Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల తతంగం ముగిసింది. ప్రజా వ్యతిరేక శక్తులే మళ్లీ అధికారంలోకి వచ్చాయి. ''దేశ ప్రజలకు ఇసుమంత మేలుకూడా చేయని ఆర్ఎస్ఎస్ - బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఎలా గద్దెనెక్కగలిగింది? తప్పు ఎక్కడ జరిగింది??'' -అనే అంశాన్ని విశ్లేషించాలి. ఆరెస్సెస్ - బీజేపీ శక్తులను ''హిందూత్వ'' వాదులు అంటూ పిలవడం సమంజసమేనా? హిందూత్వ వాదులు అనే బదులు.. వారి అసలు స్వరూపాన్ని ప్రజల ముందు బహిర్గతపరిచే పదాలను, పేర్లను వాడలేమా?.. ఈ అంశాల గురించి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.
నేటి సంఘ్ పరివారపు ఆది గురువైన వి.డి.సావర్కర్ మొదటగా ఈ ''హిందూత్వ'' పదాన్ని ప్రచారంలో పెట్టాడు. హిందూమతంలోని ప్రజలందరి ప్రయోజనాలు నెరవేరాలంటే.. వారి అభివృద్ధి జరగాలంటే.. హిందూ ప్రజలందరూ మతోన్మాదం తలకెక్కించుకుని.. ఇతర మతస్తుల పట్ల శత్రు వైఖరితో వ్యవహరిస్తూ.. హిందూ రాష్ట్రాన్ని స్థాపించుకోవాలన్నదే.. సదరు ''హిందూత్వ'' పదం అసలు ఉద్దేశం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే - హిందూత్వ పేరుతో జరిగే రాజకీయాల్లో సామాన్య(మెజారిటీ) హిందువులకు ఒరిగేది శూన్యమే. హిందువులందరి ప్రయోజనాల పేరుతో హిందువులలోని కేవలం అతికొద్ది శతంగా ఉన్న కొందరు కుల దురహంకార స్వార్థపర శక్తుల ప్రయోజనాలే నెరవేరుతాయి. అదనంగా.. దేశ ప్రజలందరిని దోపిడీ చేసే కార్పొరేట్, బడా పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల స్వార్ధ ప్రయోజనాలను కూడా ఈ హిందూత్వ రాజకీయాలు నెరవేరుస్తాయి. వాస్తవం ఇది అయినప్పుడు ఈ మతోన్మాద - మనువాద మూకల గురించి ప్రజలను జాగరూకులను చేయాల్సిన మనం.. వారి అసలు ఉద్దేశాలను మరుగుపరిచే రీతిలో.. వారు పెట్టుకున్న ముసుగు పేర్లతోనే వాళ్లని పిలవడం ఎంతవరకు కరెక్టు? ''హిందూత్వవా దులను తిరస్కరించండి.. హిందూత్వను ఓడించండి..!'' అంటూ ప్రజలకు పిలుపునివ్వడం ఎంత మేరకు ఫలితాలనిస్తుంది?
మూలంలోకి వెళ్లి తరచి చూస్తే.. భారత దేశ చరిత్రలో ''హిందూ'' పేరుతో ఒక మతమే లేదు. వైదిక మతాన్నే నేడు అందరూ హిందూమతంగా పలుకుతున్నారు, భావిస్తున్నారు. ''హిందూ'' అనే పదాన్ని మొట్టమొదటగా ప్రపంచానికి పరిచయం చేసిన పారసీకుల అర్థంలో.. సింధూ నది ప్రాంతమే హిందూ ప్రాంతం, సింధూ ప్రాంతవాసులే హిందువులు! పారసీక భాషలో 'స' అనే అక్షరం లేక.. స బదులు 'హ' వాడిన కారణంగా.. హిందూ పదం పుట్టుకొచ్చింది. అయితే.. ఇప్పుడు ఈ అంశం స్థిరపడిపోయింది. దేశంలో ఈ మతోన్మాద - మనువాద మూకల పనితీరును.. మరీ ముఖ్యంగా గత ఐదేండ్ల అనుభవాన్ని పరిశీలిస్తే ఒక్క విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను, ప్రజలు గమనంలోకి తీసుకోవాల్సిన అసలు అంశాలను పక్కదారి పట్టించే రీతిలో.. ప్రజల కండ్లకు గంతలు కట్టే నేరేటివ్స్ (అaతీతీa్ఱఙవర)ను సృష్టించడమూ.. వాటిని ప్రజలలో విస్తృతంగా వ్యాప్తి చేయడమే వాళ్ల విజయానికి కారణం అవుతున్నది. ఈ శక్తులు సృష్టిస్తున్న నేరేటివ్స్ గుట్టు విప్పి వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పే బాధ్యత మనదే కదా!? మరి ఆ బాధ్యతను సక్రమం గా నెరవేర్చే క్రమంలో.. వాళ్లు పెట్టుకున్న గౌరవప్రదమైన పేరునే వాళ్లకి అంటగడితే వాళ్ల ఉచ్చులో మనం పడినట్టే కదా? హిందూమతంలోని ప్రజలందరి అభివృద్ధి వాళ్ల లక్ష్యం కానప్పుడు.. వాళ్లని హిందూత్వవాదులని అనడం సరైనది కాదు. వాళ్ల అసలు రూపాన్ని ప్రజలకు తెలియజెప్పే సరైన పదాలను మనం వాడాలి. మరి ఆ సరైన పదాలు ఏమిటి? ''మతోన్మాద శక్తులు'' అనే పదం వాడటమే సరైనది అవుతుంది. లేదా.. వాళ్ల అసలు ఉద్దేశాన్ని మరింత స్పష్టంగా బయటపెట్టే ''మతోన్మాద - మనువాద శక్తులు'' ఇంకా సరైనది.
