Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో శ్రమ ప్రతిఫలం దక్కని చివరి మనుషులు మహిళలే. నాగేటి సాలులో విత్తనాలై రాలుతారే తప్ప వారి చరిత్రలు మాత్రం పెద్దగా మొలకెత్తలేదు. వంటగదిలోనే మూగరోదన ఇంకెన్నాళ్లు? ఇది కూడా జీవితమా? కాదు కాకూడదంటూ మండుతున్న కొరకాసు చేతిలో పట్టుకొని బయలుదేరిన మహిళ ''లాంగ్మార్చ్''కు వెలుగునిచ్చింది. ఒలికిన చెమట చుక్క, కారిన కన్నీళ్లు, రాలిన నెత్తురుకు చరిత్రలో చోటులేదు. చరిత్రలో ఇంత వివక్ష ఉంటే మహిళల స్థితి ఇంకెంత ఘోరంగా ఉండిందో ఊహించవచ్చు. ఈ స్థితిని ఎదిరించి ప్రతిభావంతంగా రాణించిన ధీశాలి సంగం లక్ష్మిబాయమ్మ. సాయుధ పోరాటానికి అండగా నిలిచింది. స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళలను ముందుండి నడిపించిన ధీరవనిత. సామాజిక సేవకే పూర్తికాలం వెచ్చించిన మానవతా మూర్తి. బాలికలు, స్త్రీ సంరక్షణకు అలుపెరగక కృషి చేసిన ఆత్మ బంధువు. తెల్ల ఖద్దరు మాత్రమే జీవితాంతం ధరించి వీసమెత్తు బంగారం కూడా సంపాదించకుండా రాజకీయ విలువలను పెంచిన మహిళా మాణిక్యం. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళ.
ఆమె పుట్టింది రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు కూతవేటు దూరంలో ఉన్న కొర్రెముల గ్రామం. తల్లిదండులు సీతమ్మ దొంతల రామయ్యలకు 1911 జూలై 27న గొర్రెలకాపరుల కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే దుర్గాప్రసాద్తో వివాహమైంది. బాల్యంలోనే భర్త, తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె అనాధ అయ్యింది. మొదటి నుండి చాలా చురుకైన అమ్మాయి కావడంతో మాడపాటి హనుమంతరావు దృష్టికి వచ్చి గుంటూరులోని శారదా నికేతన్లో చదివించాలన్న ఆయన సలహాతో 1926లో లక్ష్మిబాయిని అక్కడ చేర్పించారు. 1927లో విద్వాన్ పాస్ అయిన ఆమె ఎనిమిదేండ్లు అక్కడే ఉండి హిందీలో సాహితీ, విదూషీ, డిగ్రీలు తీసుకున్నారు. ఆ తర్వాత మద్రాసు ఆంధ్రా మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. అక్కడ ఉన్నత చదువుల అనంతరం, తిరిగి హైదరాబాద్కు చేరుకుంది. నారాయణగూడలో ఉన్న రాజా బహదూర్, వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజీ హాస్టల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఎంతో మంది మహిళలను ఉద్యమాల్లో భాగస్వాములను చేసింది.
మాతృభూమి విముక్తి కోసం తాను సైతం అంటూ ముందుకొచ్చారు. సైమన్ కమిషన్ గోబ్యాక్ అంటూ ఉద్యమించారు. 1930లో గాంధీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఊరూర తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. కల్లు, సారా, విదేశీ వస్త్ర దుకాణాల ఎదుట సత్యాగ్రహ దీక్షలు చేసి ఎన్నో సార్లు అరెస్టు అయ్యారు. జైలులో ఉండి కూడా ఉద్యమాలు నిర్వహించారు. జైలులో ఖైదీలకు స్వాతంత్య్ర కాంక్ష బోధించారు. మహిళల కోసం జైలులో ప్రత్యేక గదులు కట్టాలని పోరాడారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. 1933లో మద్రాసు వెళ్లిన లక్ష్మిబాయి చిత్ర కళలో డిప్లామా పొందారు. ఐదేండ్లు అక్కడే ఉన్న ఆమె 1938లో హైదరాబాద్కు వచ్చి గుల్బర్గా బాలికల స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేరారు. ఆ సమయంలోనే రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజీ హాస్టల్ గౌరవ వార్డెన్గా పని చేశారు. కొంతకాలం తర్వాత ఉద్యోగాన్ని వదిలి నిజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటానికి సహకరించారు.
