Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలానికి అతీతమైన కవి కాళోజి నారాయణరావు. తెలంగాణ గాంధీ.. మన కాలం వేమన.. ప్రతి నిమిషం పోరాటాన్ని శ్వాసించి కవిత్వీకరించిన ప్రజాకవి, ''నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని, జరిగిందంతా చూస్తూ, ఎరగనట్లు పడివుండగ సాక్షిభూతుణ్ణిగానూ, సాక్షాత్తూ మానవుణ్ణి''అని నినదించిన తెలంగాణ వేగుచుక్క కాళోజి.
''అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట'' అని ధనస్వామ్యంపై నిప్పులు కురిపించిన ఈ కలం ...మూడక్షరాల అగ్ని కణం ... ఈ ప్రజాకవి జీవితం రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. ''పుట్టుక నాది సావు నాది బతుకంతా తెలంగాణది'' అని చెప్పి తెలంగాణకు అంకిత మైన నిజమైన తెలంగాణ బిడ్డ కాళోజి. కాళోజి తండ్రి మహారాష్ట్రీయుడు తల్లి కర్ణాటక పడుచు. కాళోజి జీవితం తెలంగాణకు అంకితం. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠి, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో రచనలు చేసిన బహుభాషాకోవిదుడు. న్యాయశాస్త్రంలో పట్టాపొందాడు. కానీ ప్రజాసమస్యలే ఊపిరిగా కవిత్వమే ఆయుధంగా జీవించాడు. విద్యార్థిదశ నుంచే క్రియశీలక ఉద్యమాలలో పాల్గొంటూ జైలు జీవితం గడిపాడు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958లో శాసనమండలికి ఎన్నికయ్యాడు. ''హింస తప్పు, రాజ్య హింస మరి తప్పు ప్రతి హింస తప్పు కాదు'' అంటూ ''సామాన్యుడే నా దేవుడు'' అని ప్రకటించిన మానవతా మూర్తి కాళోజి. నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కరణ శిక్ష విధిస్తే కాళోజి అక్షరమై గర్జించాడు. ''పోరనివా, పౌరునివా'' అని ప్రశ్నించాడు. జనులలో నిద్రాణమై ఉన్న శక్తిని తన కవిత్వం ద్వారా తన నిప్పుకణికల వంటి మాటల ద్వారా మేల్కొల్పాడు. ''శాంతి శాంతట, శాంతి గుండె మండిపోతుంటే, కండ కరిగి పోతుంటే, బతుకు చితికిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే శాంతి శాంతట శాంతి, శాంతిని అందరు కోరుకుంటున్నట్టు మాట్లాడుతారు, శాంతిగా మెలగుట మంచిదే, కాని శాంతి పరిస్థితి కలదా సఖుడా!'' అని నిజాన్ని తెలిపిండు. ''దగాకోరు దుండగీడు దర్జాగా బతుకుచుండ ''సక్రమ మార్గాయానం సహించెడి వాడెవ్వడు? అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము చూసి కరిగిపోవును గుండె మాయమోసం చూసి మండిపోవును ఒళ్లు'' అంటూ సమాజం యెడల తనకున్న తపనను తెలిపాడు. కాళోజి గొడవంతా సమాజం గొడవ. పేదోడు, దగాపడ్డోడే తన గళం.. ప్రతి సంఘటనకు స్పందించిండు, నినదించిండు. కవిత్వపు చర్నాకోలుతో ఝుళిపించిండు నేనింకా ''నా'' నుండి ''మా'' వరకే రాలేదు ''నా నా ఇజాల అడుగున జాడ నా ఇజందే కనిపించు జాడ'' ''నిరసన - ధిక్కారం - ఇవీ
నా గొడవ లక్షణాలు'' అని చెప్పిన ప్రజాకవి కాళోజి.
''ప్రాంతేతరులు దోపిడీ చేస్తే
పొలిమేర దాక తన్ని తరుముతం !
ప్రాంతం వాడే దోపిడీ చేస్తే
ప్రాణంతోనే పాతరవేస్తాం''
ఇందులో క్షమాగుణం, తీవ్రత, క్రోధం, ఆక్రోశం అన్ని ఉంటాయి. తెలంగాణ భాషను ఎవరైనా కించపరిస్తే తల్లికి అవమానం జరిగినట్లే భావించేవాడు. తెలంగాణ భాష, యాస, నుడికారంలోని తీయదనం, స్వచ్ఛత తన కవిత్వంలో కనబడతాయి. ''ఏమిరా తెలంగాణ భాష అంత అగ్వకున్నాదా'' అంటాడు. నేను గిట్లనే మాట్లాడుతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయలే అని తన భాషా మమకారాన్ని తెలిపాడు. మన యాసలోనే పలుకుబళ్లలోనే మన బతుకు ఉంది. ఎవరి భాష వారికి ముద్దు. ఎదుటి వారి భాష కోసం నిన్ను నీవు కుదువ పెట్టు కోవద్దు. ఎదుటోడిని కించపరచవద్దు. ఎగతాళి చేస్తే ఊరు కోవద్దు! మనసులో ఉన్న భావాలు చెప్పలేనపుడు అది కవిత్వమే కాదు అన్నాడు కాళోజి! నిజం కదా! కాళోజి జీవనతత్వమే మాటల ప్రవాహమైంది! ఆయనది తనదైన సొంత పంధా! కాళోజికి సాటి కాళోజియే ! ఆయనే తన మార్గం.
కవిగా కాళోజిని ఆయన దృక్పథం నుంచి వేరుచేసి విశ్లేషించడం అంచనా వేయడం అన్యాయం. కాళోజి ఎవరిని అనుకరించలేరు, కాళోజిని ఎవరు అనుకరించలేరు. ఆయన ప్రభావం లేని తెలంగాణ కవిగాని, సమాజం గాని లేరు అంటారు వరవరరావు. మొత్తంగా కవిత్వమే తానై సమాజ హితమే తన జీవనమై దగాపడ్డ వారి కోసమే కవిత్వమై ప్రజ్వరిల్లిన కణిక కాళోజి. ఇలాంటి కవి తెలంగాణ బిడ్డ అయి తెలంగాణకై పోరాడినందుకు గర్వ పడుతున్న.. ఆయన గురించి రాస్తునందుకు ధన్యురాలవుతున్న! ఆయన యాదిల మురుస్తున్న! కవి సమాజం కోసం పని చేయాలనే స్ఫూర్తిని పొందుతున్న.
''రాజు మరణించే నొకతార
రాలిపోయే
సుకవియు మరణించే నొకతార
గగన మెక్కే
రాజు జీవించే రాతివిగ్రహములందు
సుకవి జీవించే ప్రజల
నాల్కలయందు
అన్న గుర్రం జాషువా మాటలు కాళోజి నారాయణ రావుకు పక్కాగా సరిపోతాయి !
- రమాదేవి కులకర్ణి
సెల్ : 8985613123