''హిందూత్వ శక్తులు'' అనే పేరు వాడడం వల్ల జరిగే నష్టం ఏమిటి? హిందూ మతాన్ని దుర్వినియోగ పరిచే క్రమాన్ని కొందరు స్వార్థపరశక్తులు మొదలు పెట్టినంత మాత్రాన.. సామాన్య హిందువులు తమకు తాము హిందూ పదం నుంచి దూరం జరుగరు కదా! వారందరూ తమని తాము ఇప్పటికీ హిందువులుగానే భావిస్తుంటారు. తాము హిందూ మతానికి ప్రతినిధులుగా చెప్పుకునే మతోన్మాద మనువాద శక్తులు హిందూత్వ పేరుతో మనలాంటి వారినుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు సామాన్య హిందువులలో వారు ఏ రీతిన ప్రచారం చేస్తారో మనం గుర్తించా ల్సిన అవసరమున్నది. ''హిందూ సోదరులారా.. వాళ్లు హిందూత్వను ఓడిం చండి అని చెబుతున్నారు. హిందూత్వలో తప్పేముం ది? నువ్వూ నేనూ హిందువులమే కదా! హిందూత్వ అంటే హిందూతత్వమేకదా!..'' ఈ రీతిన ఒక నేరేటివ్ను సృష్టించి.. దానికి అనేక అంశాలను జోడిస్తూ.. చివరగా.. ''మీరు హిందువులైతే హిందూత్వను ఓడించడం కాదు.. హిందువులకు శత్రువులైన హిందుత్వ వ్యతిరేకులను.. అనగా, కమ్యూనిస్టులను/ అంబేద్కరిస్టులను ఓడించండి..!'' అంటూ ప్రజలకు పిలుపునిస్తారు. ''వాళ్లు హిందూత్వవాదులు కాదు.. మతోన్మాదులు, మనువాదులు!'' అని తెలియజెప్పాల్సిన మనమే.. ''హిందూత్వ.. హిందూత్వ..'' అంటూ పదేపదే అంటే.. సదరు మతోన్మాద - మనువాద శక్తుల పని ఇంకా సులువవుతుంది.
''కాషాయం మాది'' అంటూ వాళ్లు చెప్పుకుంటున్నంత మాత్రాన వాళ్లను కాషాయ మూకలు అంటూ పేర్కొనడం కూడా తప్పే అవుతుందని నా అభిప్రాయం. నేటి పరిస్థితుల్లో ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్న ప్రతీకలేవీ కూడా మతోన్మాద - మనువాద శక్తులకు దక్కకుండా చూడటమే సరైన రణనీతి అవుతుంది. మనకు మనమే కాషాయాన్ని, వివేకానందున్ని, హిందూమత చిహ్నాలని వారి చేతుల్లో పెట్టడం.. కూడా సరికాదు. కుల దురహంకారాలని వేల ఏండ్ల నాడే వ్యతిరేకించి.. సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన మానవతా మూర్తి బుద్ధుడు ధరించిన కాషాయం.. వాళ్లదెలా అవుతుంది? బౌద్ధాన్ని ఈ దేశంలో నామరూపాల్లేకుండా చేయడానికి కుట్రలు పన్నిన మనువాదులకు కాషాయరంగును అప్పజెపుదామా? సామాన్య ప్రజలు తమకి తాము ఐడెంటిఫై అయ్యే.. స్వంతం చేసుకునే సాంప్రదాయక ప్రతీకలేవీ కూడా ప్రజావ్యతిరేక శక్తులకు దక్కకుండా చేయడంకూడా నేటి అవసరం. తాము చెప్పే విషయాలు ప్రజలకు సరిగా చేరుతున్నాయా లేదా అనే విషయంలో తప్పక శ్రద్ధ వహించాల్సిందే. భాష గురించి, పదజాలం గురించి.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రజలకు అసలు విషయాలను తెలియజెప్పి, వారిని జాగరూకులను చేసే క్రమంలో మతోన్మాదులు సృష్టించే నేరేటివ్స్ను మనం బద్దలు కొట్టాలి. సరైన భాషని వాడాలి. మతోన్మాద శక్తుల పనితీరు గురించి సునిశితంగా అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తల అనుభవాన్ని మనం సక్రమంగా వినియోగించుకోగలగాలి. రొమిల్లా థాపర్, అస్ఘర్ అలీ ఇంజనీర్, ఏ.జి. నూరాని, రామ్ పునియామి, బిపన్ చంద్రలు అందించిన విలువైన సమాచారం మనకు ఈ అంశంలో మార్గనిర్దేశం చేయాలి. ఈ సామాజిక వేత్తలు అందరూ తేల్చి చెప్పింది ఒక్కటే. మతోన్మాదం అనేది ఒక విశ్వాస వ్యవస్థ. ఒక భావజాలం. భావజాల రంగంలో.. ఓరిమితో నిరంతర పోరాటం ద్వారానే మతోన్మాదాన్ని మనం ఓడించగలం.
- హరప్పా