Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైకి ఎగురవేసే బెలూన్లో గాలి ఎక్కువైతే పగిలిపోతుంది. తక్కువుంటే పైకి అసలే ఎగురదు. బెలూన్ కెపాసిటీ తగినట్టుగానే గాలి కొట్టాలి. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజకీయ పరిస్థితి ఎక్కువ గాలి కొట్టిన బెలూన్లా తయారైంది. ఇతర పార్టీలకు చెందిన ఎక్కవ మందిని చేర్చుకోవడం ఒక ఎత్తు అయితే...హరీశ్రావును సైడ్ చేయడం మరో ఎత్తు. ఈ రెండు పరిణామాలతో టీఆర్ఎస్లో గాలి ఎక్కువైంది. బెలూన్ పలిగిపోతుందా? ఎగురుతుందా? అన్న అనుమానాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు జంపింగ్ జపాంగ్ల గోడ దూకటాలు...మరోవైపు ఇదిగో పులి...అదిగో తోక అన్న ప్రచారాలూ...కొత్త పార్టీ రాబోతుందన్న ఊహాగానాల మధ్య రాష్ట్రంలో ఏం జరుగబోతున్నదోనన్న ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతున్నది. దీనికితోడు హరీశ్రావు హాట్టాపిక్ అయి కూర్చుండు. కాళేశ్వరం ప్రాజెక్టు శిలాఫలకం దగ్గర నుంచి పూర్తయ్యే దాకా దగ్గరుండి పనులు చేయించిన మాజీమంత్రి హరీశ్రావును ప్రారంభోత్సవానికి పిలవకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శనాత్మక చక్కర్లు కొడుతున్నాయి. 'కష్టం ఒకరిది...పేరు మరొకరిది', 'శివుడు లేని గంగ లేదు..హరీశ్రావు లేని కాళేశ్వరం లేదు', 'సమైక్యవాది జగన్కు పిలుపా..హరీశ్రావు కనిపించడా' అంటూ ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ను ఖాళీ చేశాం...ఇగ హరీశ్రావు పాత్ర అవసరం లేదని కేసీఆర్ ఇలా చేస్తున్నడా? లేదా డీఎంకే-అన్నాడీఎంకే ఫార్ములాతో ఉద్దేశ్యపూరితంగా చేస్తున్నడా? అన్న చర్చ జోరుగా నడుస్తున్నది.
-అచ్చిన ప్రశాంత్