Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యానికి లౌకిక భావ జాలానికి, సత్యాగ్రహ సూత్రాలకు, గ్రామ స్వరాజ్యానికి ''భారతదేశం'' ఖ్యాతి వహించింది. ఒకనాడు కాంగ్రెస్- కమ్యూనిస్టు - సోషలిస్టు - స్వతంత్ర పార్టీలే పల్లె నుండి ఢిల్లీ దాకా ఉండేవి. ఓడినా, గెలిచినా ఒకే పార్టీలో ఉండేవారు. ఇందిరమ్మ పాలన ప్రారంభం నుంచే పార్టీలు మారడం ఎక్కువైంది. కాంగ్రెస్నే రెండుగా చీల్చడం (కొత్త, పాత కాంగ్రెస్లుగా) సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూనే వి.వి.గిరిని రాష్ట్రపతిగా గెలిపించడం (అంతరాత్మ ప్రభోద సిద్ధాంతం చెప్పి) 1969 నాటి చరిత్ర. అంతకంటే ముందే 1967లో హర్యానా రాష్ట్రంలో శాసనసభ్యులు, అధికార, ప్రతిపక్ష పార్టీల్లోకి జంపు చేయడం (పొద్దున ఒక పార్టీ-రాత్రి ఒక పార్టీలో చేరడంతో) నాటి నుంచి అయారాం, గయారాంల సంస్కృతి ఆరంభమైందనవచ్చు.
పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటివి జరగవు. అలనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిలో రాజీనామా చేసి కన్సర్వేటివ్ పార్టీలో చేరితే బ్రిటిష్లో హాహాకారాలు, హర్తాళ్లు జరిగాయి. ప్రజా వ్యతిరేకత పెల్లుబికింది. 1937-39 యూపీ శాసనసభలో బాబా పురుషోత్తమ దాస్ టాండన్, పూర్వ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికయ్యాడు. అందాకా ఎందుకు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెన్నేటి విశ్వనాధం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికైన పదవికి రాజీనామా చేశారు. ప్రజాపార్టీలో చేరారు. ఇందిరమ్మపై నిలబడిన వీరేంద్రపాటిల్ (చిక్మగుళూర్), జైపాల్రెడ్డి (మెదక్)లు జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఇందిరమ్మ ఎమర్జెన్సీని ఎదిరించి అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఎన్ని ముక్కలైందో చెప్పలేం. ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. 1973లో కేంద్రం పార్టీ ఫిరాయంపుల నిరోధానికి రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. 1.3.1985 నాటికి ఆ బిల్లు అమల్లోకి వచ్చింది. 52వ రాజ్యాంగ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అమలైంది. ఇందిరమ్మ సిక్కు ఉగ్రవాది తూటాలకు బలైన సందర్భంలో దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన కాంగ్రెస్ సానుభూతి వెల్లువలో 450మంది ఎంపీలు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు (ఎన్నికైన వారి రక్షణకు ఆఘమేఘాలపై బిల్లు రాజీవ్ తెచ్చారన్నారు కొందరు). ఆయన మంత్రివర్గంలోని విపి సింగ్ ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి జన మోర్చా (జనతాదళ్) పార్టీ ద్వారా తిరిగి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. జనతా దళ్ సారధయ్యాడు. 102 (2) నిబంధన ప్రకారం ఎంపీలు 191(2) నిబంధన ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా రాజ్యాంగం 10వ షెడ్యూల్ ద్వారా చట్టం చేశారు. కానీ ఒక పార్టీలో నుండి 2/3వ వంతు సభ్యులు వేరే గ్రూప్గా ఏర్పడటం వేరే పార్టీలో చేరికకు ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. స్పీకరు అధికార పక్షం వైపు ఉండటం చూస్తున్నార.
