Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో ఇప్పుడు ఇంటర్ బోర్డు వైఫల్యం గురించి చాలా వాడీ వేడిగా చర్చ జరుగుతున్నది. ఈ రోజు సున్న మార్కులు వచ్చినవారికి రీవాల్యువేషన్లో రేపు 100 మార్కులు వస్తున్నాయంటే... ఇది కలయో... వైష్ణవ మాయో...నిజమో, మాయాబజార్ సినిమా తరహా మహత్యమో... అర్థం కావడం లేదు. ఇంటర్ బోర్డు వైఫల్యం వల్ల తెలిసీ తెలియని వయసులో ఉత్సాహంతో ఉరకలేస్తున్న విద్యార్థినీ విద్యార్థులు సరాసరిన 23 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యా వ్యవస్థ ఈ విధంగా అస్తవ్యస్తంగా మారడానికి తిలా పాపం తలా పిడికెడు అనే విధంగా పాలకులతోపాటు అధికారులు, పౌర సమాజం వైఫల్యం కూడా ఉంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో 5 మంది, 10 మంది, 20 మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతుండగా.... వారికి ముగ్గురు నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒక్కొక్క ప్రభుత్వ ఉపాధ్యాయునికి సీనియారిటీ స్థాయిని బట్టి నెలకు 30 వేల నుంచి 70 వేల రూపాయల వరకు ప్రభుత్వం వేతనాలు ఇస్తుంది. కళాశాలల ఉపన్యాసకులకు, ఆచార్యులకు లక్షకు పైబడి జీతాలు చెల్లిస్తున్నారు. ఏటా ఇలా వందలాది కోట్లు ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలకు వెచ్చిస్తున్నప్పటికీ కుప్పలు తెప్పలుగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల వ్యాపారం మరో మాఫియా వ్యాపారంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగుతున్న సరాసరి 20శాతం మందిలో ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలు ఉన్నారంటే.... వీరు నల్లధనంతో ప్రభుత్వాలనే శాసించేవిధంగా ఎదిగిపోయారంటే ఈ దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బయటి ప్రపంచంలో ఏ విధమైన అనైతిక పద్ధతులు, అసాంఘీక శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయో అవి అన్నీ విద్యా వ్యవస్థలోకి ప్రవేశించి మొత్తం వ్యవస్థనే భ్రష్ఠు పట్టించాయి. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఎంసెట్ లీకేజీ పేపర్ కుంభకోణం పెద్ద దుమారం లేపింది. అంతకుముందు ఉమ్మడి ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్రెడ్డి పనిచేసినప్పుడు ప్రైవేట్ రంగంలో అనేకమందికి మెడికల్ డెంటల్ కాలేజీల అనుమతుల కొరకు ఇచ్చిన జీవో కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం లేపింది. 1984లో నెల రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన నాదెండ్ల భాస్కరరావు ఆ నెల రోజుల్లోనే అనేక ఫైళ్ల మీద హడావిడిగా సంతకాలు పెట్టారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు 5 గ్రేస్ మార్కులు వేశారు. అటువంటి ఫైళ్లలో అనుమతి పొందిన అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీరి హయాంలోనే హైదరాబాద్లో ఓవైసీ కుటుంబానికి మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ఫైళ్ల మీద సంతకాల వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారాయనే విషయం గురించి వేరే చెప్పవలసిన పనిలేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నల్లధన ప్రముఖులు విచ్చలవిడిగా రకరకాల ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బ్యాచుల వారీగా ఏయేటికాయేడు పంపించడం కొరకు ఇంచుమించు అన్ని ప్రైవేట్ కళాశాలల్లో లెక్చరర్లే స్వయంగా రాయడమో లేదా రాపించడమో వంటి వికృత చేష్టలతో బహిరంగంగా కాపీని ప్రోత్సహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రెండేళ్ల కిందట తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీకేజీ జరిగింది. ఇప్పుడు పూర్తిగా విద్యావ్యవస్థ మాఫియా వ్యవస్థగా మారిన వైపరీత్య ఫలితమే నేటి ఇంటర్ బోర్డు లీలలు. ఇంటర్ బోర్డు కార్యదర్శి జనార్దన్రెడ్డి ఈ తప్పులు, వైఫల్యాలు ప్రతియేటా జరిగేవే. ఈ సారి మోతాదు పెరిగిందని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో నేటి అస్తవ్యస్త విద్యా విధానాన్ని గాడిన పెట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు అతీతంగా మేధావులు, విద్యార్థులు, యువకులు మరో సామాజిక ఉద్యమానికి నాంది పలకవలసిన సమయం ఆసన్నమైంది.
- తిప్పినేని రామదాసప్ప నాయుడు
సెల్ : 99898 18212