Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇండియా టుడే' ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో ''ఆధ్యాత్మికత'' అనే అంశంపై ప్రఖ్యాత హిందీ, ఉర్దూ కవి జావేద్ అఖ్తర్ ప్రసంగం సంక్షిప్త పాఠం.
నన్నిక్కడ ఆధ్యాత్మికత గురించి మాట్లాడడానికి ఆహ్వానించారు. అయితే ఈ ఆధ్యాత్మికత అనే మాటతో మనం గందరగోళానికి గురికావద్దు. ఎందుకంటే,ఒకే పేరు గల ఇద్దరు మనుషులూ ఉండవచ్చు,ఆ ఇద్దరూ పూర్తిగా భిన్నమైన మనుషులూ కావచ్చు. రామచరిత మానస్ అనే గ్రంథాన్ని తులసిదాస్ రాశాడు. రామాయణం ఆధారంగా రామానందసాగర్ ఒక టెలివిజన్ చిత్రం తయారు చేశాడు. రెండిటికీ రామాయణమే మూలం. కానీ,తులసిదాస్నూ, రామానందసాగర్నూ సమానంగా చూడడం అంత ఉచితమని నేను అనుకోను. రామచరిత మానస్ రాసినప్పుడు తులసిదాస్పై సాంఘిక బహిష్కరణ విధించారు. అంత పవిత్రమైన గ్రంథాన్ని అవధీ లాంటి మామూలు ప్రజల భాషలో రాసి అవమానిస్తాడా అని ఆయన మీద విరుచుకుపడ్డారు. మతఛాందస వాదులు ఏ మాటలు మాట్లాడినా,ఏ రంగులో ఉన్నా, ఏ మతానికి చెందినా, ఏ సమూహానికి చెందినా అంతా ఒక్కలాగే ఉండడం చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. 1789లో షా అబ్దుల్ ఖాదర్ అనే ఒక పెద్ద మనిషి ఈ నగరం(ఢిల్లీ)లోనే మొట్టమొదటి సారి ఖురాన్ను ఉర్దూలోకి అనువాదం చేశాడు. ఆ కాలంలో అధికారం చెలాయిస్తున్న ఉలేమాలందరూ ఆయన మీద ఫత్వా విడుదల చేశారు. పవిత్ర గ్రంథాన్ని అలగా జనం భాషలోకి అనువాదం చేయడం దైవ ద్రోహం అన్నారు. రామచరిత మానస్ రాసి బహిష్కరణకు గురయ్యాడు తులసీదాస్. మరొక వైపు రామాయణ టెలివిజన్ సీరియల్ తయారు చేసి రామానంద్ సాగర్ కోట్ల రూపాయలు ఆర్జించాడు. నేనేమీ ఆయనను చిన్నబుచ్చడం లేదు. కానీ, ఈ మొత్తంలో ఆయన అట్టడుగు స్థాయిలో ఉన్నాడని మాత్రం చెప్పక తప్పదు.
మరొక ఉదాహరణ చెప్తాను. బహుశా అది మరింత ప్రత్యక్షమైనదీ, మరింత ఉచితమైనదీ కావచ్చు. గౌతముడు రాజాంతపురాన్ని వదిలి అడవిలోకి వెళ్ళింది సత్యాన్ని అన్వేషించడానికి. కానీ ఇవాల్టి రోజుల్లో మీరు చూస్తే ఈ ఆధునిక కాలపు గురువులు అడవుల్లో నుంచి బయటకు వచ్చి రాజప్రాసాదలలో చేరిపోతున్నారు.వీళ్ళు పూర్తిగా ప్రతికూల దిశలో నడుస్తున్నారు. కనుక గౌతముడు గురించీ, వీళ్ళ గురించీ ఒకేలాగా మాట్లాడలేం.
