Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పసిపిల్లలు, బాలికలు, మహిళలపై లైంగికదాడులు, హత్యలు, దాడులు, వేధింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల అనేకమంది పై లైంగికదాడులు జరిగాయి. అభంశుభం తెలియని పసిపిల్లలు, బాలికలను లైంగికదాడికి గురిచేస్తున్నారు. లోకం తెలియని పసికందులపై సైతం పశువుల్లా పైశాచికత్వంతో దుర్మార్గ చర్యలకు ఒడిగడుతున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే గుండె లపై కుంపటి అనుకునేవాళ్లు సైతం సామాజిక స్పృహతో ఆడపి ల్లను మాతృమూర్తిగా కొలిచేవారు. నేడు ఆడపిల్ల పుడితే 'వామ్మో ఆడపిల్ల పుట్టిందా?' అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇటీవల వరుసగా జరుగుతున్న దాడులను పరిశీలిస్తే వరంగల్లోని కుమార్పల్లిలో 9 నెలల చిన్నారిపై పాశవికంగా లైంగికదాడి చేసి హత్యచేశారు. బొమ్మల రామారం మండలం హాజిపూర్లో మైనర్లపై లైంగికదాడి జరిపి, హత్యచేసి తన బావిలోనే పూడ్చిన సైకో శ్రీనివాస్రెడ్డి. కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని చిర్రకుంట గ్రామంలో ఆరుబయట వాకిట్లో ఆడుకుంటున్న తొమ్మిదేండ్ల బాలికలిద్దరినీ అదే గ్రామానికి చెందిన నైతం జ్ఞానేశ్వర్ మాయమాటలు చెప్పి వారి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా అడవి దేవునిపల్లి మండలం నల్లమిట్ట తండాలో పదకొండేండ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. నల్లమిట్ట తండాకు చెందిన బాలిక (11) గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్లింది. ఈ క్రమంలో అడవికి సమీపంలోని పొలంలో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన జటావత్ దీప్లా (45) లైంగిక దాడికి యత్నించాడు, బాలిక కేకలు వేయగా, దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. రాజేంద్రనగర్లో ఓ బస్తీకి చెందిన చిన్నారి (4) ఆడుకోవడానికి పక్కింటికి వెళ్తే మైనర్ బాలుడు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పాప ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి తల్లికి విషయం చెప్పింది. ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోతోంది.
టీ షీమ్స్ ఏర్పాటుచేసి మహిళలకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చింది ప్రభుత్వం. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. కాని నేటికీ బాలికలు, మహిళలపై లైంగికదాడులు, దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. శుశ్రుత, మధురిన లాంటి అమ్మాయి లపై అత్యంత దారుణంగా దాడిచేసి చంపారు. సభ్యసమాజం తలదించుకొనే అరాచకవాదుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. ఈ వరుస ఘటనలతో ఆడపిల్లలను స్కూలు, కాలేజీ లకు పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడుతున్నారు. నూటికి 50 శాతంగా ఉన్న మహిళల ఓట్లతో అవసరమున్న పాలకులు, మహిళలపట్ల చులకన భావంతో, ఇంకా ఎంత కాలం ఉంటారు.
రాష్ట్రంలో నేడు ఆడపిల్ల బయటకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చేంత వరకు గ్యారెంటీ లేకుండా పోయింది. ప్రేమించమని ఒకడు, ప్రేమించకపోతే యాసిడ్, కత్తులతో దాడిచేసి చంపడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2012లో ఫోక్స్ చట్టం ప్రత్యేకించి చిన్న పిల్లలపై హింసను నివారించడం కోసం తీసుకొచ్చింది. ఫోక్స్ చట్టంలో కఠిన నిబంధనలున్నాయి. 2013లో నిర్భయ చట్టం పేరుతో కొన్ని కఠిన శిక్షలు చేర్చారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగికదాడులు జరిపితే ఈ చట్టం కింద శిక్షించవచ్చు. కతువా ఘటన తర్వాత 12 ఏండ్ల వయస్సులోపు పిల్లలపై అఘాయిత్యం చేస్తే ఉరిశిక్ష విధించే విధంగా చట్టం తెచ్చారు. 1989లో చిన్న పిల్లల హక్కులను యూఎస్వో ఆమోదించగా దానిని భారత ప్రభుత్వం ధృవీకరించి ంది. 1990లో చిన్న పిల్లల రక్షణ, వారి అభివృద్ధికోసం ఐరాస ప్రకటనను భారత ప్రభుత్వం ఆమోదించింది. 1992 బాలల హక్కుల గురించి, 2002లో బాలల స్వేచ్ఛ గురించి, 2012లో నిర్భయ ఘటనలను నియంత్రించేందుకు జస్టిస్ వర్మ సిఫార్సులు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తన పరిధిలో ఉన్న చట్టాల్ని అమలు పరిచి లైంగికదాడులకు, హత్యలకు పాల్పడిన వారిని చట్ట పరిధిలో శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగ భృతి నెలవారీగా ఇవ్వాలి. జీవితాంతం బతికేందుకు తగిన ఆర్థిక సహకారం ఇచ్చి, బాధిత కుటుంబాలు వీధిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- గుమ్మడిరాజు నరేష్
సెల్ : 9491039520