Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజనీతిజ్ఞుడు పరిపాలకుడు కావాలంటాడు-ప్లేటో. కానీ రాజనీతిజ్ఞుడు కాకున్నా పర్వాలేదు, కనీస మానవీయ స్పందనలున్న మనిషి అయితే చాలు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు దారుణమైన పొరపాటు చేశారని చెప్పవచ్చు. దాదాపు ఐదేండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రస్థానంలో కనీస మానవీయ స్పందనలకు బహుదూరంగా తెలంగాణ పాలకులు వ్యవహరించారనేది కఠిన సత్యం. ఇందుకు అనేక సంఘటనలను సాక్ష్యాలుగా చూపవచ్చు. తాజా సంఘటన అత్యంత కీలకమైనది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టిన అంశం- ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు.
ఇంటర్ ఫలితాలలో గందరగోళం విద్యార్థుల పాలిట మత్యు పాశమే అయ్యింది. ఆశ్రిత పక్షపాతం, పాలనా నిర్లక్ష్యం ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయం. ఫలితాల్లో తప్పులు, మార్కులలో గందరగోళంపై ఇంటర్ బోర్డు ముందుగా తమను తాము సమర్థించుకోవడం చూశాం. పైగా ''పిల్లలు ఫెయిల్ కావడానికి పూర్తిగా వారే కారణమనీ, వాళ్లు ఎలా రాస్తే అలాగే మార్కులు వస్తాయని'' దబాయించారు కూడా!
ఈ వైఖరే సమస్యను జటిలం చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఈ మాటలు, ప్రవర్తన తీవ్రమైన మనోవేదనకు గురిచేశాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై ఒక నిర్ణయం ప్రకటించలేకపోయింది. ప్రభుత్వం చేసిన ఆలస్యం విద్యార్థులు, తల్లిదండ్రుల సహనాన్ని పరీక్షించింది. పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు. తల్లిదండ్రులు అశక్తులయ్యారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఉద్రిక్త పరిస్థితిని అనుభవిస్తోంది. తత్ఫలితంగా ఇంటర్ విద్యార్థులు ఒక్కరొక్కరుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వం మిన్నకుండినట్టు చూస్తూ కూర్చున్నది. తమవారి తప్పుల గురించి ఏం చేయాలో అర్థంగాక సందిగ్ధంలో పడిపోయింది. 99 మార్కులొచ్చిన విద్యార్థులకు ''00'', రెండు సున్నాలు వేసిన ఘనత ఇంటర్మీడియట్ బోర్డుకే దక్కింది. ఈ విషయం తెలిసిన అధికారులు తమను తామే రక్షించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ తప్పులు పిల్లల అంతరంగాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తాయో అటు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు గుర్తించడంలో విఫలమయ్యారు. ''ఆలస్యం అమృతం, విషం'' అంటుంటారు. కానీ ఇంటర్ ఫలితాల విషయంలో ''ప్రభుత్వ పెద్దల అలసత్వం, ఆలస్యం విద్యార్థుల పట్ల విషాన్ని చిమ్మింది'' అనడంలో సందేహమే లేదు. ఫలితాలు వెలువడిన వారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అంతా ఉచితమంటూ ప్రకటించారు. అంతేనా పిల్లలెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. అక్కడితో ఆగకుండా ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేయడానికి ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కొత్త ప్రతిపాదనలతో ఈ చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.
అసలు గందరగోళమంతా మార్కుల ఎంట్రీలోనే వచ్చిందని, ఆ వ్యవహారం అంతా 'గ్లోబరీనా' అనే సంస్థ చూస్తున్నదనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ సంస్థ 'యువరాజు' మిత్రుడిదేనని, అనేక సంవత్సరాలుగా డేటా ఎంట్రీ నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ను తప్పించి అసలే అనుభవం లేని యువరాజు స్నేహితుడి సంస్థకు కట్టబెట్టడం వల్లే ఈ గందరగోళం చోటుచేసుకున్నదనే విషయం సోషల్ మీడియా, మీడియాలో ప్రముఖంగా వినిపించింది. దాంతో యువరాజు వార్తల్లోకెక్కారు. దానికి ఆయన వివరణ ఇస్తూ ''తనకు తన మిత్రుడు మాత్రమే తెలుసునని, గ్లోబరీనా అనే సంస్థ పేరు కూడా తాను ఇప్పుడే వింటున్నానని'' నమ్మబలికాడు. ఈ పూర్తి సంఘటన పట్ల వారం రోజులు చర్చించుకొని, ఏమి మాట్లాడాలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రక్షణాత్మకంగా మాట్లాడినట్టు ఈ తండ్రి కొడుకుల వ్యవహారం అగుపిస్తుందే కానీ అత్యంత ప్రతిష్టాత్మక పదవుల్లో ఉండేవారు ప్రవర్తించాల్సిన రీతి, నీతి కనబడదు. ఈ మొత్తం వ్యవహారంలో విద్యా మంత్రి స్పందన, రాష్ట్ర మంత్రి మండలి బాధ్యత, పాలక పక్ష ఎమ్మెల్యేల వైఖరిని గురించి ఏమైనా చెప్పు కొందామన్నా ఏమీ లేదని గుర్తించాలి. ఆ వారం రోజులు గవర్నర్ సతీ సమేతంగా గుళ్లు గోపురాలు దర్శించుకోవడంలో బిజీగా ఉన్నందున వారి పాత్రధారణ అంతా కుంకుమ పసుపులతోనే నిండి ఉన్నది. వాటి మధ్యలో పిల్లల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల గుండెకోతలు ఆయనకు వినిపించకపోవడం శోచనీయం.
విద్యా వ్యాపారమైతే, విద్య వ్యాపార వస్తువు అయితే, విద్య అంగడి సరుకు అయితే... ఆశ్రిత 'పక్షపా(వా)తం' పాలకులకు సోకితే పసి పిల్లలు చితికిపోతారనే విషయాన్ని ఈ సంఘటన మన కండ్ల ముందు ఉంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఆత్మహత్యలు రాష్ట్రం సిద్ధించినా కొనసాగుతుండటం ఎవరి తప్పు?
- కె.శ్రీనివాసాచారి
సెల్ : 8096653459