Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార తీరుతెన్నులను చూస్తే రాజకీయ పార్టీలు ఇంతగా దిగజారుతాయనుకోలేదు అని పెద్దతరం వారు నివ్వెరపోతు న్నారు. చరిత్రలో నాటి ప్రముఖ రాజనీతిజ్ఞులకు, ఆచరణలో నేటి రాజకీయ నేతలకు ఇంత తేడా ఉందా? అని మెదళ్లలో గుజ్జు వున్న యువతరం అనుకుంటోంది. 'ముందు ఎల్కె.అద్వానీ కాబోయే రాష్ట్ర పతి అంటూ గుసగుసలు వినిపించాయి. అయితే గుజరాత్లో అధికారం పోయే అవకాశం ఉందని భయపడిన బీజేపీ అద్వానీకి అవకాశాన్ని నిరాకరించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక దళితుడిని రాష్ట్రపతిగా ఎంచుకుంది అని రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహలట్ చేసిన వ్యాఖ్య మీద బీజేపీ రాద్దాంతం చేస్తోంది. ఎన్నికలు గనుక భావోద్వేగాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనుకోవటం స్వచ్చ రాజకీయాలు కోరుకునే వారికి నీచంగా కనిపిస్తోంది.
బీజేపీ నేతలు తమ కింది నలుపును తాము చూసుకోగలిగితే ఇతరుల మీద దాడికి దిగరు. కనుక వారేం చెప్పారో గుర్తు చేయకతప్పదు. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ బళ్లారిలో ఇలా చెప్పారు. 'బీజేపీ ఒక ముస్లిం, ఒక దళితుడిని రాష్ట్రపతులను చేసింది, కాంగ్రెస్ దళితులను మోసం చేసింది. తమకు అధికారమిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ ఓట్లడిగింది. అయితే ప్రముఖ దళిత నేత మల్లిఖార్జున ఖర్గే బదులు సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంచుకుంది. దళితులను మోసం చేసింది. అబ్దుల్ కలాం ఒక ముస్లిం, బీజేపీ ఆయనను రాష్ట్రపతిని చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఒక దళితుడు. బీజేపీ అంటే బనియా, బ్రాహ్మణుల పార్టీ అని మమ్మల్ని ద్వేషించే వారు అంటారు. మేము ఒక దళితుడిని రాష్ట్రపతిని చేశాము, ఒక ఓబీసీ, ఓ చాయ్ వాలాను ప్రధానమంత్రిని చేశాము' అని చెప్పారు. అశోక్ గెహ్లట్ అన్నది తప్పు నరేంద్రమోడీ చెప్పింది ఒప్పంటారా? ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు?
ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా దిగజారి వ్యవహరించటం, గల్లీ స్థాయి నేతల్లా మాట్లాడటంచేస్తున్నారంటే తమ అడుగుజారుతోందన్న భయం పట్టుకున్నట్టే అన్నది మెజారిటీ విశ్లేషణల సారాంశం. వారెందుకీ అభిప్రాయానికి వచ్చినట్టు? ఎన్నికల సర్వేలన్నీ బీజేపీ గతంలో మాదిరి తానే అవసరమైన మెజారిటీ తెచ్చుకోలేదు అని తేల్చాయి. చివరి దశ ఎన్నికలు కూడా ముగియక ముందే ఇది బీజేపీకి తొలి ఓటమి. గత ఐదు సంవత్సరాలలో బీజేపీ, దాని నేతలంతా చెప్పిందేమిటి? కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం అనే కదా! రాజస్థాన్, చత్తీస్ఘర్, మధ్యప్రదేశ్లో పదిహేనేండ్లుగా పాతుకు పోయిన బీజేపీని కాంగ్రెస్ పెకలించి వేసింది. ఇది వ్యక్తిగతంగా నరేంద్రమోడీ, బీజేపీకి పెద్ద కుదుపు. బీజేపీ వారసత్వ పాలన గురించి మాట్లాడుతుంది. కాంగ్రెస్లో కంటే బీజేపీలో వారసులు యూరియా, సూపర్ వేసిన పంటలు ఎదిగినట్టుగా ఎదుగుతున్నారు. అలా అతిగా ఎదిగిన పంటలు తుపాన్లు, వరదలకు ఏమాత్రం తట్టుకోలేక కుప్పకూలిపోతాయి. తమను వ్యతిరేకించే వారందరూ పాకిస్థాన్ను సమర్ధించే వారే అనే ఒక కుహనా జాతీయవాదాన్ని రేకెత్తించేందుకు ప్రయత్నించారు. తాము తిరిగి బీజేపీ అధికారానికి రావాలని, మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు, వారు వస్తేనే పాక్-భారత్ చర్చలు ముందుకు సాగుతాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించటంతో బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తోచక గిలగిలలాడిపోతున్నారు. సైన్యాన్ని రాజకీయాల్లోకి తేవద్దని, రాజకీయ నేతలను నివారించాలని వందలాది మంది మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి నివేధించటం బీజేపీని అభిశంచించటం తప్ప మరొకటి కాదు. అయినా తరువాత కూడా ఆ పార్టీ వారు ఏదో ఒక రూపంలో ప్రస్తావన తెస్తూనే వున్నారు. బాలాకోట్ దాడికి ప్రధాని నరేంద్రమోడీయే ఆదేశాలు ఇచ్చారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబితే, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకొనే వారు పుల్వామా మతులకు తమ ఓట్లను అంకితం ఇవ్వాలని నరేంద్రమోడీ చెప్పారు. వీటిని శవరాజకీయాలని ఎవరైనా అంటే తప్పేముంది.