కనుక ఇక్కడ ఇవాళ ప్రపంచపు సూపర్ మార్కెట్లో ఒక అమ్మకపు వస్తువుగా మారిపోయిన ఆధ్యాత్మికత గురించి మాట్లాడడానికే నేనిక్కడ నిలబడ్డానని స్పష్టం చేయదలిచాను. ఇవాళ ప్రపంచంలో మూడు పెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయి. యుద్ధ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, ఆధ్యాత్మికత. అయితే ఆయుధాలలోనూ, మాదక ద్రవ్యాలలోనూ మీరు ఎంతో కొంత చేయాలి. ఏదో ఒకటి ఇవ్వాలి. ఆధ్యాత్మికతలో మాత్రం మీరేమీ ఇవ్వనక్కరలేదు.
ఈ సూపర్ మార్కెట్లో మీకు అడిగిన వెంటనే నిర్వాణం దొరుకుతుంది.మెయిల్ లో మీకు మోక్షం చేరుతుంది. ఆత్మ సాక్షాత్కారంలో క్రాష్ కోర్సు ఉంటుంది. నాలుగు సులభ పాఠాలలో విశ్వచైతన్యం అందుతుంది. ఈ సూపర్ మార్కెట్కు ప్రపంచ వ్యాప్తంగా గొలుసు దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాలలో అశాంతి నిండిన ఉన్నత వర్గాలూ, సంపన్న వర్గాలూ ఆధ్యాత్మికత ఫాస్ట్ ఫుడ్ కొనుక్కుని తింటూనే ఉంటాయి. నేనిప్పుడు ఈ ఆధ్యాత్మికత గురించి మాట్లాడదలిచాను.
ప్లేటో సంభాషణల్లో ఆయన చాలా విలువైన విషయాలు ఎన్నో చెప్పాడు. వాటిలో ఒకటి ఏమంటే, 'మీరు ఏదైనా చర్చ ప్రారంభించే ముందు మీరు వాడుతున్న పదాల అర్థం ఏమిటో నిర్ణయించుకోండి' అని. మరి మనం కూడా ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత అనే పదం అర్థం ఏమిటో నిర్ణయించుకుందాం. ఆ పదానికి అన్ని మతాలనూ, కులాలనూ, ముఠాలనూ, జాతులనూ అధిగమించి సంపూర్ణంగా మానవజాతి పట్ల ప్రేమ అనే అర్థం ఉంటుందా? అలా ఉంటే నాకేమీ సమస్య లేదు. కాకపోతే, దాన్ని నేను ఆథ్యాత్మికతా అనే బదులు మానవత అంటాను. లేదా, దానికి అర్థం మొక్కలనూ,చెట్లనూ, కొండలనూ, సముద్రాలనూ,నదులనూ, జంతువులనూ ప్రేమగా చూడడం అనా? అంటే, మానవేతర ప్రపంచం పట్ల దయ కలిగి ఉండడమనా? ఒకవేళ అదయినా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే దాన్ని నేను ఆధ్యాత్మికత అనను. పర్యావరణ స్పహ అంటాను. లేదా, వివాహం , మాతత్వం, పితత్వం, లలిత కళలు, న్యాయవ్యవస్థ, భావప్రకటనా స్వేచ్ఛ వంటి సామాజిక సంస్థలను హదయపూర్వకంగా గౌరవించడమే ఆధ్యాత్మికత అనే మాటకు అర్థమా? అయ్యా, అప్పుడు కూడా నాకేమీ సమస్య లేదు. అసలు నాకు అనంగీకారం తెలిపే అవకాశమే లేదు. కానీ, నేను దాన్ని పౌర బాధ్యత అంటాను. లేదూ ఆధ్యాత్మికత అంటే మీ లోకంలోకి మీరు వెళ్ళిపోయి,మీ సొంత జీవితపు అర్థం ఏమిటో అన్వేషించే ప్రయత్నం చేయడమా? దానికి ఎవరు అడ్డు చెపుతారు? కానీ దాన్ని నేను ఆత్మపరిశీలన, ఆత్మ పరీక్ష అనుకుంటాను.లేదూ ఆధ్యాత్మికత అంటే యోగం అని అర్థం చెపుతున్నారా? ప్రాణాయామం చేస్తే చాలా బాగుంటుంది. దాన్ని నేను ఆరోగ్య పరిరక్షణ, శారీరక దఢత్వం అంటాను.
