Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేది వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 2,563 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో బాలురు 2,55,318, బాలికలు 2,52,492 మంది ఉన్నారు. ఏటా జరిగే తంతే ఇది, ఇందులో విశేషం ఏముంది. కానీ ఎందుకో దాదాపు నాలుగు దశాబ్దాల జర్నలిజం నాలో ఒక ప్రశ్నను రేపింది. పదేండ్ల క్రితం ఒకటో తరగతిలో చేరిన పిల్లలు ఎందరు అని!
సరిగ్గా పదేండ్ల క్రితం ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వం దాదాపు 11 లక్షలని అప్పుడు ప్రకటించింది. మరి దాదాపు ఐదున్నర లక్షల మంది పిల్లలు ఎక్కడ జారిపోయారు. బంగారు తెలంగాణలో వీరి చదువులు చట్టుబండలయ్యాయా? ఎవరు పెట్టారో, ఎప్పుడు పెట్టారో కాని అకాడమిక్ ఇయర్ మనకు జూన్- జూన్ ఎందుకుటుందో? పరీక్షలు ఇలా ఎందుకుంటాయో. పదో తరగతికి ఆ ప్రాధాన్యత ఎందుకు? సరే ఆ నెపాన్ని, లోపాలను లార్డ్ మెకాలే మీదికి తోసేద్దాం.
జూన్లో విద్యా సంవత్సరం ఆరంభం కావడంపై సమీక్ష జరిపే విజ్ఞత కరువైనందున ఆ పద్ధతి అలాగే కొనసాగుతున్నది. తత్పలితంగా పిల్లలు ఏప్రిల్, మే నెలల్లో ఎండలో ఎండే పరిస్థితి కొనసాగుతున్నది. పదో తరగతి విద్యార్థుల సంఖ్యలో ఇంకో ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో 11,333 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 35.60 లక్షల మంది విద్యార్థులున్నారు. 351 హయ్యర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి, వీటిలో 2,008,56 మంది విద్యార్థులున్నారు. ఏటా ఒకటో తరగతిలో దాదాపు 15 లక్షల మంది పిల్లలు చేరుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒకటో తరగతిలో చేరిన వారిలో పదో తరగతికి వచ్చే వరకు డ్రాప్ అవుట్ రేట్ నిజానికి 60 శాతం ఉంటుంది. ఎన్జీవోలు, ప్రభుత్వ సంస్థల వారు అది 38 శాతమని చెబుతారు. తరగతులు పెరుగుతున్న కొద్దీ డ్రాపౌట్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. తెలంగాణలోని అంగన్వాడీలలో 17.17 లక్షల మంది పిల్లలున్నారట. రాష్ట్రంలో 3,120 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో 4.36 లక్షల మంది విద్యార్థులున్నారు. 1,180 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 2.90 లక్షల మంది విద్యార్థులున్నారు. 224 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో 1.05 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇవన్ని లోప పూరిత గణాంకాలే. ఒక్క పదో తరగతి పిల్లల సంఖ్య మాత్రం వాస్తవం. ఇక్కడ పిల్లల ఫొటోలతోపాటు వారి తలిదండ్రులు, పుట్టిన తేది, ఊరు, కులం తదితరమైనవన్నీ ఖచ్చితంగా నమోదు అవుతాయి. ఈ సంఖ్య ఆధారంగా మన విద్యారంగ పరిస్థితిని గమనిద్దాం.
పరీక్ష రాసిన ఐదు లక్షల పైచిలుకు పిల్లల్లో ఏటా దాదాపు 85-90శాతం మంది పిల్లలు పాస్ అవుతున్నారు. ఇలా పాస్ అవుతున్నవారు నిజంగా పాస్ అవుతున్నారా? లేక వారిని పాస్ చేసి పంపిస్తున్నారా? అనే ప్రశ్న కూడా కలుగుతోంది. అనేక రకాలుగా తరచి చూడగా వారిలో కేవలం 15శాతం మంది పిల్లలు మాత్రమే నిజంగా పాస్ అయ్యే సామర్థ్యం కలిగి ఉన్నారని 60 -65శాతంమంది తోసివేయబడుతున్నారని తేలింది.
అక్కడ 1 -10 మధ్య డ్రాప్ అయిన విద్యార్థులు పెరిగి పెద్దవారై ఏమవుతారు, సామర్థ్యం లేకుండా పదిలో పాస్ చేయబడిన వారు ఏమవుతారు? డ్రాప్ అయిన విద్యార్థుల్లో అత్యధికులు బాల కార్మికులు, వీధి బాలలుగా మారుతారు. వీధి బాలల సగటు ఆయుర్దాయం 25 ఏండ్లు మాత్రమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. చదువు లేకుండా పది పరీక్షల్లో తోసి వేయబడిన వారు వ్యర్థులుగా, అత్తెసరు చదువరులుగా, మిదిమేళపు మేధావులుగా, మ్యానిపులేటర్లుగా, అధికార వర్గాల తాభేదారులుగా, దళారులుగా, సోమర్లుగా, వైట్ కాలర్ నేరగాళ్లుగా మారతారు. పూల రవీందర్, పాతూరి సుధాకర్ లాంటి వారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలున్నారు, కానీ వీరు ఇలాంటి విషయాలను కౌన్సిల్లో ఒక్కసారైనా ప్రస్తావించరేమీ? విద్యా శాఖకు మంత్రి, విద్యా శాఖ కార్యదర్శిగా ఓ సీనియర్ ఐఏఎస్ ఉంటారు. వీరిపైన ముఖ్యమంత్రి ఉంటారు. తెలంగాణలో 66.54 శాతం మంది చదువుకున్న వారు ఉన్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మగ వారిలో 75శాతం మహిళల్లో 56శాతం చదువుకున్నారట. చదవడం, రాయడంతోపాటు చతుర్విద గణితం వచ్చిన వారినే అక్షరాస్యుల కింద లెక్కిస్తే వారి శాతం 10-15 మాత్రమే ఉండవచ్చు. కాని సంతకం వచ్చిన వారందరూ అక్షరాస్యులేనని ప్రభుత్వం చెబుతున్నది. ఇది మనలను మనం మోసం చేసుకోవడం తప్ప ఇంకేమి కాదు.రాష్ట్రంలోని 33 జిల్లాలలో 585 మండలాలు, 158 పట్టణ, నగర ప్రాంతాలున్నాయి. దాదాపు 12 వేల ఉన్నత పాఠశాలలున్నాయి. 585 మండలాలకు దాదాపు 500 మండలాలలో విద్యా శాఖ అధికారులు లేరు. విద్యారంగం ఎవరికో పుట్టిన అనాధ బిడ్డ అయ్యింది. కార్పొరేట్ శక్తుల చేతుల్లో డబ్బు సంపాదనకు ఉపకరణంగా మారింది. నాణ్యమైన విద్య ఎవరికీ పట్టని అంశంగా మారింది. ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించకుండా ఏ సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉండదు.
- రవీందర్