Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రమశిక్షణకు మారుపేరు... నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, సేవే పరమావధి, భక్తి భావమే ముక్తి మార్గం అంటూ సుప్రభాతాలు పలికే కమలనాథులు నేల విడిచి సాము చేస్తున్నారు. సిద్ధాంతంపై ఆధారపడి తన బలాన్ని పెంచుకోవాలనే ప్రాథమిక సూత్రాన్ని తుంగలో తొక్కింది. కాషాయరంగుకు పచ్చనోట్ల రంగు అందుతున్నది. అధికారమే పరమావధిగా రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నది. పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టినట్టు నిమ్మళంగా నడుస్తున్న ప్రభుత్వాల్లో నిప్పులు రాజేస్తున్నది. రాజకీయ నాయకులను, ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాసిన్తున్న 'డబ్బు బలహీనత'ను బీజేపీ ఆసరా చేసుకుని అంగట్లో సరుకులు కొన్నట్టు కొనేసి ఆ ప్రభుత్వాల్ని కూల్చుతున్నది. గోవా, కర్ణాటక, మేఘలయ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో ఇలా తమ బలం పెంచుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతులను వదిలి... డబ్బుస్వామ్యాన్ని నడిపిస్తున్నది. సిద్ధాంతంతో సంబంధం లేకపోయినా... ఎంతటి హీన చరిత్ర ఉన్నా... అటువంటి వారిని పార్టీలో చేర్చుకుని తమ పార్టీ కడిగిన ముత్యం అని సిగ్గులేకుండా చెబుతున్నది. కమలం గుంపులో చేరగానే పునీతులైనట్టు ప్రచారం చేసుకుంటున్నది. పైగా పలానా నాయకులు తమ పార్టీలో చేరుతున్నారంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఎంఎస్ దోనీ బీజేపీలో చేరితే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామంటూ ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు ప్రకటించడం గమనార్హం. మరోచోట ఆ పార్టీ మొత్తం ఖాళీ కాబోతున్నదంటూ ముందుగానే ప్రచారం చేస్తున్నారు. తప్పించుకు పారిపోయిన పశువుల గుంపు బీజేపీ దొడ్లలో చేరుతున్నాయి. అక్కడి నుంచి కూడా అవి తప్పించుకుని పోతాయన్న సంగతి కమలనాథులు మరచిపోతున్నారు.
- గుడిగ రఘు