Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్/ పాలిటెక్నిక్/ ఎంబీఏ/ఫార్మసి కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు అన్నీఇన్నీ కావు. ఈ సమస్యల పరిష్కారానికి తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్థాపించబడింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న మొదటి సమస్య జీతభత్యాలు. యూజీసీ వేతన సంఘం అమలుపరిచిన 6వ వేతనం ఇవ్వాలి. కాని ఏ ఒక్క కళాశాలలో కూడా అది అమలు కావడంలేదు. కొన్ని కళాశాలల్లో 6వ వేతనం ఇస్తున్నా, దానిని తిరిగి చెక్కు రూపంలో గానీ, ప్రతక్ష్యంగా గానీ ఇంకా చెప్పాలంటే కాలేజిలోని ఏటీఎం సెంటర్ల ద్వారా తీసి ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే ఉద్యోగం వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఇంకా కొన్ని కాలేజిల్లో అయితే 3 నుంచి 9 నెలలపాటు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆనాడు ఎన్టి.రామరావు ప్రతేక చట్టం తీసుకొచ్చారు. అదే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్-1982. ఇది ఆనాడు అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత, అమలు చేశారు. ఇప్పుడు టీఎస్ ఎడ్యుకేషన్ యాక్ట్-1982. ఇందులో చాప్టర్-14, సెక్షన్-84లో ప్రతి ఉద్యోగికి ప్రతి నెల ఒకటో తేదీన జీతం చెల్లించాలని తెలియజేస్తోంది. కాని అది ఎక్కడా అమలు జరగటం లేదు. దీనిద్వారా ఎంతోమంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదముంది. కాబట్టి తక్షణమే సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి ఉద్యోగులకు మేలు జరిగేలా, ప్రతి నెల జీతాలు ఇచ్చేలా చేయాలి. కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండాని ఏఐసీటీఈ హ్యాండ్ బుక్-2019-20, పేజ్.131, పాయింట్-28ల్లో కచ్చితంగా తెలియజేస్తోంది. కాని ఇప్పుడు ఏ ఒక్క ఉద్యోగికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చెల్లించడం లేదు. కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏ మాత్రం ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఎందుకంటే యాజమాన్యం సిబ్బందిని ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి. కాని ఒక్క ఉద్యోగిని తొలగించాంటే టీఎస్ ఎడ్యుకేషన్ యాక్ట్-1982, చాప్టర్-14, సెక్షన్-79 ప్రకారం టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తద్వారా అతను చేసిన తప్పు ఒప్పులపైన దర్యాప్తు చేసి అతనిపైన వచ్చిన ఆరోపణలు నిరూపణ అయితేనే చర్య తీసుకోవాలి. అదే సమయంలో ఉద్యోగికి రావాల్సిన పారితోషకాన్ని పూర్తిగా చెల్లించాలి. ఈ విధంగా చట్టాలు ఉంటే అది ఎవరూ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు మేలు జరిగేలా, వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మహిళా ఉద్యోగులకు ఉండాల్సిన సెలవు దినాలు ఎక్కడా పాటించడం లేదు. మహిళా ఉద్యోగులకు 6 నెలల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తెలియజేసినా అది ఎక్కడా అమలు కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కామన్ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ ఈ ఉద్యోగులకు కూడా అమలు చేయాలి.
- ఏ.సంతోష్ కుమార్
సెల్ :9618927732