Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖ్యమంత్రే స్వయంగా ఇటీవల ఓ టాన్ అకౌంట్ బడ్జెట్ను లక్షా 89 వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు. గత 4 సంవత్సరాల కాలం నుండి రాష్ట్ర ఆదాయంతోపాటు, ఖర్చులు, అప్పులు పెరిగిపోతున్నాయి. దానికి అను గుణంగా బడ్జెట్ కూడా భారీగా పెరుగుతున్నది. బడ్జెట్ భారీగా పెరిగిపోతున్నదంటే దాని అర్థం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఉపాధి, అవకాశాలు విస్తృతంగా కల్పించబడి ఉండాలి. ఉద్యోగాలు భారీగా భర్తీ చేసి ఉండాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి తద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగి, క్రమంగా అప్పులు తగ్గించుకునే అవకాశం ఉండాలి. కానీ అవేవీ లేకపోగా ప్రభుత్వం చెబుతున్నట్టు దేశంలోనే ధనిక రాష్ట్రం 2 లక్షల 60 వేల కోట్లకు పైగా అప్పుల్లో ఉండి మళ్లీ అప్పులు చేస్తా మని ప్రకటించడం వెనుక మర్మం ఏమిటి? సరే.. వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులను రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలకు సమానంగా పంచుతున్నారా? అప్పులు అందరికి పంచి, ఆదాయాన్ని మాత్రం కొంతమందికే (వర్గాలకు) కట్టబెట్టడంలేదా? కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా కేటాయించబడిన డబ్బులనైనా పూర్తి ఖర్చు చేయగలుగుతున్నారా..? అంటే లెక్కల్లో చూపించి, ఖర్చు పెట్టకుండా వివక్షత పాటిస్తూ ఆ నిధులను ఇతరులకు ఖర్చు చేయడం లేదా?
ముఖ్యంగా ఎస్సీ / ఎస్టీలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినా ఖర్చు చేయడంలో మాత్రం ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ నిధులను దళిత, గిరిజనులకు ఖర్చు చేయకుండా ఔటర్రింగ్రోడ్డు, హుస్సేన్సాగర్ ఆధునీకరణ, పార్కుల అభివృద్ధి, ప్రాజెక్టులకు దారి మళ్లించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదేదారిలో నడుస్తున్నది. దళిత, గిరిజన వాడల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలకు ఖర్చు చేయాల్సిన నిధులను, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ, ప్రాజెక్టులకు మళ్లిస్తోంది. సాధారణ అభివృద్ధిలో చేయాల్సిన వాటికి కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధులను ఖర్చు చేయడం, అన్యాయం కాదా? దళిత, గిరిజన వాడలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని దశాబ్దకాలంపాటు దళిత, గిరిజనులకు బడ్జెట్లో వాటా కావాలని కేవీపీఎస్, ప్రజాసంఘాలు, బి.వి.రాఘవులగారి నాయకత్వాన అసాధారణ పోరాటం జరిగింది. నోడల్ ఏజెన్సీ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం కోసం సైకిల్ యాత్రలు, చలో అసెంబ్లీలు, నిరాహార దీక్షలు వంటి ఎన్నో సమర శీల పోరాటాలు నిర్వహించి లాఠీదెబ్బలు తినడమేకాదు, జైళ్లకు వెళ్లడమూ జరిగింది. తత్ఫలితంగా నిధులు పక్కదారి పట్టించకుండా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను చట్టరూపంలో తెచ్చి హక్కుగా చేరుస్తూ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సబ్ప్లాన్ చట్టం స్థానంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ఫండును కొన్ని రూల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. సబ్ప్లాన్ చట్టాన్ని అమలు చేస్తే అవి హక్కుగా ఉంటాయి. ఖర్చు చేయాల్సి వస్తుందనే దురు ద్దేశ్యంతోనే అలా చేశారు. రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ నిధులూ పెరుగుతున్నాయి. కానీ ఖర్చు మాత్రం అమాంతం సగానికి తగ్గిస్తూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, గిరిజనుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నది. నిధులు ఖర్చు చేయరు. భూమిని పంచరు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయరు. దాడులు చేస్తే స్పందించరు. ఇక రైతుబంధు, బీమా, రుణమాఫీ పథకాల వల్ల 0.0002 శాతం మాత్రమే దళిత , గిరిజనులకు లబ్దిచేకూరుతున్నది. ఎందుకంటే వీరి చేతిలో భూమిలేదు. వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా, వలసజీవులుగా బతుకీడుస్తున్నారు. కార్పొరేషన్ రుణాల కోసం అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి తిరిగి ఇటు లోనురాక, అటు భూమిలేక, ఉద్యోగాలు రాక మానసిక ఆందోళనతో దినం గడుపుతున్న జీవితాలు దళిత గిరిజన యువకులవి.
ప్రభుత్వ ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే నాటి ఉద్యమనాయకులు మాత్రం భజనలు చేస్తున్నారు. ఎందుకు నిధులు ఖర్చు చేయడంలేదని ప్రశ్నించవలసిన నేతలు ప్రాపకాల కోసం 'వంతలు' పాడుతున్నారు. తమ స్వలాభం కోసం 'జాతి' ని తాకట్టు పెట్టే దళారి నాయకుల వల్ల దళిత, గిరిజన బతుకులు మరింత దిగజారే పరిస్థితి ఉన్నది. దళిత గిరిజన యువత ఇది గుర్తించాలి. పోరాటాల ద్వారా సంఘటితమై ప్రభుత్వాం విధానాలను అనుకూలంగా మార్చుకోవాలి. చట్టాలను అమలు చేసుకోవాలి. నిధులను ఖర్చు పెట్టేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇది సామాజిక ఉద్యమ సంఘాల ఐక్యత, అనుకూల రాజకీయపార్టీల ద్వారానే సాధ్యం అవుతుంది. పోరాడి సాధించుకున్న హక్కులను అమలు చేయించుకోలేకపోతే, కొత్త హక్కులను ఎలా పొందగలం?
- దయ్యపు రాధాకృష్ణ
సెల్ : 7730877841