Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక మనిషి ప్రతిభకు కులం, రంగు, మతం ప్రాతిపదిక కాబోవని చరిత్రలో ఎందరో నిరూపించారు. ఒకవైపు కులం కూడు పెట్టదు అంటూనే, మరోవైపు మన దేశంలో ఒక వ్యక్తి కులం గురించి ఆరా తీసేవాళ్లు ఎక్కువైపోయారు. కులం ఆధారంగా వివక్ష అనేది మన దేశంలో వేదన కాగా, జాతి ఆధారంగా వివక్ష అంతర్జాతీయ సమాజంలో (ముఖ్యంగా ఆఫ్రికా సమాజంలో) ఒక రోదనగా మిగులుతోంది. పారిశ్రామిక విప్లవం కొన్ని మంచి పరిణామాలతోపాటు మరికొన్ని దుష్ఫలితాలను కూడా తెచ్చింది. అందులో ఒకటి సామ్రాజ్యవాదం. అద్భుతమైన సహజవనరులు, అపారమైన ఖనిజ సంపద, మూలవాసులకు జన్మస్థానమైన ఆఫ్రికా ఖండాన్ని 'చీకటి ఖండం'గా కొన్ని యూరప్ దేశాలు చిత్రించి దశాబ్ధాలపాటు దోచుకున్నాయి. ఈ క్రమంలోనే ఆఫ్రికాలోని నల్లజాతీ యులపై శ్వేత జాతీయుల ఆధిపత్యం ప్రారంభమైంది. మహాత్మా గాంధీ వంటి వారు కూడా అక్కడ అవమానాలు ఎదుర్కొన్నారు.
గాంధీజీ స్ఫూర్తితో 'ఆఫ్రికా సూర్యుడి'గా పేరుపొందిన నెల్సన్ మండేలా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి నడుంబిగించాడు. తన లక్ష్యసాధనకు ప్రారంభంలో ఆయన సాయుధ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫలితంగా మండేలా 27 సంవత్సరాలపాటు రోబెన్, పోల్స్ మూర్ ద్వీప కల్పాలలో జైలు శిక్ష అనుభవించాడు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ స మానతకు మండేలా సంకేతంగా నిలిచాడు. 1918 జులై 18న జన్మించిన మండేలా 20వ శతాబ్ధపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడిగా పేరుపొందారు. 1990 ఫిబ్రవరి 11న జైలు నుండి విడుదలైన తర్వాత మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించటానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించటానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. మన దేశం నుండి కూడా ఆయనకు మద్దతు లభించింది. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో ఆయన మలచుకున్న తీరు ఆయనకు 'దక్షిణాఫ్రికా గాంధీ'గా పేరు వచ్చింది.ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు చేపట్టిన మండేలా 1994లో దక్షిణాఫ్రికాకు నల్ల జాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడయ్యాడు. 1993లో ఫ్రెడరిక్ డిక్లార్క్తో కల్సి ఆయన నోబెల్ శాంతి బహుమతి అందుకున్నాడు. ఆయన జీవిత చరిత్రను 'లాంగ్ వాక్ టు ఫ్రీడమ్'గా 1994లో ప్రచురింపబడింది. 1990లో మన దేశం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది. తన భార్య విన్నీ మండేలాతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. పదవీ విరమణ అనంతరం ఆయన ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషి చేశాడు. 2013 డిసెంబర్ 5న తీవ్ర అనారోగ్యంతో మండేలా మరణించాడు. ఆయన జయంతిని ఐక్య రాజ్యసమితి 'మండేలా డే'గా ప్రకటించింది. అబ్రహం లింకన్, మార్టిన్లూథóర్ కింగ్లతో సరిసమానంగా మండేలాని ఆధునిక ప్రపంచం గౌరవిస్తుంది. వర్ణ సమానత కోసం ఆయన చేసిన పోరాటం ఆదర్శం, అనుసరణీయం. అయితే నేటికీ అమెరికా వంటి అగ్ర దేశాలు నల్లజాతివారిపై ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాయి. మండేలా మాటల్లో చెప్పాలంటే 'నాకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంది. భారత్లో స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ అనుసరించిన శాంతి, అహింసా మార్గాలు నాకు ఆదర్శం. ఈ మార్గాల ద్వారానే నా జాతి ప్రజల హక్కుల కోసం పోరాడతాను' అన్నారు.
- ఎమ్.రాంప్రదీప్
సెల్:9492712836