Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటు ఎన్నికలలో వామపక్షాలు బాగా దెబ్బతినడంతో పత్రికలలో అనేక కోణాల నుంచి రచయితలు వ్యా ఖ్యలు చేస్తున్నారు. సంతోషం. ఈ వ్యాఖ్యలు మూడు రకాలు. మొద టిది ఇస్లాం, క్రైస్తవ సంస్కృతుల మధ్య సంఘర్షణలో హిందూ సంస్కృతి క్రిస్టియన్లను బల పరుస్తున్నదన్నదానికి మోడీ, జగన్ మధ్య సహకారంగా చూపుతున్నారు. రెండోది ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాల ప్రచారం నికరంగా చే యడం వల్లనే ఈ విజయం సాధ్యమైందనేది. మూడో ది కమ్యూనిస్టులు సమాజానికి అవసరం లేదు. కమ్యూ నిస్టుల పని అయిపోయింది అనేవారు కూడా ఉన్నా రు. నిజంగానే కమ్యూనిస్టుల పని అయిపోతే వాళ్లే వ్యాసాలు రాసి ప్రజలకు కమ్యూనిస్టుల గురించి గుర్తు చేయరు. వారు రాస్తున్నారంటే దానికి ఈ దేశంలో కమ్యూనిస్టులపట్ల ప్రజలకు ఉన్న అనుబంధం ఆదర ణనే కారణం. ఎన్నికలలో గెలుపు ఓటములు సహ జం. దెబ్బతిన్నప్పుడు తప్పులను సమీక్షించుకుని సరిచేసుకోవాల్సిందే. సజీవమైన పార్టీకి ఆ లక్షణం ఉంటుంది. సరి చేసుకుంటుంది.
ఈ విమర్శలు చేస్తున్న వారు లేవనెత్తిన అంశాల ను ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రపం చంలో ఇస్లామ్, క్రైస్తవ సంస్కృతుల మధ్య సంఘర్షణ జరుగుతున్నదని, హిందూ సంస్కృతి ఇస్లాంపై దాడి చే సిన నేపథ్యంలో, హిందూ సంస్కృతి, క్రిస్టియన్ సం స్కృతి పరస్పరం సహకరించుకుంటారని ఒక ప్రముఖ జర్నలిస్టు విశ్లేషిస్తున్నారు. ఇది ఫైనాన్స్ పెట్టుబడి యు గం. ఫైనాన్స్ పెట్టుబడికి దేశాలు, ఖండాలు, సంస్కృ తులు అనే హద్దులు ఉండవు. అది ప్రపంచం చుట్టి వ స్తుంది. దానికి లాభమే సర్వస్వం. ఇప్పుడు సంస్కృతు లను పట్టించుకునే పరిస్థితి లేదు. అది కాలం చెల్లిన సిద్ధాంతం. ఈ రోజు మోడీ హిందూ సంస్కృతికి ప్రతి నిధి, జగన్ క్రైస్తవుడు అయినందునే బలపరుస్తున్నాడు అంటే అది అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమే. మోడీకి జగన్తో అవసరం ఉందా అంటే అవుననే స మాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం లో కేజీ బేసిన్లో క్రూడ్ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అవి రిలయన్స్ వారికి అప్పణం గా ధారాదత్తం చేయాలి. ఆంధ్రకు పొడుగైన సముద్ర తీరం ఉన్నది. అందులో (పోర్టు) ఓడ రేవులు అధానీకి కావాలి. అందుకే జగన్పట్ల మోడీకి ప్రేమ. ఇక్కడ మతం కాదు లాభమే సిద్ధాంతం.
అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేయడమనేది ''పెట్రోల్'' నిక్షేపాలపై ఆధిపత్యం కోసమే. దీనికి ఒక కథ పుట్టించారు. ఉదాహరణకు 'ఇరాక్'లో స్వేచ్ఛ, ప్రజాస్వా మ్యం లేవనీ అక్కడ మానవ సమాజాన్ని అంతం చేసే ఆయుధాలను సద్దాం హుసేన్ తయారుచేసి ఉంచాడనీ కారణాలు చెప్పి యుద్ధం చేసి సద్దాంని చంపారు. అక్కడ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారా? లేదే..! సంస్కృతు ల మధ్య సంఘర్షణ ఉంటే ఇస్లాంను దెబ్బతీసి క్రిష్టియన్ చర్చీలు స్థాపించి, ఇరాకీలను మతం మార్పిడి చేసి తమ క్రిస్టియన్ మత వ్యాప్తి చేయడం లేదు కదా? అక్కడ ఆరి ్థక వ్యవస్థపై ఆధిపత్యం సాధించి, పరిశ్రమలను, బ్యాంకు లను స్వాధీనం చేసుకుని అమెరికన్ కంపెనీలకు అప్పచె ప్పారు. ''పెట్రోల్'' బావులపై పెత్తనం సాధించారు. వారి కి కావాల్సింది అదే. ఇరాక్లో ఇరాకీ ప్రజలపట్ల అమెరికా ప్రేమ ఒలకపోయడానికి కారణం పెట్రోల్పై పెత్తనం కోసమే. ఇప్పుడు ఆంధ్రలో జగన్ పట్ల మోడీ ప్రేమ ఒలకపోయడానికి కారణం ఆంధ్రాలో అంబానీ, అధానీ లకు వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికే. ఇక్క డ సంస్కృతులకు స్థానం లేదు. సంస్కృతుల సంఘర్షణ అసలే లేదు.