ఇదంతా పదాల గారడీగా కనిపిస్తుందా? నేను వాడిన పదలూ,అర్థాలూ అన్నీ కూడా సంపూర్ణంగా గౌరవించదగినవి. ఆమోదించదగినవి. వాటిలో అమూర్తమైనదేదీ లేదు. మన చూపులకు అందనిదేది లేదు. మరి ఆధ్యాత్మికత అనే మాట పట్టుకుని ఎందుకంతగా వేళ్ళాడుతున్నారు?నేను చెప్పిన మాటలలో వ్యక్తం కాని ఏ భావాన్ని ఈ ఆధ్యాత్మికత అనే మాట సూచిస్తోంది? నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా ఉందా? ఉన్నట్టయితే అది ఏమిటి?
పూనాలో ఒక ఆశ్రమం ఉంది. నేను అక్కడికి వెళుతూ ఉండేవాణ్ణి. ఎందుకంటే,అక్కడ మాట్లాడేవాళ్ళు మంచి వక్తలు. ఆ సమావేశ మందిరం ద్వారం దగ్గర ఒక హెచ్చరిక రాసి ఉండేది. '' మీ చెప్పులూ,మనస్సూ ఇక్కడ వదిలేసి వెళ్లండి'' అని. అయితే ఇటీవల కొందరు గురువులు మీరు చేప్పులతో వచ్చినా అంగీకారిస్తున్నారు. కానీ,మనస్సులతో రావడానికి మాత్రం ఎంతమాత్రం వీల్లేదు.
మరి, మీరు మనస్సును వదిలేస్తే ఏం చేస్తారన్నమాట? అప్పుడిక చైతన్యంలో మరొక అడుగు ముందుకు వేయడానికి మీకొక గురువు అవసరం అవుతాడు. ఆ చైతన్యపు మరొక మెట్టు ఆత్మలో దాగి ఉంటుంది. ఈ గురువుగారు ఉన్నత చైతన్యం సాధించారు. ఆయనకు అత్యున్నత సత్యం తెలుసును. కానీ, ఆయన అది మీకు వెంటనే చెప్పలేరు. పోనీ మీ అంతట మీరు ఆ మెట్టు ఎక్కి అది అందుకోగలరా? లేదండి. ఆ పని చేయడానికి మీకు గురువు సహాయం అవసరం అవుతుంది. మీకు ఆయన కావలసిందే. అయినా మీరు అంతిమ సత్యాన్ని అందుకోగలరని ఆయన హామీ ఇవ్వలేడు....సరే, ఇంతకీ ఆ అంతిమ సత్యం అనేది ఏమిటి? విశ్వ సత్యం అనేది ఏమిటి? నాకు అదేమీ అంతుపట్టదు.
