం అవుతారని ఎవరైతే రాసారో చెప్పుతున్నారో వారు మాత్రమే నాశనమవుతారని హెచ్చరించింది. విద్య నేర్చిన స్త్రీ ఉన్నతంగా తయారవుతుందని నిరూపించింది. స్త్రీలలోని అసాధారణ ప్రతిభ వెలుగులోకి రానివ్వకుండా అణచి వేస్తున్నారనీ వారందరినీ తగిన లక్ష్యం వైపు, సరైన మార్గంవైపు నడిపించడమే లక్ష్యంగా పని చేసింది. భండారు అచ్చమాంబ మొదటి, రెండు కథలు వెంకట శివుడు సంపాదకత్వంలో వెలువడిన ''తెలుగు జనానా'' పత్రికలో రెండు జులైలో ''ప్రేమ పరీక్షణము'' 1898 సెప్టెంబర్లో ''ఎఱువు సొమ్ము పరువు చేటు'' పేరిట అచ్చయ్యాయి. మొసలికంటి రాంబాయమ్మ సంపాదకత్వంలో వెలువడ్డ ''హిందూ సుందరి'' పత్రికలోనూ, పులుగుర్తి లక్ష్మినరసమాంబ సంపాదకత్వంలోని ''సావిత్రి'' పత్రికల్లోనూ అచ్చమాంబ రచనలు అచ్చయ్యాయి. ఇందులో ''అబలా సచ్చరిత్ర రత్నమాల'' దేశ విదేశాల్లోని వీర, ధీర, వనితల ఉదాత్త చరిత్రల వ్యాస సమాహారం. ఆనాటి మహిళల్లో గొప్ప స్ఫూర్తి, రచనా ప్రేరణను కలిగించిందంటే అతిశయోక్తి కాదు. క్రోషా అల్లికలు మొదలు, వంటల వరకు అనేక విష యాలపై ఆయా పత్రికల్లో ఆమె రాసిన వ్యాసాలు ఇప్పటికీ వెలుగుకు నోచుకోలేదంటే తెలుగు నాట మహిళల రచనలపై వివక్షల తీరు తెలుస్తుంది. తెలుగు నాట విశ్వ విద్యాలయాలు, స్వచ్ఛంద పరిశోధన సంస్థలు, మహిళాభివృద్ధి సంస్థలు, స్త్రీల కోసం పని చేస్తున్న ఎ్నన్జీవోలు ఏవీ భండారు అచ్చమాంబ కథలపై దృష్టి కేంద్రీకరించకపోవడం విచారకరం.
1901లో ఆమె బృందావనీ స్త్రీ సమాజాన్ని మచిలీపట్నంలో నెలకొల్పారు. అక్కడే కృష్ణా పత్రిక స్థాపించబడింది. ఇదే సమయంలో తెలంగాణలో పునర్వీకాసోద్యమానికి పునాదులు పడ్డాయి. అచ్చమాంబ తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు పూనిక మేరకు, హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయాంధ భాషా నిలయం స్థాపించబడింది. హైదరాబాద్ నుంచి నాగపూర్, మద్రాసు, బొంబాయికి రైలు సదుపాయాలు విస్తృతం కావడంతో వీటి వల్ల తెలంగాణలో అచ్చమాంబ తెలుగు సాహిత్యం, పున ర్వికాసోద్యమాలకు పునాదులు ఏర్పడ్డాయి. అచ్చమాంబ రాసిన కథలన్నీ ఆధునిక భావాలు కలిగిన పాత్రలతో సంభాషణలతో, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాసినవే. స్త్రీల చదువే సర్వసమస్యలకు పరిష్కారమార్గమని నేటి పాపులేషన్ సిద్ధాంత కర్తలు చెబుతున్న విషయాలు వందేండ్ల క్రితమే చెప్పడంతోపాటు ఆచరణకు ప్రయత్నించిన సాహసి అచ్చమాంబ. ఆమె కథలన్నీ ఆధునిక భావాలకు వేదికలు. ప్రతి కథలోనూ సమాజోద్దరణ మహిళా భ్యున్నతి, మెరుగైన సమాజం కోసం తహతహా కనపడుతాయి. పురాణ కథలకు కూడా ఆధునికతను ఆపాదించి పొదుపు ద్వారా సంసారాన్ని స్వర్గంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పింది. ఆడపిల్లలకు చదువుకోవడం వల్ల మంచి జీవితమే కాదు మంచి వరుడు కూడా వస్తాడని ఆనాటి తల్లి దండ్రుల్లో కథల ద్వారా చైతన్యాన్ని కలిగిచింది. చదువుకుంటే కట్న కానుకలు అవసరం లేదని, భార్యా భర్తల మధ్య చిన్నచిన్న పొర పొచ్చలు నిండు జీవితాలను ఎలా ఛిద్రపరుస్తాయో, దాన్ని ఎలా అధి గమిచాలో తెలిపే గొప్ప కథ ''దంపతుల ప్రథమ కలహం''. ఆమె కథలో స్త్రీలకు బంగారు ఆభరణాల కన్నా సద్గుణాలే మిన్న. బంగారు నగలు స్త్రీ స్వేచ్ఛకు సంకెళ్లని చిత్రీకరించింది. ఆనాడు చదువుకున్న స్త్రీలు ఏ ప్రాంతం వారైనా ఆమె ప్రభావానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆమె కార్యాచరణ, వాక్చాతుర్యం వీటికి తోడు భిన్న ప్రదేశాల్లో వివిధ సభలు, సమావేశాల్లో పాల్గొనడం ద్వారా అచ్చమాంబ మహిళా లోకంలో తిరుగులేని మార్పుల్ని తీసుకు వచ్చింది.
