Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అధ్యక్షా... నాకు కొంతమంది ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు 23మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18మందో, 17మందో ఉంటారు. ఫలితంగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు. విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు. కానీ అలా చేస్తే నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుందని చెప్పా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పదలిచా. ఆ పార్టీ (టీడీపీ) నుంచి మేమెవరినైనా తీసుకుంటే వారిని తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలా కాకుండా ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా మీకే విన్నవిస్తున్నా. ఇలాంటి గొప్ప విధానాలు మళ్లీ ఈ శాసనసభకు వస్తాయని ఆశిస్తూ, మీరు ఆ పని చేయగలరని పూర్తిగా విశ్వసిస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా' ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ను ఉద్దేశించి చెప్పిన మాట. దీనికి వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంటుందని, ఉండాలని ఆశిద్దాం. నిజానికి కట్టుబడి ఉండటం పెద్ద సమస్య కూడా కాదు.
సీన్ తిరగేస్తే ఒక్కటి మాత్రం స్పష్టం. వైసీపీ అనే తోడేలు మేకపిల్లగా మారిన తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే తినదలచుకున్నదనే సంకేతాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే వెలువడ్డాయి. అయితే అది ఎలా? ఎప్పుడు? ఇక్కడ కొన్ని ఆల్జీబ్రా లెక్కలు పరిష్కారం కావాల్సివుంది. ఇటీవలి రాజకీయాలను గమనించినప్పుడు ఒక ధోరణి స్పష్టం. ఏదైనా ఒక పార్టీ అధికారానికి వస్తే జనానికి ఏమి చేస్తారో తెలియదు గానీ ప్రత్యర్థి పార్టీని తొక్కివేయటం లేదా విలీనం చేసుకోవటం తక్షణ కర్తవ్యంగా ఉంటోంది. అందువలన పైకి ఎవరెన్ని సుభాషితాలు పలికినా జరిగేదేమిటో అందరూ ఊహించుకుంటున్నదే. ఆ సినిమా ఎలా ఉంటుందో చూడబోయే ముందు కొన్ని అంశాలను చూద్దాం.
ఏదైనా ఒక చట్టం చేస్తే దానిలోని లోపాలను ఎలా తొలగించాలా అనిగాక దానికి ఎలా తూట్లు పొడవాలా అని మన దేశంలో వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఎన్నికైన వారు గోడదూకకుండా చూసేందుకు కాంగ్రెస్ నేత రాజీవ్గాంధీ ఆలోచనగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. పార్టీ నుంచి విడిపోతామనే బెదిరింపులను ఎదుర్కోవడంలో భాగంగానే ఇది జరిగిందన్నది స్పష్టం. దీని ప్రకారం ఒక సభ్యుడు తనంతట తాను పార్టీకి రాజీనామా చేసినా, లేక పార్టీ విప్ను ధిక్కరించి ఓటింగ్లో పాల్గొన్నా, ఉద్దేశ్యపూర్వకంగా సభకు గైర్హాజరైనా చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోతారు. అయితే ఒక పార్టీకి పార్లమెంట్ లేదా అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంలో మూడో వంతు గనుక చీలి కొత్త పార్టీ పెట్టినా లేదా వేరే పార్టీలో విలీనమైనా అనర్హత వేటు పడదు. ఇలాంటి చర్యలను చట్టసభల స్పీకర్లు కాకుండా ఎంపీలైతే రాష్ట్రపతి, ఎమ్మెల్యేలైతే గవర్నర్లు చర్యతీసుకోవాలని కొన్ని కమిటీలు సిఫార్సు చేశాయి. కానీ వాటిని ఇంతవరకు ఆమోదించి చట్ట సవరణ చేయలేదు. అయితే ఒక సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయకుండా పార్టీలో తిరుగుబాటు చేసి బహిరంగంగా వేరే పార్టీకి మద్దతు ప్రకటిస్తే లేదా పార్టీని ధిక్కరించినా సభ్యత్వానికి అనర్హుడని, స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లే పరిగణించాలని సుప్రీం కోర్టు ఒక కేసులో పేర్కొన్నది. తొలుత చేసిన చట్టంలో స్పీకర్ నిర్ణయానికి తిరుగులేదని పేర్కొన్నారు, అంటే దానిని సమీక్షించే అధికారం కోర్టులకు లేదు. స్పీకర్ నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోవటానికి అవకాశం లేదు. 