మతాధిపతులకు రక్షణ కవచంగానే ఈ ఆధ్యాత్మికత అనేది పనికొస్తుందని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే, సాంప్రదాయక మతాన్ని నమ్మేవారు, ఆధ్యాత్మికతను నమ్మేవారు పూర్తిగా వేరు వేరు. ఒకసారి ప్రపంచ పటాన్ని తీసుకోండి. అతి ఎక్కువగా మతం ప్రభావం ఉన్న ప్రాంతాలు గుర్తిస్తూ పోండి. భారతదేశంలో గానీ, భారతదేశానికి బయటగానీ ఆసియాలో, లాటిన్ అమెరికాలో,యూరప్లో ఎక్కడైనా...ఎక్కడెక్కడ అయితే మత ప్రభావం ఎక్కువ ఉందో, అక్కడల్లా మానవ హక్కులు కొరవడుతున్నాయని మీరు గుర్తించగలరు. అక్కడంతా అణచివేత ఉంది. మతం అంటే పేద ప్రజల పాలిట మత్తు మందూ అనీ, అణగారిన ప్రజల నిట్టూర్పు అనీ మన మార్క్సిస్టు సన్నిహితులు అంటూ ఉండేవాళ్ళు. నేనిప్పుడు ఆ చర్చలోకి వెళ్లను గానీ, ఇవాళ మాత్రం ఆధ్యాత్మికత అనేది తప్పనిసరిగా ధనికులు వినియోగిస్తున్న ఒక మాదక పదార్థం. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికతను నమ్మే సమూహం అంతా ఒక సంపన్నవర్గం మాత్రమే. గురువుగారికి అధికారం వస్తుంది, చాలా గౌరవం దక్కుతుంది, హౌదా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది (అది ముఖ్యం కాదని వాళ్ళంటారనుకోండి) మొత్తం మీద అధికారమూ, సంపద దక్కుతాయి. మరి శిష్యుడికి ఏం దొరుకుతుంది? చాలా మంది శిష్యులను నేను జాగ్రత్తగా గమనించాను. ఈ శిష్యులలో వేరు వేరు రకాల వారున్నారు. అందరూ ఒక్కలాంటి వాళ్ళు కారు. విభిన్నమైన సమూహాల అనుయాయులు ఉన్నారు. విభిన్న తరహాల శిష్యులు ఉన్నారు. ఒక శిష్యుడు ధనవంతుడు. విపరీతంగా ఆస్తి పోగేస్తున్నవాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి కనుక ఇక ముక్తి కావాలి. అందువల్ల గురువుగారు ఏం చెపుతారంటే, నువ్వు ఏం చేస్తున్నా సరే అదంతా నిష్కామకర్మ .నువ్వు కేవలం నీ పాత్ర పోషిస్తున్నావు. ఇదంతా మాయ. నువ్వు రోజు రోజూ పోగుచేసుకుంటున్న డబ్బు, నువ్వు కూడబెడుతున్న ఆస్తి ఇదంతా మాయ. దీనంతటితోనూ నీకు ఉద్వేగపూరితమైన సంబంధమేమి లేదు. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి. నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావో తెలుసునా? నువ్వు ఇక శాశ్వత సత్యపు అన్వేషణలో ఉన్నావు. నీ చేతి నిండా మురికి ఉంటే ఉండవచ్చు. కానీ, నీ ఆత్మ, అంతరాత్మ పరిశుద్ధమైనది. ఈ మాటలతో ఈ శిష్యుడు తన గురించి తాను పొంగిపోతూ ఉంటాడు. అద్భుతమైన మనిషినని అనుకుంటాడు. వరుసగా ఏడు రోజుల పాటు ప్రపంచాన్ని దోపిడీ చేసి, ఏడో రోజు చివరన వెళ్లి గురువు పాదాల దగ్గర కూచుని 'అబ్బా, నేనెంత సున్నితమైన వ్యక్తిని' అని అనుభూతి పొందుతాడు.
ఇంకొక రకం ఉన్నారు. నేను వీళ్ళ గురించి వ్యతిరేకతతో, లేదా, చిన్నచూపుతో, లేదా, కరకుగా మాట్లాడడం లేదు. వాళ్ళ పట్ల పూర్తి సానుభూతితోనే మాట్లాడుతున్నాను. ఈ ఆధునిక కాలపు ఆధ్యాత్మికత గురువులకు వీరు అతిపెద్ద విశ్వాసనీయమైన సమూహం. వాళ్ళే అసంత ప్త జీవులైన సంపన్నుల భార్యలు.
