Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి విద్యార్థులు రేపటి పౌరులు. చదువులు చదివి పరీక్షలు రాసి ఎన్నో కలలుకన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదం వల్ల వారి కలలు కల్లలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రంలో సుమారు 23 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు గురయ్యారు. ఇంటర్ ఫలితాలలో ఇంత గందరగోళం జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కొరవడింది. ఒక విద్యార్థినికి 99 మార్కులొచ్చాయి. ఇంటర్ బోర్డు అధికారి సున్నా మార్కులొచ్చాయని ప్రకటించారు. దీని మూలంగా టాపర్గా నిలిచిన విద్యార్థికి తీరని అన్యా యం జరిగింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయి. గ్లోబరీనా అనే ప్రైవేటు సంస్థకు ఈ పని అప్ప జెప్పడంతో ఇలాంటి దుష్పలితాలు వచ్చాయి. తప్పులకు బాధ్యులైన బోర్డు అధికారులను విధుల నుంచి తొలగించాలని, మంత్రి జగదీష్రెడ్డిని బర్తరప్ చేయాలని వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళనలో పాల్గొన్న రాజకీయ పార్టీల, విద్యార్థి సంఘాల నేతల చేతులకు బేడీలు వేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దయనీయంగా మారింది. గ్లోబరీనా సాప్ట్వేర్ రూపకల్పనలో అనేక లోపాలున్నాయని, ఇది సంస్థకే ఎందుకిచ్చారనే అనుమాలు తలెత్తుతున్నాయి. అర్హత లేకున్నా ఎందుకిచ్చారు. సాప్ట్వేర్ డిజైన్ అమలులో పొరపాట్ల వల్ల తప్పులు చోటు చేసుకున్నాయి. దీని వెనుకున్న పెద్ద తలకాయలెవరన్నది ఇప్పటికిప్పుడు తెలియకున్నా రాజకీయ నేతల వత్తిడి వల్లనే గ్లోబరీనాకు కాంట్రాక్టు అప్పజెప్పారన్నది మాత్రం స్పష్టమవుతున్నది. ఇందుకు నిరసన పెల్లుబుకుతున్నా, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా నిరంకుశంగా అణిచివేస్తున్నారే తప్ప జరిగిన ఘోరం పట్ల ప్రభుత్వ స్పందనేది? పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాలను, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకున్న ఈ అనర్థానికి ఎవరిది బాధ్యత? ఇలంటి లోపాలు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి. పాలకులు నిరంకుశంగా మారినప్పుడు ఇలాంటి దౌర్బగ్య పరిస్థితే దాపురిస్తుంది. ఫలితాలు తారుమారుపై వాస్తవాలు వెల్లడించాలి. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వమే విద్యార్థులకు రివాల్యువేషన్ జరిపించాలి. ఇంటర్ ఫలితాలు ప్రక్రియను ప్రైవేటు ఏజెన్సీకి అప్పజెప్పడంపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి. గ్లోబరీనా సంస్థ ముఖ్యమంత్రి సమీప బంధువుదని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో యువరాజా వారి జోక్య ముందని తెలుస్తోంది. అయినా ఇంటర్ బోర్డు వద్ద బోర్డు అధికారులు ఉండాల్సింది పోయి పోలీసులను దింపి ఆందోళన కారుల్ని, విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబుదారీ తనంగా ఉండాల్సిందిపోయి అణచివేతలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, ప్రొ||నాగేశ్వర్, విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్టు చేయడం తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తుంది. శ్రీచైతన్య, నారాయణ కళాశాలలు ప్రతి యేటా రెండు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయి. విద్య పూర్తిగా వ్యాపారమైంది. కార్పొరేట్ కళాశాలల్లో ఎన్నో దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. గ్లోబరీనా సంస్థకు రూ.36కోట్ల కాంట్రాక్టు కేటాయించడంపై భారీ అవినీతినే సూచిస్తున్నది. గ్లోబరీనా సంస్థపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అర్హత లేకున్నా ఈ ప్రాజెక్టును వారికే కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా న్యాయం జరుగుతుందని భావించలేం. ఇది కాలయాపన చేయడమే అవుతుందనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం తన తప్పు ను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేయడం సహజమైపోయింది. ఇప్పటికైనా సాకులు మాని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ అనర్థానికి బాధ్యులను శిక్షించి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి.
- దామరపల్లి నర్సింహ్మారెడ్డి