''చౌకీదారు దొంగ అని రాహుల్ గాంధీ అనటానికి కారణం తాను వెనుబడిన తరగతికి చెందిన వాడిని కావటమే'' అని ప్రధాని నరేంద్రమోడీ బీసీ భావోద్వేగాలను రేపేందుకు ప్రయత్నించారు. ఇటీవల మహారాష్ట్రలో ఒక ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ 'కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎన్నోసార్లు నన్ను నిందించాయి, కానీ ఈ సారి మొత్తం వెనుకబడిన తరగతి సామాజిక వర్గం అంతటినీ దొంగలుగా వారు ముద్రవేశారు' అని ఆరోపించారు. ఇటీవలి రాహుల్ గాంధీ కూడా మహారాష్ట్ర ఎన్నికల సభలో మాట్లాడుతూ వాణిజ్యవేత్త నీరవ్ మోడీ, క్రికెట్ నిర్వాహకుడు లలిత్ మోడీ ఇలా దొంగలందరి పేర్లలో మోడీ అని ఉంది, ఇంకా ఎంతమంది అలాంటి వారు బయటకు వస్తారో..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలో కొందరు పేరు చివర రెడ్డి అని పెట్టుకుంటారు. వారిలో అనేక మంది రెడ్డి సామాజిక తరగతికి చెందిన వారు కాదు. గిరిజనులు, వెనుబడిన తరగతులు, కాపులు ఇలా ఎందరో ఉన్నారు. అలాగే మోడీ అని పేరున్న వారందరూ నరేంద్రమోడీ చెప్పినట్టు వెనుకబడిన తరగతులు కాదు, వారందరినీ రాహులు గాంధీ దొంగలూ అనలేదు. లలిత్ మోడీ వైశ్యుడు, నీరవ్ మోడీ జైన్. దేశంలో జైనులను కొన్ని చోట్ల బీసీలుగా పరిగణిస్తే కొన్ని చోట్ల ముందుబడిన తరగతులుగా చూస్తున్నారు. అందువలన నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య వెనుకబడిన తరగతులను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కనిపించటం లేదు. అసలు నరేంద్రమోడీ వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి కాదన్నది ఒక వివాదం ఉంది. అంబానీ, మహాత్మాగాంధీలు జన్మించిన మోధ్ బనియా కులంలో ఒక ఉపకులమైన మోధ్ గంచీకి చెందిన వ్యక్తి అని చెబుతారు. అయితే ఉత్తర భారత్లో నూనె తీసే వత్తి చేసే తేలీలు ఘంచిస్ కులానికి చెందిన వారని మోధ్ గంచీస్ తెలీస్ కాదని చెబుతారు. అందువలన వాటిలోకి పోతే ఒక దగ్గర తేలటం కష్టం. ఓట్ల కోసమే మోడీ కులాన్ని బయటకు తీశారన్నది స్పష్టం.
చివరగా గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ మాట్లాడిందేమిటో ఒకసారి చూద్దాం. 'కాంగ్రెస్లో ఎవరైతే ఒక వితంతువు ఉన్నారో అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఆమె ఖాతాలో జమ చేశారు' అంటే పేరు చెప్పకుండానే సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారన్నది స్పష్టం. రాజకీయాలు ఇంతగా దిగజారిపోయిన తరువాత ఉన్నత పదవుల్లో ఉన్నవారి గురించి చెప్పుకోవాల్సింది ఏముంటుంది. ఎన్నికల సమయంలో తెలుగు రాష్ట్రాలలో చివరి క్షణంలో ఫలానా కులం వారిని ఫలానా అభ్యర్థి చులకనగా మాట్లాడాడు, ఫలనా తిట్లు తిట్టాడు అని పుకార్లు వ్యాపింపచేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన ఉదంతాలు అనేకమున్నాయి. ఇప్పుడు అవి దేశవ్యాపితంగా విస్తరించాయి. ఎంత అభివద్ధో కదా!
- ఎం.కోటేశ్వరరావు
సెల్ : 8331013288