ఆమె ఒక సంపూర్ణ వ్యక్తి. ఆమె తన వ్యక్తిత్వాన్నీ, కలలనూ, కో రికలనూ, తన సమస్త జీవితాన్నీ వివాహం అనే వేదిక మీద బలిపె ట్టింది. అందుకు ప్రతిఫలంగా అమెకు దక్కినది ఆమెను ఎంత మా త్రం పట్టించుకోని భర్త. ఆ భర్త ఆమెకు ఎక్కువలో ఎక్కువ ఇద్దరు ముగ్గురు పిల్లలను ఇస్తాడు. అంతే.ఆయనకు ఆయన వ్యాపారాలలో, లేదా ఇతర స్త్రీలతో గడపడంలో క్షణం తీరిక ఉండదు. ఈ స్త్రీకి తలవాల్చి ఏడవడానికి ఒక భుజం కావాలి. తన మనుగడ అంతా ఒక నిష్ప్రయోజక అస్తిత్వమని భావిస్తూ ఉంటుంది. ఆమెకు ఎటు చూసినా వెలుగు లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ జీవితానికి అర్ధం లేదు. ఇదంతా విషాదకరం. కానీ, అక్షరాలా వాస్తవం.
మరొక రకం శిష్యులు ఉన్నారు. వాళ్ళకు హఠాత్తుగా ఏదో విపత్తు వస్తుంది. అనూహ్యంగా కన్నబిడ్డ చనిపోతాడు. భార్య మరణిస్తుంది. భర్త మరణిస్తాడు. లేదా వాళ్ళు ఆస్తి కోల్పోతారు. వ్యాపారంలో విపరీతంగా నష్టం వస్తుంది. ఏదో ఒకటి జరిగి వాళ్ళ జీవితాలు కుదుపుకు గురవుతాయి. వాళ్ళ ముందర ఒకే ఒక ప్రశ్న లేచి నిలబడుతుంది. ఇది మాకే ఎందుకు జరగాలి? ఈ ప్రశ్నను వారు ఎవరికి వేయాలి? వారు వెంటనే గురువు దగ్గరకు వెళతారు. ఇదంతా కర్మ ఫలితం నాయనా అని చెపుతారు గురువుగారు. కానీ నా వెంట నడువు. నీకు మరో లోకం ఉంది అని విశ్వాసం ఇస్తారు. ఆ లోకంలో బాధ లేదు,వేదన లేదు, మరణం లేదు. అక్కడకు చేరావంటే అది అమరలోకం. అక్కడ ఆనందం మాత్రమే ఉంది. ద్ణుఖం నిండిన ఈ మనుషులకు గురువు గారు ఈ మాటలు చెప్పి ఓదారుస్తారు.
మరి, వాళ్ళకు అలా శాంతి దొరుకుతున్నప్పడు నీ అభ్యంతరం ఏమిటి అని ఎవరైనా నన్ను అడగొచ్చు. మాదకద్రవ్యాలు, మద్యం కూడా మానసిక శాంతినీ, ఉపశమనాన్ని ఇస్తాయని చెపుతారు. కానీ అటువంటి శాంతిని, అటువంటి ఉపశమనాన్ని కోరడం మంచిదేనా? ఎవరికైనా అది మనం సిఫారసు చేస్తామా? కచ్చితంగా చేయం. హేతుబద్ధమైన ఆలోచనలలో నుంచి పుట్టి పెరగని మానసిక శాంతి ఏదైనా ఆత్మవంచన తప్ప మరోకటి కాదు. సత్యం నుంచి దూరం తీసుకుపోయే ఉపశమనం ఏదైనా ఒక భ్రమ మాత్రమే.మనిషి అబద్ధంలో బతకడంకంటే ఆత్మ వంచన మరొకటుంటుందా?
ఇంకొక రకం కూడా ఉన్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, గోల్ఫ్ క్లబ్ సభ్యులైన వారందరికీ గోల్ఫ్ మీద పెద్ద ఆసక్తి లేనట్టుగానే ఆశ్రమంలో కనబడే ప్రతి ఒక్కరూ ఆథ్యాత్మిక వ్యక్తి కానక్కర్లేదు. నాకు తెలిసిన ఒక సినిమా నిర్మాత ఉన్నారు. ఆ నిర్మాత నన్ను ఒకసారి వాళ్ళ గురువు దగ్గరకు వెళ్ళమని అడిగారు. ఆశ్రమానికి వెళ్ళావంటే ఢిల్లీలోని ప్రముఖులందరూ నీకక్కడే కనబడతారు. నీకు తెలుసా మా గురూజీ కాబోయే చంద్రస్వామి. చూస్తూండు. అన్నాడాయన. అంటే, ఇవాళ ఆధునిక గురువుల ఆథ్యాత్మిక ఆశ్రమాలు పైరవీలకూ, పనులకు పరిచయ స్థానాలు అయ్యాయి.