1980 ప్రాంతంలో కేరళలో స్పీకర్ కాస్టింగ్ ఓటుతో ప్రభుత్వం నడిచిన సందర్భాలున్నాయి. అధికార - ప్రతిపక్షాలకు కేవలం 2 నుంచి 4 సీట్ల తేడాలో కూడా సుస్థిరంగా ప్రభుత్వాలు పని చేసేటట్టు చేసే సంస్కారం కేరళలో ఎల్డీఎఫ్ ఫ్రంట్కు ఉంది. అనూహ్యంగా కేరళలోలాగే త్రిపురలో కూడా ఒకసారి మంజుదాస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు సీపీఐ(ఎం)కు- కాంగ్రెస్కు తేడా బహుస్వల్పం. అయినా ఫిరాయింపుల్ని 2పార్టీలు ప్రోత్సహించలేదు. సీపీఐ(ఎం) విలువలతో కూడిన రాజకీయాలు నెరపింది. కమ్యూనిస్టులు, సెక్యులర్ భావజాలంగల ఇతరులు చాలా విలువైన రాజకీయాలు, సిద్ధాంతాల కోసం పని చేశారు. ఒకసారి ఒక సభలో సుందరయ్యకి అభిమానులు జిందాబాద్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తుంటే ఆయన వారిని వారించి కేకలేసారట? ''తాను చివరి శ్వాసదాకా కమ్యూనిస్టుగా కన్నుమూసిన తర్వాత జిందాబాద్ కొట్టండని సీరియస్గా చెప్పారట. అదీ నాయకత్వం అంటే! అదీ నిబద్ధత అంటే!! పుత్రుల కోసం పార్టీలు మారే వారిని నేడు చూస్తున్నాం. మొన్న గోవాలో నిన్న కర్నాటకలో, బీజేపీ రాజకీయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రలో పాలక పక్షాలు బరితెగించి ఎమ్మెల్యేలను అధికార పక్షంలో చేర్చుకోవడం, పార్టీ మారిన వారిని మంత్రులుగా ఎంపిక చేయడం ఏ విలువల్ని సూచిస్తాయి. స్పీకర్లు ఏం చేస్తున్నారు. అలనాటి పివి నర్సింహారావు ప్రధాని పదవి కాపాడుకోవడం కోసం అన్య పార్టీ ఎంపీల్ని కొనుగోలు చేశారు. అలాగే 2008లో మన్మోహన్సింగ్ ప్రధాని పదవి కాపాడుకోవడం కోసం నాడు ప్రతిపక్షాలు అధికార పార్టీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు ఇతర పార్టీ ఎంపీలను తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం అంతా ఎరిగిన విషయమే. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఫిరాయింపుల్ని కాంగ్రెస్ ఆకర్ష్ పేరుతో ప్రోత్సహించింది. 2014లో ఆంధ్రలో చంద్రబాబు మెజార్టీ ఉన్నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం ఎన్నికై 4రోజులైనా కాకముందే ఎంపీలను చేర్చుకోవడం వారిచే రాజీనామా చేయించకపోవడం గమర్హనీయం. అలాగే ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎమ్మెల్యేలను సైతం అధికార పక్షంలో చేర్చుకోవడం, వారిని అనర్హులుగా స్పీకర్ ప్రకటించకపోవడం దారుణం. 2019లో మంచి మెజార్టీ ఉన్నా (90మంది ఎమ్మెల్యేలు) టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో (టీఆర్ఎస్లో) చేర్చుకోవడం మరీ దారుణం. పైగా ఆనాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆకర్ష్ ద్వారా తమ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా? అని బుకాయించడం చాలా బాధకరం. తప్పు ఎవరు చేసినా ఖండించాలి. పునరావృతం కారాదు కదా! ఒక పార్టీలో 3వ వంతు సభ్యులు వేరే గ్రూప్ లేదా బ్లాక్గా గుర్తింపు కోరడం లేదా ఒక పార్టీలో మూడింట రెండు వంతుల మంది తాము మరో పార్టీలో విలీనం కావాలని కోరితే అందుకు స్పీకర్ స్పందించి అంగీకరించాలి. కానీ అలా జరగడం లేదు. ఇద్దర్ని, ముగ్గుర్ని, ఒకరిని అలా జమ చేస్తూ ఫిరాయింపు చేయించడం అధికార పక్షానికి తగదు. ఇది శోచనీయం. పత్రికలు, మీడియా, ప్రజా సంఘాలు ఫిరాయింపులపై ఉద్యమించాలి. ప్రజా తీర్పును వమ్ము చేసే ప్రజా ప్రతినిధుల్ని ప్రజలు ఘెరావ్ చేయాలి. రాజీనామా చేసేదాకా పోరాడాలి. వారిని ప్రజల్లో తిరగనీయరాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి.
- తంగిరాల చక్రవర్తి
సెల్:9393804472