ఆమె తెగువ, ఆమె సేవ ఆమెకే సొంతం. షహీద్ షోయబుల్లాఖాన్ను రజాకార్లు చంపినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను పలకరించడానికి ప్రజలు భయపడుతున్న సమయంలో లక్ష్మిబాయి షోయబ్ ఇంటికెళ్లి అతడి కుటుంబాన్ని ఓదార్చడంతోపాటు ఆర్థిక సహాయం చేశారు. దేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత లక్ష్మిబాయి తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. 1952లో సంతోష్నగర్ చౌరస్తాలో రెండెకరాల్లో ఉన్న సొంత ఇంటిలో స్త్రీ సేవాసదన్ను ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని ఐఎస్ సదన్ అని పిలుస్తున్నారు. మొదటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణ అంతటా పర్యటించారు. 1952లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్లో డిప్యూటీ విద్యా శాఖ మంత్రిగా 1954 నుంచి 56 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంత్రిగా ఆమెకు వచ్చిన గౌరవ వేతనంలోని ప్రతి పైసా స్త్రీ సేవా సదన్కు ఉపయోగించారు. 1955లో దాన్ని తన సహచరులైన కేవీ రంగారెడ్డి, ఎ. శ్యామలాదేవి, పి.లలితాదేవీ, పాశం పాపయ్య, ఎం భోజ్రెడ్డితో కలిసి సేవా సదన్గా రిజిస్టర్ చేయించారు. అనాధ మహిళలు, శివువులకు ఉచిత విద్యా వసతి కల్పించారు. మంత్రివర్గంలో ఆనాడు ఏకైక మహిళా మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మహిళల సమస్యలపై అటు గోలకొండ పత్రికలోనూ గృహలక్ష్మి పత్రికలోనూ విరివిగా వ్యాసాలను వెలువరించారు. ఆ తర్వాత 1957 నుంచి మూడు పర్యాయాలు అసెంబ్లీకి 1972లో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్లో పీడిత ప్రజల పక్షాన గొంతును వినిపించారు. బాల్యంలోనే భర్త తల్లిదండ్రులు చనిపోవడంతో తన మేనమామ సంగం సీతారామయ్య యాదవ్ ఆమెను చేరదీసి విద్యాబుద్దలు నేర్పించాడు. మొదట్లో లక్ష్మిబాయికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్తెమ్మ. స్కూల్ రికార్డుల్లో మేనమామ ఆమె ఇంటిపేరు సంగం అని రాయించడంతో సంగం లక్ష్మిబాయిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ సలహా బోర్డు కోశాధికారిగా మహిళా సంఘం కన్వీనర్గా సమర్థవంతంగా పని చేశారు. మహిళాభ్యుదయం, సమస్యలపై రేడియో వేదికలపై చేసిన ప్రసంగాలు ''నా అనుభవాలు'' పేరుతో పుస్తకం వెలువరించారు. ఎప్పుడు ఖద్దర్ చీర తప్ప వంటిపై గుంజెత్తు బంగారం కూడా ధరించలేదు. 1972లో మహిళ ఈవినింగ్ కాలేజీ నడిపి ఎందరో విద్యార్థినులకు బంగారు బాట చూపించారు. 1979 జూన్ 3వ తేదీన క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఆమె కోరిక మేరకు సదన్లోనే అంత్యక్రియలు చేశారు. ఆమె చనిపోయిన తర్వాత సేవ సదన్ మూత పడింది. ఆమె ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఆమె రాసిన పుస్తకాలు, సాహిత్యం వెలుగులోకి తేవాలి. ఆమెకు సముచిత స్థానం దక్కేలా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343