భావజాల రంగంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న ని రంతర కృషి ఫలితంగానే ఈ స్థాయికి చేరాయనే వాదన కూడా ఉన్నది. వారి భావజాలంలో ముఖ్యమైనవి హిం దూత్వ, రామమందిరం నిర్మించడం. 2014, 2019 ఎన్నికలలో ఈ భావజాలాన్ని బీజేపీ మూటకట్టి ఆటక మీద పెట్టింది. 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, దేశాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తాం, స్విస్ బ్యాంక్లోఉన్న నల్ల డబ్బును వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు. రాంమందిరం ప్రస్తావనే చేయలేదు. 2014కి ముందు బీజేపీకి 21శాతం ఓట్లు ఉంటే ఉద్యోగం అభివృద్ధి మంత్రంతో 10శాతం ఓట్లు పెరిగి 31శాతం చేరుకుని అధికారం చేపట్టారు. 2019 వచ్చే సరికే దేశ భద్రత, పాకిస్థాన్ శత్రువు, పుల్వామా, బాలాకోట్ ఇదే మంత్రం. 2019లో దేశ భద్రతను ముందుకు తెచ్చి 7శాతం ఓట్లు పెం చుకుని 37శాతం వరకు చేరుకున్నారు. అంటే తాత్కాలిక భావోద్రేకాలను రెచ్చగొట్టి నిత్య జీవిత సమస్య లను పక్కకు నెట్టేసి గెలిచారు. ఇక్కడ భావజాలానికి స్థానం లేదు. అధికారం కోసం బీజేపీ తన మాతృసంస్థ మూలాలకు కూడా చెదలు పట్టించింది.
అంబానీ, ఆధానీ తదితర పెద్ద పెట్టుబడిదారుల ఆస్తులు పెరగడానికి బీజేపీ ప్రభుత్వం తోడ్పడుతున్నందుకు వారు ఇచ్చే భారీ నిధులతో బీజేపీ జైత్రయాత్ర సాగిస్తోంది. అలాంటి కార్పొరేట్ల మద్దతుతోనే కాంగ్రెస్ ఆరు దశాబ్దాలు జైత్రయాత్ర సాగించింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? బీజేపీ కూడా అదే బాట సాగిస్తున్నది. ఎన్నికలలో మళ్లీ గెలుపునకు 2019లో రూ.27,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇతర పార్టీల వారిని సీబీఐ, ఆదాయపన్ను అధికారులతో దాడులు చేయించి దారికి తెచ్చుకుంటున్నది. సృజనా చౌదరి, సీఎం రమేష్ లాంటివారే తాజా ఉదాహరణ. 'ఎక్కడ కట్టితే నాకేంటి నాదొడ్డిలో ఈనితే చాలు' అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఇందులో భావాజాలం ఎక్కడ ఉన్నది?
'నా ఉద్యోగం సంగతేంటి? రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు? బ్యాంకులలో కుంభకోణాలు ఎందుకు కొనసాగుతున్నాయి? పరిశ్రమలు ఎందుకు మూతపడుతున్నాయి? మరి మోడీ సర్వశక్తి మంతుడైతే ఈ సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నాడు?' అని ప్రజలు తమకు తాము ప్రశ్నించుకోకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టి వారి ఆలోచనలను దారిమళ్లించారు. దేశ భద్రతే ప్రధానం అనే మైండ్సెట్ని సృష్టించి, మోడీ అయితేనే పాకిస్థాన్ను అణచగలడనే భావాన్ని రెచ్చగొట్టారు. గెలిచిన తరువాత మిగతా కాలమంతా మతతత్వాన్ని రెచ్చగొట్టి హిందువు, ముస్లింలూ అనే విభజన తెచ్చి విడివిడి శిబిరాలు ఏర్పడేలా చేస్తున్నారు. కాలాన్నిబట్టి ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు బీజేపీ వారు.