2015లో తెలంగాణలో అదే జరిగింది. అయితే అనర్హత పిటీషన్పై ఎంత వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలనేది స్పష్టంగా పేర్కొనకపోవటంతో స్పీకర్లు నిరవధికంగా నిర్ణయాన్ని వాయిదా వేసి విమర్శలపాలైన ఉదంతాలున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఫిరాయించిన ఒకరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేరినప్పటికీ సభ్యత్వం మీద స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటంతో ఎలాంటి అనర్హతకు గురి కాలేదు. 2004లో చేసిన చట్టసవరణకు 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం మూడోవంతుకు బదులు మూడింట రెండువంతుల మంది చీలితేనే ఆ చీలికకు చట్టబద్దత ఉంటుంది, అనర్హత వేటును తప్పించుకోగలరు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన 15 మందిలో 12 మంది టీఆర్ఎస్లో చేరేవరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైన సంఖ్య చేరగానే 2016లో స్పీకర్ తెలుగుదేశం శాసనసభా పక్షం టీఆర్ఎస్లో విలీనమైనట్టు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి ఫిరాయించిన వారిపై 18నెలల పాటు స్పీకర్ చర్య తీసుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో అసెంబ్లీ సభ్యత్వానికి ఉత్తమ్కుమార్రెడ్డి రాజీనామా చేయగానే అవసరమైన సంఖ్య కూడటంతో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయటం కూడా ఇదే పద్ధతిలో జరిగింది.
ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగనుందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కుముడులున్నాయి. వాటిని పార్టీలు ఎలా పరిష్కరిస్తాయన్నది ఆసక్తికరం. ప్రస్తుతమున్న 23మంది సభ్యులలో 13మంది తమతో సంబంధాలలో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారు అనర్హత వేటును తప్పించుకోవాలన్నా లేక రాజీనామాలతో నిమిత్తం లేకుండా వైసీపీలో చేరాలన్నా 16మంది కావాల్సి ఉంది. ఇక్కడ అస్పష్టమైన దృశ్యాలు కొన్ని కనిపిస్తున్నాయి. వైసీపీ వారు చెబుతున్నట్టు 13మంది టచ్లో ఉంటే మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే చట్టబద్దంగానే ఫిరాయింపులకు స్పీకర్ ఆమోద ముద్ర వేస్తారు. లేదా నాటకాన్ని రక్తి కట్టించేందుకు ముగ్గురిచేత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయిస్తే తెలుగుదేశం బలం 20కి పరిమితమైతే 13మంది అనర్హత వేటు తప్పించుకొని చట్టబద్దంగానే వైఎస్ఆర్సీపీ లేదా మరో పార్టీలో చేరవచ్చు లేదా తమదే అసలైన తెలుగుదేశం అని ప్రకటించుకొని సభలో కూర్చోవచ్చు. అదే జరిగితే పార్టీ మారకుండానే, రాజీనామా చేయకుండానే అధికారపక్షంతో లేదా మరొక పక్షంతో సహజీవనం చేసే అవకాశం వస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్కు కొత్తగా పోయిందేమీ లేదు కనుక దానికి ఎలాంటి బాధ లేదు. కేంద్రంలో అపరిమిత అధికారం కలిగివున్న తమకు ఏపీలో ప్రాతినిధ్యం లేకపోవటం బీజేపీకి తలకొట్టేసినట్టుగా ఉంది. అందుకోసం అది వైసీపీకి వల వేసిందన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. అది వలపు వలా లేక కేసులదా అన్నది వేరే అంశం. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ రెండింటికీ సున్నా చుట్టిన బీజేపీతో కలిస్తే మొదటికే మోసం వస్తుందేమో, తరువాత చూద్దాం ముందు మీరు కాస్త తగ్గండి అని వైసీపీ చెప్పి ఉండవచ్చు, విధిలేని స్థితిలో బీజేపీ సరే అని ఉండవచ్చు. అనూహ్యంగా బీజేపీ కేంద్రంలో రెండోసారి పెద్ద మెజారిటీతో అధికారానికి వచ్చింది గనుకనే ఎన్నికలకు ముందు మాదిరి అది ఉంటుందా అంటే ఉండదు. దాని లక్షణం అది కాదు. మహారాష్ట్రలో తోటి హిందూత్వ పార్టీనే తొక్కేసి ముందుకు వచ్చిన పార్టీ అది. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీతో వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం. వాటికీ ఆంధ్రప్రదేశ్కు తేడా ఏమిటంటే మిగతా చోట్ల సీబీఐ, ఈడీలను ప్రయోగించాల్సి ఉండగా ఇక్కడ ఆ పని ఎప్పుడో చేశారు. కనుక జగన్ ముందు వాటి నుంచి బయటపడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి బీజేపీ ఆ కత్తిని ఎప్పుడూ చూపుతూనే ఉంటుంది.