మతానికి చెందిన మనుషులు పట్ల ఇటువంటి భావాలు ఉన్నప్పుడు నాకు కాబీర్ మీదనో, గౌతముడి మీదనో అంత గౌరవం ఎలా ఉందని మీరు అడగవచ్చు. వాళ్ళను నేనెందుకు గౌరవిస్తానో చెపుతాను. వాళ్ళందరూ మానవ నాగరికతా చరిత్రలో గొప్ప దోహదం చేసినవాళ్ళు. చరిత్రలో వేరు వేరు కాలాల్లో, వేరు వేరు పరిస్థితులలో వాళ్ళు జీవించారు. వాళ్ళందరి మధ్య ఒకే ఉమ్మడి సూత్రం ఉంది. వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.వాళ్ళు అట్టడుగు ప్రజల కోసం పోరాడారు. పాలకులు ఎవరైనా వారు చక్రవర్తులైనా, సామ్రాజ్యవాదులైనా వ్యతిరేకంగా పోరాడారు.కబీర్ ఫిరోజ్ తుగ్లక్ మతోన్మాద రాజ్య ఆధిపత్యాన్ని ఎదుర్కొని పోరాడాడు. నాకు ఆశ్చర్యం కలిగించేదీ, నా అనుమానాలను నిజం చేసేది ఏమంటే ఇవాళ మాత్రం తమను తాము మతాధిపతులమని చెప్పుకునే వాళ్ళు, విశ్వసత్యం తమకు మాత్రమే గ్రహింపుకు వచ్చిందని అనేవాళ్ళు ఒక్కరు కూడా అధికారానికి వ్యతిరేకంగా నిలబడడం లేదు. పాలకవర్గాలకూ, సంపన్న వర్గాలకూ వ్యతిరేకంగా వీళ్లలో ఒక్కరు కూడా గొంతెత్తడం లేదు. వీళ్ళు ధర్మం చేస్తారు. నిజమే. కానీ,అధిపత్య వ్యవస్థా, అధికారంలో ఉన్నవారు అంగీకరించినంత వరకే ఆ ధర్మం సాగుతుంది. ఇవాళ్టికి దళితులకు ప్రవేశం లేని దేవాలయాలలోకి వారిని నడిపించుకు వెళ్ళగలిగిన ఆథ్యాత్మిక గురువులు ఎవరైనా ఉన్నారా అని నా ప్రశ్న. దురాక్రమణదారులకూ,బడా కాంట్రాక్టర్లకూ వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసుల హక్కుల కొరకు నిలబడే ఆథ్యాత్మిక గురువులు ఎవరైనా ఉన్నారా అని నా ప్రశ్న. గుజరాత్ మారణకాండకు బలి అయిన వారికోసం మాట్లాడిన, బాధితుల సహాయ శిబిరానికి వెళ్ళిన గురువు ఎవరైనా ఉన్నారా అని నా ప్రశ్న.
ధనికులకు ఉఛ్వానిశ్వాసలు బోధించినంత మాత్రాన సరిపోదు. అది కేవలం సంపన్నుల వినోద క్రీడ. ఇది కుటిలవాదుల మేలి ముసుగు. ఇది దుర్మార్గమైన వంచన. ఈ దుర్మార్గమైన వంచనను మీరు ఏ నిఘంటువులో చూసినా ఆధ్యాత్మికత అని పిలవలేరు. దానికి ఉన్నది ఒకే ఒక్క మాట బూటకం.
- జావేద్ అఖ్తర్
అనువాదం : మలసాని శ్రీనివాస్