గతంలో స్వదేశీ జాగరణ మంచ్ పేరుతో విదేశీ వస్తువులను ఆర్ఎస్ఎస్వారు వ్యతిరేకించేవారు. స్వతంత్ర పోరాటంలో విదేశీ వస్తువులను బహిష్కరించిన చరిత్ర భారతీయులది. కాని ఇప్పుడు ప్రధానే స్వయంగా దేశాలు తిరుగుతూ మేక్ ఇన్ ఇండియా అని విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబాయి. విదేశీ బహుళ జాతి గుత్త సంస్థల ప్రతినిధులు మొదట కాలు మోపేది అక్కడే.. దేశ సంపద కొల్లగొట్టుకుపోవడానికి పథక రచన సాగేది అక్కడే.. నాసిక్ నుంచి 40,000 మంది రైతులు, ఆదివాసీలు కాళ్లకు రక్తం కారుతున్నా లెక్క చేయకుండా తమ సమస్యలు పరిష్కరించమని అడిగేందుకు అదే ముంబాయిలో కాలు మోపారు. వారి సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది. ప్రధాని జీడీపీ లెక్కలను తారుమారు చేసి దేశం వెలిగిపోతున్నదని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదేనా భారత్ వెలిగిపోవడమంటే!
వామపక్షాలతో సహ ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే. వామపక్షాలు పార్లమెంటులో అతి తక్కువ సీట్లతో ఉన్నాయి. సీట్లు ఓట్లు కాదనలేని కొలబద్దే. అయితే ప్రజలను పోరాటాలు చేసేలా చైతన్యపర్చడం వామపక్షాల పనిలో ప్రధానమైనది.. వర్గ పోరాటం అనేది ఒక ప్రక్రియ. కామ్రేడ్ ఇఎంఎస్ నంబూద్రిపాద్ ఒక సందర్భంలో వివరణ ఇస్తూ దేశాలను విభజించేటప్పుడు సోషలిస్టు దేశాలు, పెట్టుబడిదారి దేశాలుగానే కాకుండా మరో విభాగం కూడా ఉన్నదని పేర్కొంటూ కార్మిక వర్గ విప్లవ పార్టీ అధికారంలో లేకున్నా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల శక్తి ఉంటే అది కూడా విప్లవ మార్గంలో ఒక భాగమే అన్నారు. ఈ కోవకే భారతదేశం చెందుతుందని కూడా చెప్పారు. ఈ సూత్రం ప్రకారం చూస్తే సీపీఐ(ఎం) నాయకత్వంలో వామపక్షాలు బెంగాల్, కేరళ, త్రిపురల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, యూపీఏ ప్రభుత్వకాలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం లాంటి అనేక హక్కులు సాధించడం విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లటంలో భాగమే.
క్లుప్తంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు దేశంలోతెచ్చే మార్పు ఒక సర్జికల్ స్ట్రెక్లాగా ఉండవు. విప్లవమనేది ఒకే ఒక సంఘటనతో పూర్తికాదు. అది ఒక ప్రక్రియ. అది సుదీర్ఘకాలం జరుగుతుంది. అందులో అనేక దశలుంటాయి. ముందు వెనకలు ఉంటాయి. అనేక ఆటుపోట్లు గెలుపులు ఓటములు ఉంటాయి. అంతిమంగా గెలుపే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వేగంగానో మందగమనంతోనో సాగుతుంటుంది. గమనం మందగించినప్పుడు ఇలాంటి విమర్శలు, వ్యాఖ్యలు వస్తుంటాయి. ఈ వ్యాఖ్యాతలు 2004 ఫలితాల తర్వాత దేశం కమ్యూనిస్టులను రెండు చేతులతో స్వాగతిస్తోందని రాయలేదు. వ్యాఖ్యానించలేదు.
కమ్యూనిస్టుల పని అయిపోలేదు. రాబోయే రోజుల్లో కొత్త తరాన్ని ఆకర్షించేలా నిర్ధిష్ట పరిస్థితులను నిర్ధిష్టంగా అద్యయనంచేసి ఆచరణాత్మక విధానాలను రూపొందించుకుని ప్రజల మధ్య పనిచేస్తూ నయా ఉదారవాద విధానాలను, మతతత్వాన్ని ఎండగడుతూ పోరాట మార్గంలో ముందుకు సాగుతాయని ప్రజలకు వామపక్షాలపై ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తాయని ఆశిద్దాం. ఎప్పటికైనా కష్టజీవుల కలల్ని నిజం చేసేది కమ్యూనిస్టులే...
- టి.ఎన్.వి.రమణ
సెల్ : 9494731091