రాజకీయం ఒక వ్యాపారం అనుకుంటే ప్రతి పార్టీ లాభం కోసం వెంపర్లాడుతుంటుంది. ఆ రీత్యానే ఎన్నికలైన వెంటనే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి తెరతీసినట్టు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్లోకి పోగా మిగిలిన కాంగ్రెస్ను తమలో విలీనం చేసుకొనేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పనికిరాదు గానీ కాంగ్రెస్ నాయకులు బీజేపీకి ముద్దొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి గతంలోనే కొందరు కాంగ్రెస్ పెద్దలు బీజేపీలో చేరారు. బీజేపీ ఏకంగా తన అధ్యక్షుడినే కాంగ్రెస్ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కన్నేసినట్టు చెబుతున్నారు. నిజానికి బీజేపీ గతంలోనే తెలుగదేశం పార్టీని మింగేసేందుకు ప్రయత్నించిందనే వార్తలొచ్చాయి. అది ప్రత్యేక హోదాకు మోడీ సర్కార్ తిరస్కారం వంటి వివిధ కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు అదే జరిగితే ఏమౌతుంది, జగన్ దాన్ని పడనిస్తారా అన్నది ప్రశ్న. తన మీద వున్న కేసుల పరిష్కారానికి జగన్ తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకాలం ఆయనను వెంటాడిన తెలుగుదేశం నేతలు బీజేపీలో చేరితే వైసీపీకి మింగా కక్కలేని స్థితి వస్తుంది. ఒక వేళ అదే జరిగితే ముందుగా దెబ్బతినేది తెలుగుదేశమే కనుక ఇప్పటికైతే తమకెలాంటి ఢోకా ఉండదనుకొని వైసీపీ సర్దుకుపోతుందా? తాను బలపడటానికి ఇతర పార్టీలనుంచి చేర్చుకున్న నాయకులకు పని ఇవ్వకుండా బీజేపీ మాత్రం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం తరువాత అదే బీజేపీ తాను బలపడేందుకు సీబీఐ, ఈడీ సంస్థలను ప్రయోగించి జగన్ అనుచరులను లక్ష్యంగా చేసుకొంటే అనివార్యంగా వైసీపీ సలాం కొట్టాలి లేదా లడాయికి దిగాల్సి ఉంటుంది. కర్నూలు వంటి చోట్ల కోట్ల, కేఈ వర్గాలే కలసిపోగా లేనిది వైసీపీ తన అవసరాల కోసం కనీసం జగన్ కేసుల నుంచి బయటపడేంతవరకు అయినా సర్దుబాటులో పయనించే అవకాశాలే ఎక్కువ. లేదూ చేతులారా తెలుగుదేశం నాయకత్వాన్ని బీజేపీకి అప్పగించటమెందుకు, చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన తెలుగుదేశాన్ని ఏదో విధంగా మనమే కలిపేసుకుంటే ఒక పనైపోలా అని అనుకుంటే వేరే చెప్పాల్సిన పనేముంది!
- ఎం కోటేశ్వరరావు
సెల్ : 8331013288