చదువు లేదు. భాల్య వివాహం.. సంసార బాధ్యతలు... అయినా అంత తక్కువ వయస్సులోనే అంతటి గుర్తింపు తెచ్చుకుందంటే అచ్చమాంబ అసాధారణ ప్రతిభ ఎంతటిదో అర్థమవుతుంది. ఆనాడు జరగుతున్న స్వాతంత్య్ర పోరాటంలో కూడా అచ్చమాంబ పాల్గొన్నది. 1903 కాంగ్రెస్ సమావేశాలు బొంబాయి నగరంలో జరుగుతుండగా ఆమె నేటి ఛత్తీస్ఘడ్లోని బిలాస్పూర్లో నివసిస్తున్నది. అది తెలుగువారు అధికంగా కలిగిన ప్రదేశం. అప్పటికే ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉంది. భయంతో ప్రజలంతా పట్టణం వదిలి ఊరి వెలుపల గుడారాలు వేసుకొని ఉంటున్నారు. ప్లేగు ప్రాణాంతక వ్యాధి. ఎవరికి వారు తమ ప్రాణం కాపాడుకునే యత్నం చేసుకుంటున్నారు. ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా భర్త మాధవరావు ఈ క్యాంపులకు వెళ్లి సేవలు అందిస్తున్నాడు. అటువంటి సమయంలో ఆ సేవలలో తాను పాలు పంచుకుంటానని అచ్చమాంబ పట్టుబట్టి వెళ్లింది. బొంబాయి కాంగ్రెస్ సమావేశాల నుండి స్వాతంత్య్ర పోరాట భావజాలం నింపుకుని వచ్చిన అచ్చమాంబ నేరుగా మహిళా సేవలో నిమగమైంది.
సొంత ప్రయోజనాల మీద నమ్మకంలేని ఆమె నమ్మిన మార్గంలోనే నడిచింది. ప్లేగు వ్యాధిగ్రస్తుల సేవలో ఉండగానే అచ్చమాంబకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అది ప్లేగు జ్వరమని గుర్తించిన భర్త చికిత్స మొదలు పెట్టాడు. జ్వర తీవ్రత నుండి రక్షణ కోసం పాదాలకు ఉన్ని మేజోళ్లు తొడగాల్సి వచ్చింది. ఆ సమయంలో తనకు వేయబోతున్న మేజోళ్ల మీదున్న విదేశీ కంపెనీ గుర్తు చూసి కాళ్లు వెనక్కు తీసుకొని ''స్వదేశీ మేజోళ్లు ఉంటే వేయండి, లేకుంటే లేదు'' అని చెప్పిన గొప్ప దేశభక్తురాలు అచ్చమాంబ. ప్లేగు వ్యాధికి తగిన చికిత్స లేని కాలం. మూడు పదుల వయసప్పుడే 1905 జనవరి 18న అచ్చమాంబ మరణించింది. కేవలం 30 ఏండ్లకే వందల సంవత్సరాలకు సరిపడా కృషిని, ఆచరణను మనందరికీ అందించిన అచ్చమాంబ కృషి ప్రశంసనీయం. తన కథల ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడానికి విశేషమైన కృషి చేసిన బండారు అచ్చమాంబ గురించి ఈనాడు ఏ పాఠ్య పుస్తకంలోనూ లేదు. ఆమె కేవలం రాతలకే పరిమితం కాకుండా ఆచరణలో అనాథ పిల్లల్ని ఆదుకున్నారు. సమాజంలో ఎన్నో అవమా నాలు భరించి, సమాజ సేవలో పాల్గొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన అచ్చమాంబ ఆదర్శమూర్తి. గురజాడ అప్పారావు కన్నా పదేండ్ల ముందే అచ్చమాంబ కథలు వచ్చాయి. తన రచనలను ఇప్పటికైనా భావి తరాలకు అందించాలి. ఆమె జీవితం అందరికీ ఆదర్శమవ్వాలి.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343