Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్యావరణం పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని పర్యావరణ సమతుల్యతకు మానవ మాత్రుడు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేవీ? ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు అత్యధికంగా చర్యలు తీసుకుంటున్న దేశాలు, రాష్ట్రాలేవీ? మరీ ముఖ్యంగా పంచ భూతాలను దేవుండ్లుగా పూజించే భారతదేశంలోని ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవీ... భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం ఈ ఐదింటిని దైవ సంకల్పమని దేవుడు మానవుని కోసమే వీటి ద్వారా వస్తాడని నమ్మేవారు ఉన్నారు. అటువంటి భావన ఉన్న సనాతన భూమి, భారతావనిలో అత్యధిక పర్యావరణ కాలుష్యం జరుగుతోంది. దీనికి కారణమేమిటని ప్రశ్నించుకుంటే వచ్చే మొదటి సమాధానం రాజకీయ కాలుష్యమేనని చిన్న పిల్లవాడు సైతం చెబుతాడు.
నేడు పర్యావరణ కాలుష్యం అత్యధికంగా జరుగుతోంది భారతదేశంలోనే అని చెప్పడానికి వంద కారణాలున్నాయి. కాని వాటిని నిలువరించడానికి పౌరసమాజం నుంచి సమరశీల ఉద్యమాలు చేసే నాయకులు కనీసం కార్యకర్తలు ఏకతాటి మీదకు రావడం లేదు. ఇంతింతై వటుడింతై.. అన్నట్టుగా.. నేడు రాజకీయ కాలుష్యం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగబాకింది. ఓ నాయకుడు యమునా నదీ తీరంలో సమావేశం పెడతానని చెబితే.. అక్కడ సమావేశాలు జరిపితే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ చెప్పింది. కాని అదే సమావేశాలకు ప్రధానమంత్రి వస్తే హరిత ట్రిబ్యునల్ మాత్రం ఏం చేయగలదు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని జుట్టు పట్టుకుని కొట్టిన ఎమ్మెల్యేను వెనుక వేసుకొచ్చిన సీఎంను, ప్రశ్నించిన ప్రజా మీకు కనబడరు.. కిరోసిన్ మాఫియాను అడ్డుకున్న ఐపీఎస్ అధికారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వార్త పట్ల ప్రజాస్పందన కనబడదు.
నేడు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు, పర్యావరణ సమతుల్యత పాటిస్తున్నాయా అని ప్రశ్నించే సభ్యసమాజామెక్కడ.. ఉంది? తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా అనుమతి లేని ఇసుక తవ్వకాలు ఇంకా రకరకాల మాఫీయాలను అధికార, ప్రతిపక్ష పార్టీలలోని కొంతమంది నాయకులే పెట్టి పోషిస్తున్నారని ఆరోపణులున్నాయి. కాని నిరూపన సాధ్యం కాదు. విధానపరంగా కూడా తప్పిదాలున్నాయి. హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి మాట్లాడే.. ఏపీ సీఎం.. పర్యావరణం బాగుండాలంటే ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని తెలియదా? తెలంగాణ సీఎం మిషన్ కాకతీయ గురించి పదేపదే మాట్లాడుతూ.. అదో అద్భుతమని చెబుతారు. నిజమే కాని.. క్షేత్రస్థాయిలో పరిశీలనలో ఏం తేలుతోంది. వానపడితే కాని నీళ్లు రావు, చెరువులు నిండవు. కోట్లు ఖర్చుపెట్టి చెరువుల పూడికలు తీసేకన్న.. రూపాయి ఖర్చు పెట్టకుండా అక్రమ ఇసుక తవ్వకాలను నిలువరిస్తే బాగుంటుంది కదా..!
ప్రపంచ గురువు భారత్.. ప్రత్యామ్నాయ విధానాల కోసం పరితపించాల్సిన అవసరముంది. వీటన్నింటి గురించి ప్రజలు అవగాహన చేసుకుని, ప్రజలు, సభ్య సమాజం సమరశీల పోరాటాల వైపు కదిలి ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలు తలొగ్గుతాయి. ప్రశ్నించే ప్రజా.. ప్రస్తుత అవసరం.
- అంబీర్ శ్రీకాంత్
సెల్: 81859 68059