Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగేండ్లుగా దేశవ్యాప్తంగా గో రక్షణ పేరుతో దాడులు జరుగుతున్నాయి. రాజకీయంగా జన సమీకరణకు ఆవు ఒక పనిముట్టుగా మారింది. 2014లో బీజేపీ అధికా రంలోకొచ్చాక గోరక్షణ పేరుతో దళి తులు, మైనార్టీలపై సంఫ్ పరివార్ శక్తుల దాడులు తారాస్థాయికి చేరాయి.
గత నాలుగేండ్లలో జరిగిన గో దారుణాలను ''హ్యూమన్ రైట్స్ వాచ్'' నివేదిక బహిర్గతం చేసింది. ఫిబ్రవరి 18న ''భారత్లో గో పరిరక్షణ - హింసాత్మకం, మైనారిటీలపై గో గుండాల దాడి'' అనే పేరుతో 104 పేజీల నివేదికను విడుదల చేసింది. 20 రాష్ట్రాల్లో జరిగిన దాదాపు 100 ఘటనల్లో 280 మంది గాయపడ్డారని 44 మంది ఖూనీ కాబడ్డారని వెల్లడించింది. గోరక్షణ గ్రూపులతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని స్పష్టం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో 11 ఘటనల్లో 14 మంది మరణించిన కేసులను హెచ్ఆర్డబ్ల్యూ ప్రత్యక్షంగా సమీక్షించింది. దాదాపు అన్ని కేసుల్లో పోలీసు దర్యాప్తు నిలిచిపోగా గో రక్షకులు రాజకీయ ఆశ్రయం పొందుతున్నారని తేల్చింది.
ఆవు 20 నుండి 25 ఏండ్లు జీవిస్తుంది. దేశంలోని మొత్తం గోవుల్లో 1-3 శాతం ఆవులు ఎలాంటి ఉత్పత్తినీ అందించగల వయసులో ఉండవు. పదేండ్ల పైబడిన ఎడ్లు, మొత్తం ఎడ్లలో రెండు శాతంగా ఉంటాయి. ఒకవేళ వాటిని కబేళాలకు పంపించని పక్షంలో అవి 50 శాతం వరకు ఉంటాయి. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించినట్టయితే 2012లో 18 కోట్లుగా ఉన్న పశువుల సంఖ్య 2027 నాటికి 36 నుంచి 40 కోట్లకు చేరుకుంటుందని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్ పరేఖ్ 'టైమ్స్ ఆఫ్ ఇండియాకు' రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. చట్టబద్ధంగా గోవులను తరలిస్తున్న రైతులను, చిన్న వ్యాపారులను పరివారశక్తులు నిర్దాక్షిణ్యంగా పొట్టన బెట్టుకున్నారు. ఈ హింసాకాండతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచంలోని తోళ్ల ఉత్పత్తుల్లో 13 శాతం భారతదేశం నుండే. ఏడాదికి 12 బిలియన్ డాలర్ల (8.5 వేలకోట్ల) ఆదాయం దీంతో వస్తుంది. అందులో 5.7 బిలియన్ డాలర్ల విలువచేసే తోలు ఇతర దేశాలకు ఎగుమతవుతుంది. 6.3 బిలియన్ డాలర్లు విలువచేసే తోలు భారతదేశ మార్కెట్లో ఖర్చవుతుంది. దీని మీద 3 మిలియన్ల కార్మికులు ఆధారపడి ఉన్నారు. అందులో 30 శాతం మంది మహిళలే. దేశవ్యాప్తంగా తోళ్ల పరిశ్రమలో 2013-14లో 18.36 శాతం వద్ధిరేటు నమోదు కాగా, 2014 -15లో సగభాగానికి పోయింది(9.44). 2017- 18లో కేవలం 1.41 శాతం నమోదైంది. దీంతో తోళ్ల పరిశ్రమలన్నీ నష్టాలపాలవుతున్నాయి. దీని మీద ఆధారపడ్డ కార్మికులు దయనీయమైన స్థితికి దిగజారారు. ఎంతోమంది రోడ్డున పడ్డారు.
ప్రపంచంలోనే పశు మాంసం ఎగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మోడీ ప్రభుత్వం వచ్చాక మాంసం ఎగుమతుల వద్ధి రేటు నానాటికీ పడిపోతోంది. బీజేపీ విధానాలే ఇందుకు కారణమని ఈ నివేదిక స్పష్టంగా చెబుతోంది. గో రక్షక దళాలను పోషిస్తూ... పశువులపై కేంద్రం తీసుకున్న వైఖరితో ఆర్థికంగా పశు మాంసం పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోయారు. దేశ మాంసం ఎగుమతులు తగ్గాయి. 2013- 14లో 35.93 శాతం వద్ధిరేటు ఉండగా 2014 -15 నాటికి సగానికి పైగా పడిపోయింది (9.88 శాతం ఉంది). 2017 -18 వద్ధిరేటు 3.06 శాతానికి పడిపోయింది. ఇదిలాగే కొనసాగితే పరిశ్రమలు మూతపడే అవకాశముంది. దీంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు.
ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆవుల కోసం 'కామదేను యోజన' పథకం కింద రూ.750 కోట్లను కేటాయించింది. కానీ అసంఘటిత కార్మికులకు మాత్రం 500 కోట్లా? బీజేపీ హయాంలో పశువులకన్నా అన్యాయమైన పరిస్థితి మనుషులకు ఏర్పడిందని స్పష్టమవుతున్నది. పరివార్ శక్తుల హిందూత్వ పెత్తనం పెరిగింది. రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొత్త చట్టం చేశారు. గోవధ, గోమాంస భక్షణను నిషేధించారు. ప్రభుత్వం ఈ దిశగా వేసే ప్రతి అడుగును, చర్యనూ ఖచ్చితంగా వ్యతిరేకించాలి. రైతులు, దళితులు, మైనారిటీలు, పేద వర్గాలందర్నీ ఈ ప్రమాదం నుండి పోరాటం చేసి కాపాడాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అందుకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
- గడ్డం మధుకర్
gaddammadhukar333@gmail.com